Wednesday, October 5, 2011



ఉద్యమం దూకుడు.. కాంగ్రెస్ లాగుడు
అదే టెన్షన్!
నిర్ణయంపై ఎటూ తేల్చని కేంద్రం

ఎంత కాలం పడుతుందో చెప్పలేం: ప్రణబ్, ఆజాద్
ఇది సంక్షిష్ట సమస్య.. ఏకాభిప్రాయం అవసరం: ప్రధాని
ఉద్యమ ఉధృతికి జేఏసీ నిర్ణయం.. రైల్ రోకో యథాతథం
కఠిన నిర్ణయాల బాటలో సర్కారు
పోలీసు రక్షణలో బస్సులు, రైళ్లు నడిపేందుకు సన్నాహాలు
విధ్వంసంపై నిఘా నజర్.. హింస పెరగొచ్చని నివేదిక
మాజీ నక్సల్స్‌పై అనుమానాలు
తెలంగాణకు అదనపు బలగాలు.. పరీక్షల వాయిదాలు
రేపు(శుక్రవారం) మళ్లీ కోర్ కమిటీ!.. త్వరలో సీడబ్ల్యూసీ భేటీకి సన్నాహాలు
జాతీయ స్థాయి సంప్రదింపులకూ శ్రీకారం
శీతాకాల సమావేశాల్లోపు కాంగ్రెస్ వైఖరి ఖరారు యత్నాలు!
చాలా సమస్యలొస్తాయ్: ప్రణబ్
"తెలంగాణ సమస్యకు పరిష్కారాన్ని సాధించడం సులభం కాదు. కానీ మేం అందుకు యత్నిస్తున్నాం. కానీ.. ఎప్పటిలోపు పరిష్కారం కనుగొంటామో సూచించడం కష్టం... చూద్దాం ఏం జరుగుతుందో..! గత 50-60 సంవ త్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడమే దాని సంక్లిష్టతను తెలియజేస్తున్నది. విస్తృత దృష్టిలో చూస్తే.. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి.. ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటులో ఒక పద్ధతిని అనుసరించలేదు.''
- ఓ ప్రైవేట్ చానల్ ఇంటర్వ్యూలో ప్రణబ్

"ఈ (తెలంగాణ) సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు మేం చేయదగ్గ కృషి అంతా చేస్తున్నాం''
-కరత్‌కు రాసిన లేఖలో ప్రధాని మన్మోహన్ సింగ్.

"తెలంగాణ చాలా ముఖ్యమైన, క్లిష్టమైన సమస్య. సమస్య పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితి చెప్పలేం. దసరా తర్వాత జాతీయ స్థాయిలో సంప్రదింపులు మొదలు పెడతాం. జాతీయ స్థాయిలో ఎవరెవరిని సంప్రదించాల్సి ఉంటుందో చూసి, వారందరినీ సంప్రదిస్తాం. ఆ సంప్రదింపులు పూర్తయిన తర్వాతే కాంగ్రెస్ వైఖరి వెల్లడిస్తాం.''
-గులాంనబీ ఆజాద్

హైదరాబాద్, అక్టోబర్ 5 : మరి కొన్ని రోజులు ఇదే టెన్షన్. ఇంకొన్నాళ్లు ఇదే అనిశ్చితి. రాష్ట్ర విభజనపై ఇదే సందిగ్ధం. దసరాకే కాదు.. దీపావళికీ 'సమ్మె' పోటు తప్పదేమోనన్న అనుమానాలు. తెలంగాణపై చర్చల ప్రక్రియను మరి కొన్నాళ్లు సాగదీసే దిశగా కాంగ్రెస్ అడుగులు. కాంగ్రెస్ తీరుపై తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహం. ఇక సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటన. కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం. ఈ పరిణామాల నడుమ ఇప్పటికే అనిశ్చితిలో ఉన్న రాష్ట్రం మరింత సంక్షోభంలో కూరుకుపోనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణపై ఇంకా 'టైం కావాల్సిందే'నన్న రీతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్రంలో ఆయన తరువాత అంతటి వాడైన ప్రణబ్ ముఖర్జీ తెలంగాణపై బుధవారం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తెలంగాణ అంశం అత్యంత సమస్యాత్మకమైనదని, సంక్లిష్టమైనదని వీరిద్దరూ బుధవారం వేర్వేరు సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రధాని నోట ఏకాభిప్రాయం మాట కూడా రావడం గమనార్హం. తెలంగాణ సమస్యకు తాము ఎప్పటిలోగా పరిష్కారాన్ని కనుగొంటామో చెప్పడం కష్టమని కూడా ప్రణబ్ అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి నిర్ణీత కాల పరిమితి చెప్పలేమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ కూడా తేల్చి చెప్పారు.

