Monday, October 31, 2011





********************************************************************************

మనసుకు ఓ ‘తోడు’
ఎంపు-55
యవ్వనంలో జరిగే పెళ్లికి ఎలాంటి ప్రశ్నలూ ఉండవు. అది సహజం. సంప్రదాయం. కానీ ఒక వయసు దాటిన తరువాత జరిగే పెళ్లిళ్ల వెనుక దాంపత్య సుఖానికి అతీతమైన అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి పెళ్లిళ్లలో శారీరక వాంఛల ఆలోచనలు ఇద్దరికీ దాదాపు ఉండవు. అయినా, కాలం ఎంతో మారిపోయింది అనుకుంటున్నా అలాంటి పెళ్లిళ్లు ఇప్పటికీ చెవులు కొరుక్కునే విషయాలు గానే ఉండిపోతున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం జరగడం లేదు.

ఆరోగ్యకరమయిన రచనలు చేసేవాడిగా రా.వి.శాస్త్రి అభినందనలందుకున్న కేవీఎస్ వర్మ రాసిన కథ ‘తోడు’ కూడా ఒక పెళ్లి గురించినదే. ఈ కథలో భద్రయ్య పెళ్లి చేసు కోవడం జీవితంలో ఒక తోడు కోసమే. మరో కాంక్ష ఏదీ లేదు. భద్రయ్య చేసుకున్న సత్యవతికీ నలభయ్ సంవత్స రాలు దాటాయి. జుట్టు కొంచెం నెరిసింది. పేదరికం ఆమె కు పెళ్లి రాత లేకుండా చేస్తుందేమోననుకుంటున్న సమ యంలో భద్రయ్య తాళికట్టి నీడ కల్పించాడు. భద్రయ్యకు తోడు, సత్యవతికి నీడ- ఇవీ ఈ పెళ్లికి కారణాలు.

ఒంటరితనం, అదీ అరవై దాటాక, ఎంత దుర్భరమో అనుభవించిన వారికే తెలుస్తుంది అంటాడు భద్రయ్య. తోడు కథలో ఇదే కీలకాంశం. మనిషి ఆయుష్షు అంచనాకు అందనిది. కానీ జీవన ప్రమాణాల దృష్ట్యా ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటి బతికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అరవై పైబడి, ఎనభయ్ సంవత్సరాలు వచ్చే దాకా బతికే అవకాశం కనిపిస్తూ ఉంటే, ఆ మిగిలిన ఇరవై సంవత్సరాలు ఒక మనిషిని ఒంటరిగా ఉండిపొమ్మనడం ఘోరమైన శిక్షే.

జీవిత సంధ్యా సమయం వైపు నడుస్తున్న తండ్రుల తరానికి భద్రయ్య ప్రతినిధి. కొడుకూ కోడలూ లేదా కూతురూ అల్లుడు స్థితిమం తులుగానే ఉండొచ్చు-ఎక్కడో అమెరికా లోనో, లేదంటే ఇంగ్లండ్‌లోనో! ఇక్కడే ఉన్న తల్లిదండ్రులకు కూడా ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు. కానీ ఒంటరి తనం మాటో! అప్పుడప్పుడూ విదేశాల్లో ఉన్న కొడుకూ కోడలు దగ్గరకు వెళ్లినా ‘చెప్పుకోలేని’ కొన్ని బాధలతో మళ్లీ తిరిగి రావడమే అవుతోంది. అన్నీ ఉన్నా ఆత్మీయంగా పలకరించేవాళ్లు లేకుంటే జీవితంలో అదో శూన్యమే. ఈ సమస్య నుంచి విముక్తం కావడానికి ఏ కొందరో చేస్తున్న యత్నం - మళ్లీ పెళ్లి- మానవ సంబంధాలలో కొత్తకోణమే. వర్మగారి కథ పురుషుల జీవితానికే పరిమితం.

