Sunday, October 9, 2011


తెరపైకి రెండో ఎస్సార్సీ ?
srcహైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: నిరాఘాటంగా సాగుతున్న సకల జనుల సమ్మె నేపథ్యం, సొంత పార్టీ నుంచే రోజు రోజుకూ పెరుగుతున్న ఒత్తిడి, రాజీనామాల పర్వం, ఆమరణ నిరశన దీక్షల బెదిరింపులతో అన్ని వైపుల నుంచీ తాకిడి ఎదుర్కుంటున్న కాంగ్రెస్‌ అధినాయకత్వం ఇక ఈ సమస్య లన్నిటికీ ప్రత్యామ్నాయం కనుగొనే దిశగా అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల్లో తెలంగాణపై సానుకూల ప్రకటన రాని పక్షంలో ఆమరణ నిరశన దీక్షలకు వెనుకాడేది లేదని ఎంపీ మధు యాష్కీ, మరి కొందరు చేసిన హెచ్చరికలతో కేంద్రంలో కదలిక వచ్చిందంటున్నారు.

ఎంపీల హెచ్చరికలను పట్టించుకుంటూనే అన్ని ప్రాంతాల వారికీ అంగీకార యోగ్యమైన పరిష్కారం కనుగొనే దిశగా సీనియర్‌ నేతలు ప్రణబ్‌ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్‌, ఏకే ఆంటొనీ లాంటి వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణను ఇచ్చేది లేదని కరాఖండిగా చెబితే ఒక ప్రాంతం మొత్తంలో పార్టీ చిరునామా గల్లంతు అవుతుందన్న ఆందోళనతో ఉన్న కాంగ్రెస్‌ నాయకత్వం, తాజాగా తెరపైకి రెండవ ఎస్సార్సీ ప్రతిపాదనను తీసుకు రానున్నట్టు ఢిల్లీ నుంచి అందుతున్న వార్తలు సూచిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో సోనియా గాంధీ తర్వాత అంతటి స్థాయి ఉన్న కేంద్ర మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ కొద్ది రోజుల క్రితం ఒక జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు అర్థం రెండవ ఎస్సార్సీ అనివార్యమనే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని, హఠాత్తుగా, దూకుడుగా నిర్ణయం తీసుకోలేమని ప్రణబ్‌ ఆ సందర్భంగా చెప్పారు. ఒక రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, వాటన్నిటికీ అన్ని ప్రాంతాల ప్రజానీకం మనోభావాలను గౌరవిస్తూ పరిష్కరించాల్సి ఉంటుందనీ చెప్పారు. కేవలం ఒక్క తెలంగాణ విషయంలోనే నిర్ణయం తీసుకోలేమని, అలా చేస్తే అనేక డిమాండ్లు ముందుకు వస్తాయన్నారు. అంటే తెలంగాణ అంశాన్ని ఇతర డిమాండ్లతో జత చేసి, ఏక మొత్తంగా రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ (ఎస్సార్సీ)ని ఏర్పాటు చేస్తే సమస్యకు కాలమే పరిష్కారం చెబుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్‌ పెద్దలు ఉన్నట్టు కనిపిస్తున్నదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

సంప్రదింపులు సాగిస్తూనే...
ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ కొనసాగిస్తున్న సంప్రదింపుల ప్రక్రియకు విఘాతం కలగకుండా, అన్ని ప్రాంతాల వారితో ఎడతెరిపి లేకుండా మంతనాలు సాగిస్తూనే మరోవైపు ఎస్సార్సీని ఏర్పాటు చేయటానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ఇప్పటి మాట కాదు...
వాస్తవానికి రెండవ ఎస్సార్సీ డిమాండ్‌ ఇప్పటిది కాదు....అలాగే సంప్రదింపుల ఆలోచనా కొత్తదేమీ కాదు...2004లో యూపీఏ కూటమి తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణపై కనీస ఉమ్మడి కార్యక్రమం లాంటివన్నీ జరిగిపోయిన అనంతరం అప్పట్లో టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆలె నరేంద్ర, ప్రణబ్‌ ముఖర్జీ ఒక పత్రంపై ఉమ్మడిగా సంతకాలు చేశారు. సంప్రదింపుల తర్వాత ఏర్పడే ఏకాభిప్రాయం ప్రకారం రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ అనే మాటను అందులో చేర్చారు. యూపీఏ కూటమి నుంచి టీఆర్‌ఎస్‌ బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఈ మాటపైనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ దాదాపు 40 రాజకీయ పార్టీల నేతలతో తెలంగాణకు అనుకూలంగా సంతకాలు చేయించారు. ఇంతకు మించిన ఏకాభిప్రాయం ఉండబోదని, సత్వరం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఒత్తిడి పెంచారు.