అయితే.. దసరా తర్వాత జాతీయ స్థాయిలో సంప్రదింపులు మొదలు పెడతామని ఆయన వెల్లడించారు. జాతీయ స్థాయిలో సంప్రదింపులు పూర్తయిన తర్వాతే కాంగ్రెస్ వైఖరి వెల్లడిస్తామన్నారు. కాగా.. కాంగ్రెస్ కోర్ కమిటీని శుక్రవారం మరో సారి సమావేశపరిచి.. తెలంగాణ అంశంపై విస్త­ృత చర్చలు జరపాలని సోనియాగాంధీ భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అఖిలపక్ష సమావేశాలను జరిపే విషయం కూడా కోర్ కమిటీ భేటీలోనే ఖరారవుతుందని సమాచారం.

రాష్ట్రానికి ఒక టీమ్‌ను పంపించే విషయాన్ని కూడా అధిష్ఠానం ఈ భేటీలోనే నిర్ణయించనుంది. నవంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాల నాటికి సంప్రదింపులన్నీ పూర్తి చేసి.. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని ఖరారు చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఇలా సమస్యపై నాన్చుడు ధోరణితో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలంగాణ ఉద్యమకారులు రగిలిపోతున్నారు. తెలంగాణ విషయంలో.. 'విస్తృత దృష్టిలో చూస్తే.. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయ'ంటూ ప్రణబ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జేఏసీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. దసరా తరువాత ఉద్యమం మరింత తీవ్రంగా ఉంటుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు.

కేంద్రం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చే వరకు సకల జనుల సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఎక్సైజ్ సిబ్బంది సహా మద్యం షాపుల్లోని సిబ్బంది కూడా సమ్మెలోకి దిగడంతో ఉద్యోగ జేఏసీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. పోలీసులను కూడా సమ్మెలో భాగస్వాములను చేసేందుకు ఉద్యోగ జేఏసీ నేతలు నడుం బిగించారు. ఈ దిశగా పోలీసు సిబ్బంది, అధికారుల సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు జరపనున్న రైల్‌రోకోను యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటించారు. రైళ్లను నడిపే యత్నం చేస్తే.. ఘర్షణ తప్పదని సర్కారును హెచ్చరించారు.

రైల్‌రోకోను అడ్డుకొనేందుకు సర్కారు వ్యూహరచన చేసింది. పోలీసుల రక్షణతో రైళ్లను నడుపనున్నట్లు డీజీపీ దినేశ్ రెడ్డి ప్రకటించారు. అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని ఆందోళనకారులను హెచ్చరించారు. హింసకు పాల్పడే ఉద్యమకారులపై ఉక్కుపాదాన్ని మోపాలని సర్కారు నిర్ణయించింది. మరో వైపు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగానే తెలంగాణ ప్రాంత మంత్రులంతా రాజీనామా చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. కాగా.. ఉద్యమంలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్న వైనంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. మాజీ నక్సల్స్, మావోయిస్టుల సానుభూతిపరులు ఉద్యమంలో ప్రవేశించి.. విధ్వంసానికి పాల్పడుతున్నారేమోనన్న అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దాంతో.. సర్కారు అప్రమత్తమైంది. తెలంగాణ జిల్లాలకు అదనపు బలగాలను తరలిస్తోంది.