భద్రయ్య మళ్లీ పెళ్లి చేసుకుంటే అతని కొడుకు సుందర్రావు చూసిన కోణం-ఇక ‘ఆస్తిలో చిల్లిగవ్వ దక్కదు’ అనేదే. అంతేకానీ, తండ్రి అలాంటి నిర్ణయం తీసుకోవ డానికి కారణం ఏమిటి అన్న ఆలోచన మాత్రం అతడికి రాదు. అప్పుడు తన భార్య సుశీల మీద కూడా అతడికి ఆగ్రహం కలుగుతుంది. తండ్రి మళ్లీ పెళ్లి, ఆస్తిలో చిల్లిగవ్వ దక్కకుండా పోయే ఆ పరిణా మాలకి కారణం ఆమేనని అతడు భావి స్తాడు. సుందర్రావే కాదు, దారిలో కనిపిం చిన ఒక బంధువు కూడా భద్రయ్య నిర్ణ యాన్ని హర్షించలేకపోతాడు, ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే వెళ్లి, నలు గురు పెద్దల్ని కూడగట్టి వాళ్ల చేత చీవాట్లు పెట్టించు. ఆస్తంతా దానికి రాసెయ్యక ముందే జాగ్రత్తపడు’ అని ఉచిత సలహా పడేస్తాడు.

మానవ సంబంధాలకు ఆర్థికభాష్యం అన్ని కాలాల లోనూ కనిపించినా దాని విశ్వరూపం, అది వేస్తున్న వెర్రి తలలు ‘తోడు’ కథలో క్లుప్తంగానే అయినా మనసుకు హత్తు కునేటట్టు చిత్రించాడు రచయిత. అందరికీ ఆమోదయోగ్య మైన రీతిలో భద్రయ్య తన అయిదెకరాల ఆస్తిని పంచి చూపించాడు. ఇక్కడ భద్రయ్య చెప్పిన వాదన ఒక్కటే.

బాధ్యతలు ఎరిగిన వారికే అధికారాలూ ఉంటాయి. తండ్రిగా తన బాధ్యత తాను నిర్వర్తిం చాడు. కానీ కొడుకు! తన బాధ్యతలని విస్మరించడమే కాదు, తప్పుదారిలో ఉన్న కోడలిని తన దారికి తీసుకురాక పోవడమే కాదు, ఆమె దారిలోకి తనే అడుగులు వేశాడు. అయితే ఇక్కడ భద్రయ్య కోడలిని తప్పుపట్టడు. ఆమె పరాయి పిల్ల. నిజానికి భద్రయ్యది బలమైన వ్యక్తిత్వం. లోకం కోసం బతకాలని అనుకోడు. అలాఅని తను తప్పు చేయడు. ఎవరి కోసమో తన అభిప్రాయాలను మార్చు కోడు. ఆ క్రమంలోనే అతడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. తన అయిదెకరాలలో మూడు ఎకరాలు సుందర్రావు పేరన, రెం డెకరాలు సత్యవతి పేరున రాశాడు. తన తదనంతరం సత్య వతిని చూసుకోవడానికి సుందర్రావు, సుశీల ఇష్టపడకపోతే ఆమె ఎవరినైనా పెంచుకోవచ్చుననీ, తోడు కూడా తెచ్చు కోవచ్చునని విల్లు రాసి తన ఔన్నత్యాన్ని కూడా చాటుకున్నాడు భద్రయ్య.

ముసలి అత్తమామలు వద్దు, వారి ఆస్తులు మాత్రం కావాలి అనుకునే తత్వం కొందరిలో కనిపిస్తున్న నైజమే. దీనికి పరిష్కారంగా ఒకరిని తోడు తెచ్చుకుంటే మధ్య తరగతి పరిధిలో వినిపించే దుర్మార్గపు వ్యాఖ్యానాలు అందరికీ తెలిసినవే. అమెరికా వంటి స్వేచ్ఛాయుత సమాజంలోనో, పెద్ద పెద్ద నగరాలలోనో ఉన్నా ఇలాంటి పెళ్లికి కారణాలను ఊహించలేనంతగా మనుషులు జడులు గా మిగిలి ఉండడమే ఈ కథలో గొప్ప లక్షణం. (వర్మ రాసిన ‘మరొకడు’/‘నేను నేనే’ కథా సంకలనాలు మార్కెట్‌లో దొరుకుతాయి).
- ఆర్. జగదీశ్వరరావు