చిక్కల్లా తెలంగాణ నేతల తోనే...
రెండవ ఎస్సార్సీ ఏర్పాటుకు సీమాంధ్ర ప్రాంత నేతల నుంచి ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం కాలేదు. తెలంగాణ ప్రాంతంలోనూ కరడుగట్టిన వాదులు తప్ప ఎస్సార్సీ పట్ల ఎవరికీ మరో రకమైన అభిప్రాయం లేదు. నిజానికి అదేదో గతంలోనే చేసి ఉంటే ఇప్పటికి అన్నీ సర్దుకుని ఉండేవన్న అభిప్రాయమూ ఉంది. ఎస్సార్సీ వేయటానికి వచ్చిన చిక్కల్లా కరడుగట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతోనే అని అధిష్ఠానం అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.

నచ్చజెప్పగలమన్న ధీమా...
అయితే సమస్యకు ఎలాంటి పరిష్కారమూ లభించని నేపథ్యంలో తెలంగాణ నేతలను రెండవ ఎస్సార్సీ ఏర్పాటుకు అంగీకరింపజేయగలమన్న విశ్వాసంతో అధిష్ఠానం ఉన్నట్టు చెబుతున్నారు. అధినేత్రి సోనియా స్వయంగా సీనియర్‌ నేతలను పిలిపించి ఎస్సార్సీపై పట్టు పట్టవద్దని చెబితే వారు అంగీకరిస్తారన్న ధీమాతో అధిష్ఠానం పెద్దలు ఉన్నారని తెలిసింది. ఎస్సార్సీని ఏర్పాటు చేయటం అంటే తెలంగాణ అంశాన్ని కాల గర్భంలో కలసిపోయేలా చేయటం కాదని, మిగిలిన డిమాండ్ల మాట ఎలా ఉన్నా, తెలంగాణ విషయంలోనే అధిక ప్రాధాన్యం ఇస్తూ సత్వరమే పని పూర్తయ్యేలా చూసే బాధ్యత పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటాయని సోనియా హామీ ఇస్తే టీ కాంగ్రెస్‌ నేతలు అంగీకరించవచ్చునన్న ఆలోచనతో అధిష్ఠానం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయంలో త్వరలోనే సోనియా ఒక నిర్ణయం తీసుకోనున్నారని, సీనియర్‌ నేతలను పిలిపించి దీనికి ఒప్పిస్తారన్న ప్రచారం పార్టీ వర్గాలలో బలంగా సాగుతున్నది.



డాక్టర్ రమణసింగ్ కు కృషి కర్మ పురస్కారం

భాజపా పాలిత రాష్ట్రాలను, భాజపాను ఏదో విధంగా అప్రతిష్టపాలు చేయాలని ఎంతగా ప్రయత్నిస్తారో అంతగా భాజపా ముఖ్యమంత్రులు కీర్తి సంపాదిస్తారు.  చత్తీస్ ఘడ్ వెనుకపడిన ప్రాంతం ఐనప్పటికీ 2010 - 2011 సంవత్సరానికి గాను 'దేశంలోనే అతి ఎక్కువ బియ్యం ఉత్పత్తి' చేసి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరంలో 61.59 మెట్రిక్ టన్నుల బియ్యం పండించి ఒక క్రొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇంకొక విశేషం కూడా ఉంది.  క్రితం సంవత్సరంతో పోలిస్తే 2010 - 11 సంవత్సరంలో దిగుబడి రెట్టింపు (రెండింతలు) సాధించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి సంస్థ వ్యవస్థాపక దినం సందర్భంగా 2011  జూలై 16 నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా శ్రీ రమణ సింగ్ "కృషి కర్మ" పురస్కారం, ఒక కోటి రూపాయల నగదు బహుమతి అందుకున్నారు.  
- ధర్మపాలుడు


యవ్వనాన్ని ప్రసాదించే అమృత ఫలం ఉసిరి

-----------------------------------------------------------------------------------
ఉసిరిక పండు వయస్థాపన, రసాయనంగా చెప్పబడినది. అనగా ముసలితనము యొక్క లక్షణములు రానీయకుండా శరీరమును దృడంగాను, పటుత్వముగాను, ఉంచి యవ్వన వంతునిగా ఉంచుతుంది. మధుమేహ రోగికి ఉసిరిక రసం లేదా ఎండబెట్టిన ఉసిరిక పండ్ల చూర్ణములో పసుపును కలిపి ఒక గ్రాము చొప్పున తేనెతో కలిపి ఇచ్చిన మధుమేహము తగ్గును.
----------------------------------------------------------------------------------- 
ఉసిరి పండు : ఆయుర్వేదము నందు ఉసిరిక పండునకు అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చిరి. ఉసిరిక పండు వయస్థాపన, రసాయనంగా చెప్పబడినది. అనగా ముసలితనము యొక్క లక్షణములు రానీయకుండా శరీరమును దృడంగాను, పటుత్వముగాను, ఉంచి యవ్వన వంతునిగా ఉంచుతుంది. ఉసిరిక కాయలను ప్రతిరోజూ సేవించుట వలన శరీరములో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఏ వ్యాధులను దరి చేరనివ్వదు. 