పోలీసు శాఖకు హుటాహుటిన రూ. 44 కోట్లను విడుదల చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. మరో వైపు.. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ సారథి బొత్స సత్యనారాయణ అధిష్ఠానంతో చర్చలకు మరో సారి ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ నెల 11వ తేదీన తాను మరో దఫా హస్తినకు వెళ్లి.. తెలంగాణపై జాతీయ నేతలతో మాట్లాడనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇలా తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని ఆలస్యం చేస్తూండటం.. సకల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రానురానూ రాష్ట్రంలోని పరిణామాలు ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.



*********************************************************************************

విభజన కష్టమే
Pranab-Mukherjeeప్రత్యేక తెలంగాణపై ప్రభుత్వ వైఖరిని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్టు సూటిగా, టూకీగా చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది ఒక్క తెలంగాణకే పరిమితం కాదని, ఇలాంటి డిమాండ్‌లు దేశంలో పెరిగిపోతున్నాయని ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. రాష్ట్రాలను విభజిస్తే అనేక సమస్యలు, చిక్కులు ఎదురవుతాయన్నారు. ఒక జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ గురిం చి ప్రస్తావించారు. తెలంగాణ ఇస్తే, దేశంలో చాలా రాష్ట్రాల్ని విభజించాల్సిన పరిస్థితి తలెత్తుతుందన్నారు. అసలు సమస్య మొదటి ఎస్‌ఆర్‌సీతో ప్రారంభమై, అనేక మలుపులు తిరిగిందన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భాష ప్రాతిపదికగా రాష్ట్రాల్ని విభజించారు తప్ప ప్రాంతాలపరంగా, ప్రాంతీయతత్వంతో విభజన జరగలేదని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ సాధ్యం కాదు, రాదు, కుదరదు అన్న ధ్వని ఆయన మాటల్లో వినిపించింది. విభజన కష్టమని, అది జరిగేపని కాదని అన్యాపదేశంగా చెప్పారు. యూపీఏ లో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ... ‘ట్రబుల్‌ షూటర్‌’గా పేరున్న ప్రణబ్‌ దాదా ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేస్తే ముందు ముందు మరిన్ని సమస్యలు తలెత్తుతాయన్నారు. ‘తెలంగాణ చాలా సున్నితమైన సమస్య. ఈ సమస్య చాలా క్లిష్టమైంది. కాబట్టి...పరిష్కారానికి గడువు చెప్పడం కష్టం’ అని ప్రణబ్‌ ఇందుకు మరికొంత సమయం అవసరమన్న భావనను తన మాటల్లో వ్యక్తం చేశారు.

భాషాప్రయుక్త రాష్ట్రాలే
ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌పై చాలారకాలుగా ఆలోచించాలనీ, అదంత సులభం కాదనీ ప్రణబ్‌ అన్నారు. ఫలితం సాధించాలంటే... స్థానిక నాయకులతో మరింత విస్తృతంగా చర్చించాలని కేంద్ర ఆర్థికమంత్రి అన్నారు. ప్రత్యేక తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయనీ, ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇవి ప్రాంతీయ విభేదాలు
‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణను వేరుచేయడం మామూలు విషయం కాదు. తెలంగాణ సమస్య పరిష్కారమైతే, దాన్నుంచి మరెన్నో సమస్యలు పుట్టుకొస్తాయి. వేర్పాటు తెలంగాణతో ఆగదు. వెంటనే తెలంగాణ సమస్యను పరిష్కరించలేం. ప్రస్తుతం ప్రాంతీయ విభేదాలే తప్ప, రాజకీయ విభేదాలు లేవు’ అని ప్రణబ్‌ముఖర్జీ వ్యాఖ్యానించారు.

అధికార కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ సమస్యను ఉన్నతస్థాయిలో చేపట్టిన తరుణంలో ప్రణబ్‌ముఖర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. విభజనపై తొందరపడి నిర్ణయం తీసుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని ప్రణబ్‌ వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రణబ్‌ మరో విషయాన్ని కూడా గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా ఈవిధంగా రాష్ట్రాలు ఏర్పడలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటు గురించి మరీ లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.