*******************************************************************************

అదుపుతప్పిన దున్న!
హాట్ కేక్!
ఆదరాబాదరా వచ్చాడాయన. ఆగమాగంగా వచ్చాడాయన. హైరానా పడుతూ వచ్చాడాయన. ఆయాసపడుతూ వచ్చాడాయన. తన భారీ బాడీని తనే మోసుకురావాలి కనుక మోసుకుంటూ వచ్చాడాయన. కాళ్లీడ్చుకుంటూ వచ్చాడాయన.

చేంబర్ తలుపు పట్టుకు నిలబడ్డవాడ్ని అడిగాడు ‘సార్’ వున్నాడా అని. ‘ఉన్నాడు’ అన్నాడు జమాన్ (అలియాస్ బిళ్ల బంట్రోతు) అంటూ ఎందుకో నవ్వాడు. నా ఆకారమూ ఆయాసమూ చూసి నవ్వుతున్నాడు వీడు అనుకున్నాడు వచ్చినాయన. ‘సార్ ఏ మూడ్‌లో వున్నాడు’ అనడిగాడు ఖంగారు పడుతూ. ‘మూడో రౌండ్’లో వున్నారు అన్నాడు జమాన్. ఆ వెధవ నవ్వు అందుకన్నమాట. ఇప్పుడు ‘ఇన్న’యితే బూతులు తిట్టి అవుటంటాడేమో ననుకున్నాయన ‘ఏం చేస్తాం తప్పదు’ సిట్యుయేషన్‌లాంటిది మరి అనుకున్నాడు. మెళ్లో వున్న గోల్డెన్ చెయినొకటి జమాన్ చేతిలో పెట్టి లోపలికి జొరబడ్డాడు.

ఏంటిది వేళాపాళా లేకుండా వేళ కాని వేళ వచ్చావేమిటీ వేళ రావడానికిదొక వేళా? అన్నాడు సార్ కోపంగా మైకంగా.

సారీ సార్ రాకతప్పింది కాదు తప్పదు కనక తప్పకుండా రావాల్సివచ్చింది. తప్పని తెలిసీ తప్పనిసరి పరిస్థితి కనక రాకతప్పలేదు అన్నాడు వచ్చినాయన.

ఏం జరిగింది ఏదో జరిగింది. ఏదో జరగకూడనిది జరిగివుంటే తప్ప నువ్వింత జరూరుగా వచ్చివుండేవాడివి కాదు. చెప్పు చెప్పు ఎవడైనా నా పదవికి ఎసరు పెట్టాడా. అదేమిటో గాని మెడ మీద తలవున్న ప్రతి నా కొడుక్కీ నా పదవిమీదే మోజు... తొందరగా చెప్పు. సోమరసం ఆఖరు డ్రాప్సు కూడా అయిపోయేయి అన్నాడు సార్ ఎదురుగ్గా వున్న లోటా లోపలికి చూస్తూ.
మీకై మీరు నిజం రాజీనామా చేస్తే, స్పీకరది నిజంగా అంగీకరిస్తే తప్ప, నిజంగా మీ పదవికి వచ్చిన ముప్పేం లేదు నిజంగా అన్నాడొచ్చినవాడు.

హమ్మయ్య! నా పదవి సేఫ్‌గా వుంటేచాలు. ముల్లోకాలు ఎటుకొట్టుకుపోతే నాకేం కానీ చెప్పు.
ఏం చెప్పమంటారు సార్ నీళ్లు నమిలాడు వచ్చినాయన.

