Monday, October 17, 2011




కాంగ్రెస్ ఖబడ్దార్..

ఇక చేతిపైనే అసలు గురి.. జేఏసీ సమర భేరి
మారిన ఉద్యమ వ్యూహం... సరికొత్త పోరు పంథా

'వికలానికి' వారే కారణం
మంత్రులను వెంటాడాలి
ఆ పార్టీని భూ స్థాపితం చేయాలి
ఒత్తిడి పెంచేందుకు దీక్షలు
ముఖ్య నేతల నిర్ణయం
సకల సమ్మెకు తెర పడుతోందనే అభిప్రాయం
తెలంగాణలో బంద్ సంపూర్ణం
విధుల్లోకి తెలంగాణ మంత్రులు!
హైదరాబాద్, అక్టోబర్ 17 : ఇక... కాంగ్రెస్‌పైనే గురి! అధికార పార్టీపై తెలంగాణ జేఏసీ మోగించిన సమర భేరి! ఒకవైపు సకల జనుల సమ్మె నుంచి తప్పుకొంటున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు! మరోవైపు... 35 రోజులుగా జరుగుతున్న ఆందోళనపై కేంద్రంలో కనిపించని స్పందన! దీంతో ఉద్యమ రూపాన్ని మార్చాలని తెలంగాణ జేఏసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె చరమాంకంలో ఉన్నట్లు సోమవారం రాత్రి జరిగిన జేఏసీ ముఖ్యనేతల సమావేశం అభిప్రాయపడింది. ఒక్కొక్కరుగా సమ్మె నుంచి వైదొలగటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రే కారణమని, ఇక అస్త్రశస్త్రాలన్నింటినీ అధికార కాంగ్రెస్‌పైనే గురిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసే దిశగా కార్యాచరణ ఉండాలని తేల్చింది. ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని, పదవులకు రాజీనామా చేసి, పార్టీ నుంచి బయటికి వచ్చిన వారిని మాత్రమే తమతో కలుపుకొని వెళ్లాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. మిగిలిన వారందరినీ టార్గెట్ చేయాలని తీర్మానించారు. మరీ ముఖ్యంగా తెలంగాణ మంత్రుల వెంటపడాలని తీర్మానించారు. వారిపై ఒత్తిడి పెంచడానికి తొలుత ఎమ్మెల్యేలతో, తర్వాత ఎంపీలతో దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.

దీపావళి తర్వాత ఈ దీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలోనూ ప్రచారం చేయాలని జేఏసీ నిర్ణయించింది. నవంబర్ మొదటి వారంలో లక్షలాది మందితో 'తెలంగాణ మార్చ్' పేరిట చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇదివరకే తీర్మానించింది. ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మె విరమించినా... సింగరేణి కార్మికులూ దాదాపు అదే బాటలో ఉన్నా... సకల జనుల సమ్మె కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ కోదండరాం ఉద్ఘాటించడం గమనార్హం.

అయితే... ఇతర ఉద్యోగ సంఘాల వారు సమ్మెలో కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయాన్ని వారికే వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. జేఏసీ మాత్రం సకల జనుల సమ్మెను విరమించినట్లు నేరుగా ప్రకటన చేసే అవకాశం కనిపించటంలేదు. 'సకల సమ్మె'కు సంపూర్ణంగా తెర దించే దిశగా సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. సోమవారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ టీచర్ల జేఏసీ నేతలతో జరిపిన చర్చలు ఫలించాయి. సింగరేణి సమ్మె కూడా ముగిసినట్లే. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు 35 రోజుల తర్వాత తెలంగాణలో కొంత మేరకు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఆర్టీసీ సమ్మె విరమణతో ఇప్పటికే బస్సులు రోడ్లెక్కాయి. విద్యుదుత్పత్తి పూర్వ స్థితికి చేరుకుంటోంది. జెన్‌కోకు చెందిన అన్ని థర్మల్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి బాగా మెరుగుపడింది. విద్యుత్ కోతల సమయాన్ని బాగా తగ్గించాలని, వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరోవైపు... రాష్ట్రవ్యాప్తంగా మద్యం సరఫరా కూడా మామూలు స్థితికి చేరుకుంటోంది. చాలా రోజులుగా సచివాలయానికి దూరంగా ఉన్న తెలంగాణ మంత్రులు కూడా మెల్ల మెల్లగా విధులకుమ వస్తున్నారు.