తిరకాసంతా ఎస్‌ఆర్‌సీతోనే
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పార్టీల మధ్య విభేదాలు పోయి, ఇప్పుడు ప్రాం తీయ విభేదాలు వచ్చాయని ప్రణబ్‌ చెప్పారు. అసలు సమస్యంతా మొదటి ఎస్‌ ఆర్‌సి (రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం) తో వచ్చిందని, అప్పటి నుంచీ పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, ఆరు సూత్రాల పథకం వంటివి ఎ న్నో వచ్చాయని, కథ చాలా మలుపులు తిరిగిందని చెప్పారు. దీర్ఘకాలిక దృష్టితో చూస్తే...తెలంగాణ ఏర్పడితే ముందు ముందు మరిన్ని సమస్యలకు ఆస్కార ముందన్నారు. ఈ ఈ డిమాండ్‌ హింసకు దారితీస్తుందనే భయాం దోళన లున్నాయని, కాబట్టి శాంతిభద్రతల్ని కాపాడాలనీ ప్రణబ్‌ముఖర్జీ విజ్ఞప్తి చేశారు.






**********************************************************************************

తెలంగాణ వైపు దూకుడు
dukudu(సూర్య ప్రధాన ప్రతినిధి)అధికార కాంగ్రెస్‌, ప్రత్యర్థి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏకకాలంలో ఎదుర్కొంటూ, తెలంగాణ ప్రాంతంలో పార్టీని కాపాడుకునే త్రిముఖ వ్యూ హాలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వేగంగా అడుగులేస్తున్నారు. ఇప్పటివరకూ టీఆర్‌ఎస్‌పై మౌనంగా ఉన్న చంద్రబాబు గత రెండు రోజుల నుంచి దూకుడు పెంచి, ఆ పార్టీని దునుమాడుతున్నారు. జనంలోకి వెళుతూ కిరణ్‌, జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

బలమైన క్యాడర్‌ ఉన్న తెలంగాణలో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను సొంత కొందరు సొంత పార్టీ నేతలే కారణమని గ్రహించిన బాబు, వారికి చెక్‌ పెడుతున్నారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిం చకుండా, జనంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న నేతల వైఖరి వల్ల తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టు కుపోతోందన్న వాస్తవం వె ల్లడయింది. దానితో దిద్దుబాటుకు దిగిన బాబు.. తానే త్వరలో తెలం గాణ పర్యటనకు సిద్ధమవుతానని చెప్పడంతో ‘టీ’డీపీ నేతలు అప్రమత్తమయి, టీఆర్‌ఎస్‌పై విమర్శల దాడి పెంచుతున్నారు.

టీఆర్‌ఎస్‌ను గానీ, కేసీఆర్‌ను గానీ విమర్శిస్తే జనం సహించడం లేదని, తాము తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదంటూ ఇంతకాలం అడ్డుపుల్లలు వేస్తూ పార్టీని హైదరాబాద్‌కే పరిమితం చేసిన కొందరు టీడీపీ నేతలపై సహచర నేతలు బాబుకు ఫిర్యాదు చేశారు. ప్రజల్లోకి వెళితే తిరగబడే ప్రమాదం ఉందని భయపెడుతూ, ఒక వ్యూహం ప్రకారం తెలంగాణలో పార్టీని నిర్వీర్యం చేసేందు కు ఒకరిద్దరు చేస్తున్న ప్రయత్నాలు బట్టబయల య్యాయి. వీరాంతా పార్టీలో ఉంటూ టీఆర్‌ఎస్‌ కు పరోక్షంగా సహకరిస్తున్నారని, మీవద్దకు వచ్చి మిమ్మల్ని కూడా తప్పుదోవపట్టిస్తూ, బయటకు వచ్చి మమ్మల్ని కూడా తప్పుదోవపట్టిస్తున్నారం టూ పలువురు నేతలు బాబుకు ఫిర్యాదు చేశారు.

టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయకపోతే తెలంగాణ లో కేసీఆర్‌ పార్టీని భూస్థాపితం చేయటం ఖాయ మని, తప్పుడు సమాచారం ఇచ్చే ఆ నేతలను పక్కకుపెట్టకపోతే నిజంగానే తెలంగాణలో పార్టీకి పుట్టగతులుండవని భావించిన బాబు.. పార్టీ నేత లను దారిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. గత రెండురోజుల నుంచి దేవేందర్‌గౌడ్‌, మోత్కు పల్లి, రేవంత్‌రెడ్డి వంటి నేతలు టీఆర్‌ఎస్‌పై విరు చుకుపడుతుండటం ప్రస్తావనార్హం.
తెలంగాణలో ఉన్న బలమైన క్యాడర్‌ను స్థానిక నేతలే తప్పుదోవపట్టిస్తూ, కిందిస్థాయి నేతలకు మార్గదర్శనం లేకుండా చేస్తున్నారన్న ఫిర్యాదులు చాలాకాలం నుంచీ వినిపిస్తున్నాయి. పార్టీ అగ్రనే తలంతా నియోజకవర్గాలకు వెళ్లకుండా హైదరా బాద్‌లో కూర్చోవడం, పార్టీ కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడి కాలక్షేపం చేసి వెళ్లిపో తున్నారు.

గతంలో టీఆర్‌ఎస్‌పై దూకు డుగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస యాదవ్‌, అరవింద కుమార్‌గౌడ్‌ ఇటీవల కాలంలో జోరు తగ్గిం చారు. దేవేందర్‌ గౌడ్‌ గత రెండురోజుల నుంచీ టీఆర్‌ఎస్‌పై స్వరం పెంచారు. పెండింగ్‌లో ఉన్న రెండు పొలిట్‌బ్యూరో సభ్యుల సభ్యత్వాలను తలసాని, దేవేందర్‌గౌడ్‌లో ఒకరికి ఇవ్వాలన్న సూచన చాలాకాలం నుంచి ఉంది. కానీ దానిపై ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. దానితో వారిద్దరూ ఎదురుదాడిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మాజీ మంత్రులు, పార్టీ పదవుల్లో ఉన్న మిగిలిన అగ్రనేతలు అంటీముట్టనట్లు వ్యవహరి స్తున్నారు. బాబుదగ్గర విధేయత ప్రకటిస్తున్న మరికొందరు నేతలు వారిజిల్లాల్లో అందుకు విరు ద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనిం చిన తర్వాతే.. ఇక వారితో లాభం లేదనుకునే బాబు తెలంగాణ పర్యటనకు సిద్ధమవుతున్నారు.

కోస్తాలో జగన్‌ను ఎదుర్కోవడంతో పాటు, ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను సద్విని యెగం చేసుకునేందుకు చేస్తున్న జనచైతన్య యాత్రలకు మరింత పదును పెడుతున్నారు. వీలై నంత ఎక్కువరోజులు జనం మధ్య గడుపుతు న్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న పిల్లలుగా ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఓటర్లుగా మారుతున్న విషయాన్ని గ్రహించిన బాబు.. ప్రతి జిల్లాలోనూ వారితో భేటీలు వేస్తున్నారు. తొలి సారి తనతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా వెల్లడించి దూకుడుగా వ్యవహరించిన బాబు, ఇప్పుడు జనంలోకీ అంతే దూకుడుగా వెళుతున్నారు.

సమ్మె, ఉద్యమాల వల్ల నష్టపోతున్న ప్రజల ఇబ్బందులను సద్వినియోగం చేసుకునే క్రమం లో దానిని ప్రభుత్వ వైఫల్యంగా ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నారు. అదే సమయంలో జగన్‌ అక్రమ ఆస్తులపైనా విరుచుకుపడుతున్నారు. అయితే, జగన్‌పై విమర్శలను బాబు కంటే ఆ తర్వాతి స్థాయి నాయకులు చేయిస్తేనే బాగుం టుందన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, యువకులకు చేరువయ్యేందుకు బాబు తన సహజశైలిని మార్చుకుని ప్రత్యర్ధులపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
*************************************************************************************************************



No comments:

Post a Comment