ఊరికే నసపెట్టక సంగతేంటో చెప్పు అని విసుకున్నాడు సారు తన ప్రాబ్లమ్ కాదని బేఫికర్‌గా.
భూలోకం వెళ్లానా అక్కడ మా వాళ్లు డ్యూటీ సరిగ్గా చేస్తున్నదీ లేనిదీ చూద్దామనుకున్నా నా కొండొకచోట నా వెహికిల్‌ని పార్కు చేశానా అలా వెళ్లి యిలా వచ్చే సరికి అది మాయమయ్యేనా అన్నాడు వచ్చినాయన.

ఏమిటీ అని బిగ్గరగా తన అరుపుకి తానే జడుసుకునేట్టు అడిగాడు సార్.
అవును సార్. నా దున్నపోతునెవ్వరో ఎత్తుకుపోయారు సార్.
వార్నీ కొంపముంచావు గదయ్యా. నీకు అలాట్ చేసిన సర్కారీ వెహికిల్‌ని పోగొట్టావా? ఎన్నేళ్లయినా ఈ దున్నేనా అని నువ్వే ఎక్కడయినా దాచావా? అన్నాడు సారు.

మహాప్రభో అంతమాటనకండి. అలనాటి నుంచీ ఈ నేటి దాకా అలవాటయిన దున్న. దాన్ని డ్రైవ్ చెయ్యడం తప్ప మరో వాహనం నడపడం తెలీనివాడ్ని. నాకేదీ గతి దేవపతీ! నేనేం చెయ్యాలో సెలవియ్యండి అన్నాడు దున్నపోతును పోగొట్టుకువచ్చిన యముడు.
అసలే కంత్రీ నాయాళ్లుండే భూలోకానికి పట్టపగలే రైళ్లూ విమానాలూ ఎత్తుకెళ్లే చోర కళానిలయానికి ఎందుకువెళ్లావు. అసలు దాన్ని ఎక్కడ పార్కు చేశావో అక్కడ సరిగ్గా చూశావా. ‘నో పార్కింగ్’ స్థలంలో పెడితే ఏ ట్రాఫికోడన్నా స్టేషన్‌కి లాక్కెళ్లాడేమో ఎంక్వయిరీ చేశావా? అన్నాడు దేవుళ్ల లోకం మొదలయిన్నాట్నించీ పదవిని పట్టుకు పాకులాడుతున్న దేవలోకపు సంచాలకుడు.

అన్ని చోట్లా వెదికాను అన్ని స్టేషన్లూ తిరిగాను. కంప్లయింట్లు చెయ్యడానికి, నా అభిమాన దున్నను వెదికి పెట్టడానికి ఒంటె మీద బంగారమంతా భూమ్మీద లంచంగా యిచ్చుకొని వచ్చాను అన్నాడు దున్నపోతు రైడర్.

అప్పుడు చూశాడు పెద్దసార్. కిరీటంతో సహా పోతు వోనర్ ఒంటి మీద ఒక్క బంగారు నగా లేదు. అర్తు మీద కరప్షన్ మరీ యింత పేట్రేగిపోయిందా అనుకున్నాడు.

కరప్షన్ అంటువ్యాధిలా అమరలోకానికి కూడా పాక్కుంటూ వచ్చింది. అందుకే లాస్ట్ బట్ ఒన్‌గా మిగిలిన పులిగోరు చైన్, చేంబర్ జమాన్‌కి సమర్పించుకొచ్చానని అందామనుకున్నాడు కాని అది ఆయన అడ్మినిస్ట్రేషన్‌కి మచ్చ తెచ్చేమాట కనుక గెటవుట్ అంటాడని తమాయించుకుని మౌనంగా వున్నాడు.

లాభం లేదయ్యా! సర్వీసు రివాల్వర్, గవర్నమెంట్ వెహికిలూ నిర్లక్ష్యంగా పోగొడితే సస్పెన్షనే మరో దారే లేదు అన్నాడింద్రుడు. బేర్ మన్నాడు గాడ్ ఆఫ్ డెత్.