అమృతముతో సమానమైన గుణములు కలిగి ఉండుట వలన దీనిని అమృత ఫలమందురు. నేత్రములకు మంచిది. మధుమేహము, కుష్టం, మూలశంక, స్త్రీలలో కలుగు ప్రదర రోగం (అధిక ఋతుస్రావం), రక్తస్రావ రోగం మొదలగు వ్యాదులలో అత్యుత్తమముగా పని చేయును. ఇందు అధిక మాత్రలో విటమిన్ సి ఉండును. 

ఉసిరిక పండ్లతో చేసిన అత్యంత బలకరమైన, ప్రాచుర్యమైన మందు చ్యవనప్రాశావ లేహ్యం.  మధుమేహ రోగికి ఉసిరిక రసం లేదా ఎండబెట్టిన ఉసిరిక పండ్ల చూర్ణములో పసుపును కలిపి ఒక గ్రాము చొప్పున తేనెతో కలిపి ఇచ్చిన మధుమేహము తగ్గును.  ఈ రెండు కలిసిన మందు 'నిశాఅమలకి' టాబ్లెట్ గా మందుల షాపులలో లభ్యమగు చున్నది. 

ప్రదర వ్యాధులందు  (స్త్రీలలో వచ్చు అధిక ఋతుస్రావం) ఉసిరికాయల చూర్ణమును  చక్కెర లేదా తేనెతో లేదా బియ్యం కడిగిన నీటితో ఇచ్చిన తగ్గును. 

మూత్రం ఆగిపోయిన యెడల ఉసిరిక చూర్ణమును బెల్లంతో కలిపి ఇచ్చిన మూత్రం మరల సాఫీగా జారీ అగును. ఉసిరిక చూర్ణమును ప్రతిరోజూ సేవిన్చినచో నేత్ర వ్యాధులు తగ్గును.

ఈ విధముగా ఉసిరిక శ్వాస, క్షయ, దగ్గు, ఆమ్ల పిత్తము మొదలగు వ్యాధులయందు కూడా పని చేయును. శుక్ర వృద్ధిని చేయును. జ్ఞాపక శక్తిని పెంపొందిన్చును.






