Sunday, October 30, 2011


కార్తీక మాసంలో పూజలు, వ్రతాలూ ఎందుకు చేయాలి?


కార్తీక మాసం అంటే భగవాన్ శివుడికి ప్రీతిపాత్రమైనదని, ఈ మాసంలో పూజలు వ్రతాలు చేసి, ఉపవాసాలు ఉన్న వారికి పుణ్యం దక్కుతుందని, ఇంకా అనేక రకాలుగా ఈ మాసం విశిష్టమైనదని చెపుతారు.  ఇవన్నీ నిజమే.  

కానీ పూజలూ, వ్రతాలూ కేవలం ఇంట్లోని  స్త్రీలు మాత్రమే చేస్తారు, పురుషులు ఇటువంటి సంప్రదాయాలను నమ్మినా ఆచరించేవారు చాల తక్కువ. మరి ఇలా పూజలు, వ్రతాలూ చేయని వారికి పుణ్యం రాదా? అనే అనుమానం రావచ్చు.

పుణ్యం రావడం, రాకపోవడం తరువాతి సంగతి. అసలు ఎందుకు ఆచరించాలి? అనేది తెలిస్తే మనం దేవుడిని పూజించడం కన్నా ముందు మన పెద్దలను పూజిస్తాం.
  • సంవత్సరంలో ముఖ్యంగా మూడు మాసాలు ఇటువంటివి వస్తాయి. శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం. ఈ మూడు మాసాలలో పూజలు, వ్రతాలూ ఆచరిస్తే పుణ్యం వస్తుందని మన పెద్దలు చెపుతారు. వర్షాకాలం ఆరంభం నుండి శీతాకాలం చివరి వరకు ఉన్న కాలంలోనే ఈ మూడు మాసాలు రావడం కాకతాళీయం కాదు. ఎండలు పోయి వర్షాలు ప్రారంభమైనప్పుడు అన్ని ప్రదేశాలు తడి తడిగా (అంటే తేమతో) ఉంటాయి. తేమ ఉన్న చోట రోగ కారక క్రిములు చేరతాయి. వీటి వలన సమాజంలో అనేక రోగాలు బయలుదేరతాయి. ఈ రోగాల నుండి సమాజాన్ని రక్షించాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. అంటే ఎప్పుడు పరిశుభ్రంగా ఉండటం, ఉతికిన దుస్తులను ధరించడం, పసుపు రాసుకోవడం, ధూపం వేయడం మొదలైన రోగ నిరోధక పద్ధతులను పాటించాలి. పూజ చేయవలసిన రోజున తెల్లవారుఝామునే నిద్ర లేచి, ఇల్లు శుభ్రం చేసి, తల స్నానం చేసి, కొత్త బట్టలు కానీ, ఉతికిన బట్టలు గానీ ధరించి, పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు మహిళలు ముఖానికి, పాదాలకు పసుపు, గంధం రాసుకుని, ధూపం వేస్తారు. వీటన్నిటి వల్ల క్రిములు పోయి, ఇల్లు శుభ్రపడి ఇంటి నిండా క్రిములను పోగొట్టే ధూపం ఆవరిస్తుంది. పసుపు వలన శరీరానికి కూడా రోగ నిరోధక శక్తి వస్తుంది. 
  •  పూజలు, వ్రతాలూ చేసే రోజుల్లో మాంసాహారం (మాంసం, గుడ్లు, చేపలు మొదలైనవి) తినకూడదని కూడా చెపుతారు. ఎందుకంటే మాంసం జీర్ణం కావాలంటే వాతావరణం సహజంగా వేడిగా ఉండాలి. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటంది కాబట్టి త్వరగా జీర్ణం కాదు. జీర్ణం కాకపోతే లోపలే కుళ్లిపోయి వివిధ రకాల రోగాలు బయలుదేరతాయి. ఈ రోగాల నుండి మనలను రక్షించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మాసంలో మాంసం తినకుండా ఉంటే పుణ్యం వస్తుందని చెప్పి మన పెద్దలు ఈ సంప్రదాయం పెట్టారు. అంతేకాక ఈ పధ్ధతి వలన జంతుజాలం కూడా రక్షించబడుతుంది. 
  • నదులు ఈ కాలంలో చక్కగా ప్రవహిస్తాయి. ఈ ప్రవాహంలో అనేక మూలికలను, ఔషధాలను తనలో కలుపుకుంటూ వస్తాయి. అలాంటి ప్రవాహంలో ఒక్కసారి మునిగితే ఔషధ ప్రభావం వలన మన శరీరం కూడా రోగ నిరోధకంగా మారే అవకాశం ఉంది. 
  • అలాగే మనలాంటి అనేక మంది స్నానానికి రావడం వలన సమస్త సమాజ రూపం మన ముందు కదలాడుతుంది. దానివల్ల మనమూ ఈ సమాజంలో ఒక భాగం అనే భావన అంకురించి, మన మనసులో ఎదుటివారి పట్ల మంచి, మర్యాదలు అలవడతాయి. ఈ గుణాలు బలపడితే అవినీతి చేయాలనే ఆలోచన, పక్క వారికి హాని చేయలనే చెడు ఆలోచనలు మనలో కలగవు.
  • అలాగే కార్తీక మాసం శివునికి ప్రీతిపాత్రమైనది. శివుని కోసం ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు. పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఉపవాసం చేయడం వలన కడుపులో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆహారం కూడా పూర్తిగా జీర్ణం కాబడి కడుపు పరిశుభ్రంగా తయారవుతుంది. అలాగే తేమ ఆరిపోయి చక్కగా ఆరోగ్యంగా తయారవుతుంది. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి చైతన్యవంతమవుతుంది. దీనివలన సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
  • భగవాన్ శివునికి ఎల్లప్పుడూ విశ్వాస పాత్రమైనది నంది. నందీశ్వరుడు అంటే మన భూలోకంలో గోవు. కాబట్టి గోవుని పూజించి సాక్షాత్తూ నందిని పుజించామని సంతృప్తి చెందుతారు మన మహిళలు. గోపూజ వలన గోవులు రక్షించబడతాయి. అందువలన పంటలు సమృద్ధిగా ఉండి సమాజం సుఖసంతోషాలతో వెల్లివిరుస్తుంది.
ఇవన్ని ఏదో పండుగ నాడు తప్పితే మిగతా రోజుల్లో సాధారణంగా పాటించరు. అందుకని  ఇవి ప్రతి ఇంట్లోను పాటించడం కోసం మన పెద్దలు పూజ, వ్రతం అని పేరు పెట్టి మనతో చేయిస్తున్నారు. ఏదో ఒక లాభం వస్తుందని చెపితే కానీ మనం ఏదీ ఆచరించము. అందుకని పుణ్యం వస్తుందని ఆశ పెట్టి మనతో ఇవన్ని చేయిస్తూ మనలను రక్షిస్తున్నారు.

చెప్పుకోవాలంటే ఇటువంటి విశేషాలు మన పండుగలలో చాలా ఉన్నాయి. ఇవి మచ్చుకు  కొన్ని. కాబట్టి అందరం ఈ కార్తీక మాసాన్ని తప్పక ఆచరించుదాం. 

No comments:

Post a Comment