ఏం చెయ్యాలో సోమరసం సిప్ చేస్తూ ఆలోచిద్దాం అంటూ జమాన్ని పిలిచాడు లార్డ్ ఆఫ్ గాడ్స్.
ముక్కుతాడు లేని కారణాన అదుపు తప్పి వేలం వెర్రిగా విచ్చలవిడిగా కచ్చగా కల్లగా కపటంగా ఆవారాగా బినామీగా గుడీ బడీ ఆఫీసూ ఠాణా ఆసుపత్రీ అసెంబ్లీ ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తున్నది దున్నపోతు. అదే యిప్పుడు రాష్ట్రం అదే కేంద్రం అదే ప్రభుత్వం. ఛీత్కారాలు చివాట్లు దులపరింపులు వడగళ్ల వానలా పట్టించుకోకుండా వుంటానికి తమ సౌఖ్యం తమ స్వార్థం చూసుకునే వారు దొంగిలించుకొచ్చి దొడ్లో కట్టేసుకున్న యముడి దున్నో దాని క్లోనింగ్ పోతులో కాని అవి జాతినీ నీతినీ తమ గిట్టల కింద తొక్కి కొమ్ములతో కుమ్ముతుంటే సామాన్యుడి సంక్షేమం చెవుల్లో - యముని మహిషపు లోహగంటలు ఖణేల్మంటున్నయ్.

-చింతపట్ల సుదర్శన్


*************************************************************************
జనాభా 700 కోట్లు!
విశేష ఆర్ధికాభివృద్ధి ఫలాలను చూరగొనడానికి సాధనాలైన వనరులు, అవకాశాలకు దేశంలోని దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు, మైనారిటీలు, స్ర్తీలు బహు దూరంగా ఉన్నారని ఇండియా స్థితి గతులపై ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించిన కఠోర సత్యం గమనించదగినది. 1983 నుండి 2000 వరకు దేశంలో నిరుద్యోగం 7.20 శాతంగా ఉండగా, 2009-10 నాటికి 9.4 శాతానికి చేరడం గమనార్హం. ఆర్ధికాభివృద్ధి రేటు పెరుగుతున్న కొద్దీ కుబేరులు మరింతగా ధనవంతులవుతున్నారు. ప్రజలు మరింతగా ఉపాధి, ఉద్యోగాలు కొరవడి కుంగి కునారిల్లుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించగలిగితే గాని మన యువతను మన దేశానికి బంగారు భవితగా నిరూపించడ సాధ్యం కాదు.

ప్రజల సంక్షేమంలోనే ప్రపంచాభ్యుదయాన్ని వీక్షించగల వారికి జనాభా పెరుగుదల ఆందోళనకర అంశం కానేరదు. మహాకవి గురజాడ అన్నట్టు దేశమంటే మనుషులోయ్‌ అంటూ జనార్ణవాన్ని చూసి మురిసిపోవచ్చు. సహజ వనరులు, సాంకేతిక నైపుణ్యాలతో సాధించే ఆర్ధిక ప్రగతి అందరికీ సమానంగా చెందే సామాజిక న్యాయంతో కూడిన సమ న్యాయ వ్యవస్థ నెలకొంటే జన విస్ఫోటనంతో భూభారం పెరిగి పో తున్నదని గగ్గోలు పెట్టవలసిన పనే ఉండదు. ఒక్కరి కోసం అందరు, అందరికోసం ప్రతి ఒక్కరు అనే స్పృహతో నడిచే ప్రపంచంలో నూత్న శిశూదయం వరమే కాని శరాఘాతం కానేరదు. కాని దరదృష్ట వశాత్తూ సమష్టిని హరించి వ్యష్టిని పెంచి అతి కొద్ది మంది స్వలాభాపేక్ష కోసం అందరి సౌభాగ్యాన్ని బలి తీసుకునే కార్పొరేట్‌ గుత్తాధిపత్యాలు బలిసి బలాదూర్‌గా సాగిపోతున్న నేపథ్యంలో బడుగు బలహీన వర్గాల ప్రజాకోటి దుర్భర దారిద్య్ర కూపంలో కూరుకు పోతున్నది. ప్రధానంగా ఈ దారుణ నేపథ్యమే కుటుంబ సంక్షేమం పేరిట జనాభా పెరుగుదల నియంత్రణ ఆవశ్యకతను పెంచింది. 