  • రైలు రోకోలతో అందని బొగ్గు
  • మరో వారానికే గ్యాస్‌
  • మరిన్ని కోతలు
  • ఎండుతున్న పంటలు
రాష్ట్ర ప్రజలకు కరెంట్‌ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. మూడు రోజుల రైలు రోకో వల్ల ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బొగ్గు అందకుండా పోయింది. కేంద్రం ఇస్తానన్న గ్యాస్‌ సరఫరా మరో వారం రోజుల్లో తగ్గుతోంది. దీంతో కరెంట్‌ సమస్య మరింత జఠిలం కానుంది. విద్యుదుత్పత్తి గణనీయంగా తగ్గనుంది. విద్యుత్‌ కొరత ఇంకా తీవ్రం కానుంది. ఇప్పటికే అప్రకటిత విద్యుత్‌ కోతలతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. పరిశ్రమలు సంక్షోభంలో పడ్డాయి. కుటీర, చిన్న పరిశ్రమలైతే పూర్తిగా మూతబడ్డాయి. వర్షాలు వెనుకపట్టు పట్టడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉష్ణోగ్ర తలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో గృహ విద్యుత్‌కు గంటల కొలది కోతలు విధిస్తుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె వల్ల గడిచిన 27 రోజులుగా పెద్ద ఎత్తున విద్యుదు త్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ ద్వివేది ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుదుత్పత్తి, సరఫరా గతం కంటే మెరుగు పడిందని ఈ సమావేశంలో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజు రోజుకు విద్యుత్‌ కోతలు అధికమవుతున్నాయి.
అప్రకటిత కోతలు
గృహాలకు నాలుగ్గంటలు మాత్రమే కోత విధిస్తున్నామని అధికారికంగా చెబుతుండగా గ్రామాల్లో రోజుకు పది నుండి పన్నెండు గంటల అప్రకటిత కోత అమలవుతోంది. రాజధాని హైదరాబాద్‌లోనే రోజుకు నాలుగ్గంటలపాటు కోస్తున్నారంటే జిల్లా, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయానికి ఏడుగంటలు ఇవ్వాల్సి ఉండగా ఒక గంట మాత్రమే కోత విధించామంటున్నారు. అంటే ఆరు గంటలు సరఫరా కావాలి. కాని నిరాఘాటంగా రెండు గంటలు విద్యుత్‌ సరఫరా అయితే గొప్పన్నట్లుంది పరిస్థితి. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. వర్షాభావం తీవ్రంగా ఉన్న చోట్ల ఇప్పటికే పంటలకు నష్టం వాటిల్లింది. పంటలను కాపాడాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులపాటు విద్యుత్‌ హాలిడే అమలు చేస్తున్నారు. మిగిలిన ఐదు రోజుల్లో సాయంత్రం ఆరు గంటల నుండి పదిన్నర వరకు విద్యుత్‌ కోత విధించారు. అధికారికంగా పేర్కొన్న సమయం తప్ప తక్కిన సమయంలో కోతల్లేవని అధికారులు చెబుతున్నా ఇబ్బడి ముబ్బడిగా అనధికారికంగా కోత అమలవుతోంది.
39 ఎంయు కొరత
రోజుకు 35 నుండి 50 మిలియన్‌ యూనిట్ల (ఎంయు) కొరత ఏర్పడుతోందని సిఎస్‌ నిర్వహించిన సమీక్షలో వెల్లడైంది. ఆదివారంనాడు చూస్తే 269 ఎంయు డిమాండ్‌ ఉండగా 230 ఎంయు మాత్రమే ఉత్పత్తి జరుగింది. కొరత 39 ఎంయు. విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోజుకు 0.36 ఎంయు చొప్పున, అక్టోబర్‌లో మొత్తంగా 650 మెగావాట్లు (మెవా) కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇవి ఇంకా పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేదు. ఎపి జెన్‌కో 75 ఎంయును ఉత్పత్తి చేస్తుండగా దానిలో 39 ఎంయు జలవిద్యుత్‌. శ్రీశైలం ప్రాజెక్టుకు పై నుండి వచ్చే నీరు తగ్గిపోవడంతో ఉత్పత్తి 16 ఎంయుకు పడిపోయింది. నాగార్జునసాగర్‌లో 10 ఎంయు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది.
బొగ్గు రవాణాకు అంతరాయం
సింగరేణిలో సకల జనుల సమ్మె వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఒరిస్సా నుండి బొగ్గును తెప్పించడానికి రైల్వేని అదనపు ర్యాక్‌లు అడిగినట్లు ప్రభుత్వం చెబుతున్నా విజ్ఞప్తులకే పరిమితమైంది. లక్ష టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని జెన్‌కో భావించింది. ఒరిస్సా నుండి బొగ్గు కొద్ది పరిమాణంలో వస్తోంది. అయితే మూడు రోజుల రైలు రోకో వల్ల ఇతర రాష్ట్రాల నుండి బొగ్గు రవాణ నిలిచి పోయిందని సమాచారం. తొలుత రైలు రోకో 9,10,11 తేదీల్లో ఉంటుందని జెఎసి ప్రకటించింది. ముందుగా చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో బొగ్గు తీసుకొచ్చే విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు రైలు రోకో తేదీలు 12,13,14 తేదీలకు మారాయి. ఇప్పుడు మొత్తంగా పది రోజులపాటు తెలంగాణలోని థర్మల్‌ స్టేషన్లకు బొగ్గు అందే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణేతర ప్రాంతంలో ఉన్న విజయవాడ థర్మల్‌ స్టేషన్‌కు బొగ్గు అందాలన్నా రైలు రోకో ప్రభావం ఎంతోకొంత ఉంటుందని అంటున్నారు. దీనివల్ల విద్యుదుత్పత్తి తగ్గిపోతే కొరత మరింత పెరుగుతుంది. ఆ మేరకు కోతలూ పెరగనున్నాయి. కేంద్రం నుండి అందుతున్న అరకొర గ్యాస్‌ సైతం ఈ నెల 15 వరకే సరఫరా అవుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తి బాగా తగ్గిపోతుందని అంచనా వేశారు. కేంద్రం వెయ్యి మెగావాట్లు సరఫరా చేస్తుంటేనే 39 ఎంయు కొరత ఏర్పడుతోంది. గ్యాస్‌ అందక, రైలు రోకో వల్ల బొగ్గు దిగుమతికి అంతరాయం ఏర్పడితే రాష్ట్రంలో కరెంట్‌ కష్టాలు మరింత పెరుగుతాయని, చీకట్లు అలముకుంటాయని అధికారులే చెబుతున్నారు. 

No comments:

Post a Comment