సోమవారం ముఖ్యమంత్రి సమ్మక్క-సారలమ్మ జాతరపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు. సమాచార మంత్రి డీకే అరుణ కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఇక ఉద్యోగులు కూడా సమ్మె విరమిస్తే పాలన పూర్తిగా గాడిన పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు... సోమవారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. రాజధానిలో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది.

 

*******************************************************************************************************
ప్రధానిపై జాలిపడుతున్నా: అద్వానీ
తాను ప్రధాని మన్మోహన్ సింగ్‌పై జాలి పడుతున్నానని బీజేపీ నేత అద్వానీ వ్యాఖ్యానించారు.
మన్మోహన్ బలహీన ప్రధాని
అవినీతి వ్యతిరేక యాత్రలో అద్వానీ వ్యాఖ్య
గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడలు నయం

సవొనేర్ (మహారాష్ట్ర): యూపీఏ సర్కారు పరిస్థితిని చూసి తాను ప్రధాని మన్మోహన్ సింగ్‌పై జాలి పడుతున్నానని బీజేపీ నేత అద్వానీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పరిస్థితి దారుణంగా ఉందని, ఒకప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తనకు గౌరవం ఉండేదని, ఇప్పుడు ఆయనపై జాలి పడుతున్నానని అన్నారు.

అవినీతి వ్యతిరేక యాత్రలో భాగంగా మహారాష్ట్ర చేరుకున్న అద్వానీ, నాగపూర్ సమీపంలోని సవొనేర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మన్మోహన్ సింగ్‌ను దేశంలోనే అత్యంత బలహీనమైన ప్రధానిగా ఆయన అభివర్ణించారు. మాజీ ప్రధానులు ఐ.కె.గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడల కంటే మన్మోహన్ బలహీన ప్రధాని అని అన్నారు. బొటాబొటి ఎంపీలు చేతిలో ఉన్నా వారు ఇంతకంటే బాగానే నెట్టుకొచ్చారని అన్నారు. మన్మోహన్‌ను ‘బలహీన’ ప్రధానిగా అభివర్ణించడాన్ని నిందించడంగా భావించరాదన్నారు. ఆయన మంచి వ్యక్తి అని, నిజాయితీ పరుడని అన్నారు.

అయితే, 10 జన్‌పథ్ (సోనియా నివాసం) అనుమతి లభిస్తే తప్ప తానేమీ చేయలేనని ప్రధాని భావించడం సరికాదన్నారు. యూపీఏ సర్కారులోని మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరంల మధ్యనున్న పొరపొచ్చాలను బయటపెట్టడం వల్లనే సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని పునఃసమీక్షించేందుకు యూపీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

యాత్రలెందుకంటే...: టీవీ, ఇంటర్నెట్ వంటి అత్యాధునిక సమాచార సాధనాలు అందుబాటులోకి వచ్చాక యాత్రల వల్ల సాధించేది ఏముంటుందని తనను చాలా మంది ప్రశ్నించారని, యాత్ర చేపట్టవద్దని కూడా సూచించారని అద్వానీ చెప్పారు. ఇప్పటికి సైతం భారత్‌లో యాత్రల ద్వారా తప్ప మరే మార్గంలోనూ ప్రజలకు సందేశాన్ని బలంగా వినిపించలేమని, తాను గతంలో చేపట్టిన ఆరు యాత్రలూ ఇదే విషయాన్ని రుజువు చేశాయని అన్నారు. 

No comments:

Post a Comment