ప్రపంచంలో కెల్ల అత్యధిక జనాభా గలిగిన తొలి రెండు దేశాలు చైనా, భారత్‌లు. గత నాలుగైదు దశాబ్దాలుగా ఈ రెండు మహా జన సాగరాలూ కుటుంబ సంక్షేమ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి జనాభా పెరుగుదల రేటును గణనీయంగా అదుపు చేయగలిగాయి. పరిమిత జనాభా సమాజ స్థాయిలోనే కాదు, కుటుంబ స్థాయిలోనూ భారాన్ని తగ్గించి తక్కువ మంది పిల్లలను ఎక్కువ శ్రద్ధతో పెంచి పెద్ద చేసి ప్రయోజకులను గావించడానికి దోహదం చేస్తుందని నిరూపించాయి. పుట్టే వారిని పుట్టనివ్వాలనే సంప్రదాయ భావజాలం గూడు కట్టుకున్న కుటుంబాలలోనూ పరిమిత కుటుంబం యోచనకు ప్రాధాన్యం లభిస్తున్నది. పరిమిత కుటుంబ సూత్రం, చిన్న కుటుంబం- చింతలు లేని కుటుంబం దృక్పథం బహుళాదరణ పొంది జనాభా పెరుగుదల స్పీడును తగ్గిచడంలో సఫలీకృతమవుతున్నప్పటికీ ప్రపంచ జన సంఖ్య అక్టోబర్‌ 31 తొలి ఘడియల సమయానికి ఏడు వందల కోట్లకు చేరుకుంటున్నదని ఐక్యరాజ్య సమితి జన ‘గణ గణ’ను మోగించింది. 

ఈ సందర్భంగా మన జనాభా, మన వనరులు, మన ప్రగతి గురించి పునరావలోకనం చేసుకోవడం మన కర్తవ్యం. ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకున్న సందర్భాన్ని సానుకూలంగా తీసుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ఆహారాది సవాళ్ళకు దీటుగా ప్రపంచం సమాయత్తం కావలసి ఉన్న సంగతిని మననం చేసుకోవలసి ఉన్నది. 2011 జనగణనను బట్టి భారత్‌ జనాభా 121 కోట్లు. ప్రపంచ జనాభాలో ఆరో వంతు కంటె అధికం. ప్రస్తుత 1.41 శాతం పెరుగుదల రేటులో భారత్‌ జన సంఖ్యలో 2025 నాటికి చైనాను మించి పోయి ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశం కానున్నదని పాపులేషన్‌ జ్యోతిష్యులు ఢంకా బజాయిస్తున్నారు. 2050 నాటికి భారత్‌ జనాభా 160 కోట్లు కానున్నదని కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ఆందోళనకరం కాగా భారత దేశ జనాభా విషయంలో ఆహ్లాదకర కోణం కూడా లేకపోలేదు. అది మన అసంఖ్యాక యువతకు సంబంధించినది. 

మన దేశ జనాభాలో సగానికి అధికంగా 25 ఏళ్ళ లోపు వయస్సు యువత ఉండడం, 35 ఏళ్ళ వయస్సు గలవారు 65 శాతం ఉండడం మనకు కలిసి వచ్చే అంశాలు. అయితే ఇంతటి భారీ సంఖ్యలోని యువశక్తికి తగిన పనిని నైపుణ్యాలను కల్పించడం మన ప్రభుత్వాలు, విధాన కర్తల ముందున్న ప్రధానమైన సవాలు. 2030 నాటికి భారతీయుల సగటు వయసు 29 సంవత్సరాలు కానుండగా, చైనీయుల సగటు వయసు 37, జపానీయులది 48 కానుండడం గమనార్హం. అంటే మన సగటు జనాభా నవ యవ్వనంతో తొణికిస లాడనున్న దన్న మాట. జాతి ప్రగతికి, వ్యక్తి వికాసానికి అత్యంత దోహదకారి కాగల అంశం ఇది. మానవ వనరును సానబట్టి జాతి పురోగతికి సద్వినియోగం చేసుకోవాలన్న దృఢ సంకల్పం ఉండాలే గాని ఇంతకు మించిన సానుకూలాంశం మరొకటి ఉండదు. 

ఇప్పటికే యువతను అక్షరాస్యులను, నిపుణ వంతులను చేసి గౌరవ ప్రదమైన జీవనం సాధించగల ఉపాధులు కల్పించడంలో మన పాలకులు దారుణంగా విఫల మవుతున్నారు. పర్యవసానంగా వారు వామపక్ష తీవ్రవాదం వైపు, మతతత్వ ఉగ్రవాదం వైపు సైతం ఆకర్షితులై జాతి ఆంతరంగిక భద్రతకు పెను సవాలుగా మారుతున్నారు. ప్రసుత్తం దేశ జనాభాలో ఏదో విధమైన ఉపాధి ఉద్యోగ అవకాశాలున్నవారు 39 శాతం. 2015 నాటికి అంటే మరో నాలుగేళ్ళకు అప్పటి జనాభాను బట్టి ఇదే స్థాయి ఉపాధి అవకాశాలను కాపాడాలంటే మరి 5 కోట్ల 50 లక్షల ఉద్యోగాలు, ఉపాధులు కల్పించవలసి ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడున్న నిరుద్యోగ శాతాన్ని గణనీయంగా తగ్గిస్తే గాని యువతలో అశాంతిని, అలజడిని తొలగించడం వారి శక్తి యుక్తులను జాతి ప్రగతికి ఉపయోగించడం సాధ్యం కాదు. 

ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలైన సందర్భంగా మనం సాధించామని జబ్బలు చరుచుకొని చెప్పుకుంటున్న ఆర్ధికాభివృద్ధి దేశంలో నిరుద్యోగాన్ని, పేదరికాన్ని తొలగించడంలో దారుణంగా విఫలమైందని వాస్తవ గణాంకాలు చాటుతున్నాయి. భారత్‌లో రెండు దశాబ్దాలుగా అమలవుతున్న నూతన ఆర్ధిక సంస్కరణలు, ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌లు దేశ ఆర్ధికాభివృద్ధి రేటును గణనీయంగా పెంచిన మాట వాస్తవమే గాని, అదే సమయంలో ప్రజల ఆదాయాలలో, మానవాభివృద్ధి స్థాయిలలో వ్యత్యాసాలు గణనీయంగా పెరిగాయని ఆర్ధిక సంస్కర్తల పవిత్ర దేవాలయం వంటి ప్రపంచ బ్యాంకే కుండ బద్దలుకొట్టింది.

విశేష ఆర్ధికాభివృద్ధి ఫలాలను చూరగొనడానికి సాధనాలైన వనరులు, అవకాశాలకు దేశంలోని దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు, మైనారిటీలు, స్ర్తీలు బహు దూరంగా ఉన్నారని ఇండియా స్థితి గతులపై ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించిన కఠోర సత్యం గమనించదగినది. 1983 నుండి 2000 వరకు దేశంలో నిరుద్యోగం 7.20 శాతంగా ఉండగా, 2009-10 నాటికి 9.4 శాతానికి చేరడం గమనార్హం. ఆర్ధికాభివృద్ధి రేటు పెరుగుతున్న కొద్దీ కుబేరులు మరింతగా ధనవంతులవుతున్నారు. ప్రజలు మరింతగా ఉపాధి, ఉద్యోగాలు కొరవడి కుంగి కునారిల్లుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించగలిగితే గాని మన యువతను మన దేశానికి బంగారు భవితగా నిరూపించడం సాధ్యం కాదు.

No comments:

Post a Comment