Wednesday, September 21, 2011

మతాన్నిబట్టి న్యాయం






--సాక్షి
September 17th, 2011

మాటవరసకు మీ వీధిలో ఓ కిరాణా దుకాణముంది. అక్కడ సరుకులు కల్తీ; తూకంలో మోసం! ఆ సంగతి మీరు కనిపెట్టారు.పదిమందికీ చెప్పారు. అందరూ అక్కడ కొనడం మానేశారు. మీ దెబ్బకు ఆ దుకాణం మూతపడింది.

మంచిపని చేశానని మీరు అనుకున్నారు. మంచిపనే. కాని - సరికొత్త మతహింస బిల్లు చట్టమయ్యాక మీరు ఇదే పని చేస్తే... ఆ షాపు నడిపేవాడు ఏ అబ్రహామో, అబ్దుల్లానో అయితే... మీకు మూడినట్టే! అతగాడు పితూరీ చేసిన మరుక్షణం పోలీసు ఇనె్స్పక్టరు రెక్కలు కట్టుకుని మీ ఇంటికొచ్చి- ‘‘మైనారిటీ వర్గానికి చెందినవాడి వ్యాపారాన్ని బహిష్కరించి, అతడి జీవనోపాధిని దెబ్బతీయుట ద్వారా మైనారిటీ వర్గానికి ప్రతికూల వాతావరణాన్ని కల్పించుట’’ అనే నేరం కింద మిమ్మల్ని ఉన్నపళాన అరెస్టుచేసి జైల్లోకి తోస్తాడు. దాని వెనక ఎవరున్నదీ మీకు తెలుసు కాబట్టి మీరో, మీ వాళ్లో పరుగున పోయి వ్యాపారి కాళ్లు పట్టుకుని కేసు మాఫీ చేయించుకోగలరేమో! కాని కొన్ని సందర్భాల్లో అదీ కుదరదు.

యథేచ్ఛగా జరిగే మతాంతరీకరణలు అనర్థమనో, ఇస్లామిక్ టెర్రరిజానికి పాలుపోసే వారిని పట్టుకోవాలనో, ఏదో మైనారిటీ విద్యాసంస్థ అక్రమాల గురించో మీరు ఎప్పుడో, ఎవరి ముందో ఘాటుగా మాట్లాడి ఉండవచ్చు. మైనారిటీ మతస్థులతో ఏ లావాదేవీలోనో, వృత్తి, వ్యాపార పరంగానో గొడవపడి ఉండవచ్చు. లేదా ఏ వందేమాతరం క్లబ్బుకో, మైనారిటీలకు సరిపడని హిందూమత సంస్థకో విరాళం ఇచ్చి ఉండవచ్చు. కర్మంచాలకపోతే వీటిలో దేని గురించి ఫిర్యాదు అందినా పోలీసువాడు సంకెళ్లుపట్టుకుని మీ ఇంటికి రాగలడు. మైనారిటీ వర్గంపై ద్వేష ప్రచారం చేశావనో, మైనారిటీ వర్గానికి చెందిన కారణంతో ఒక వ్యక్తిపై దౌర్జన్యం చేశావనో, చేస్తానని బెదిరించావనో, మైనారిటీ వర్గానికి ప్రతికూల వాతావరణం కల్పించేందుకు సహకరించావనో ఫిర్యాదు అందింది కనుక మతహింస చట్టం కింద అర్జంటుగా నిన్ను అరెస్టు చేస్తున్నాననగలడు. ‘‘ఎవడో ఫిర్యాదు చేసినంత మాత్రాన నేను నేరం చేసినట్టేనా? చేశానో లేదో మీరు విచారించి నిర్ధారించుకోవద్దా?’’ అంటారు మీరు. ‘‘అదేమో నాకు తెల్వద్. నేరం రుజువయ్యేదాకా ప్రతోడూ నిర్దోషేనని నీలాంటోళ్లు చెప్పే కబుర్లు ఇక్కడ నడవవ్. మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా నేరం జరిగిందా లేదా అన్న ప్రశ్న వస్తే - జరిగిందనే భావించాలని కొత్త చట్టం 73వ సెక్షను చెబుతుంది. నేరం చెయ్యలేదని రుజువయ్యేదాకా నిందితుడు నేరంచేసి ఉంటాడనే అనుకోమని 74వ సెక్షను అంటుంది. నీ మీద ఫిర్యాదు వచ్చింది కాబట్టి నువ్వు నేరం చేసినట్టే! నిన్ను బొక్కలో తొయ్యాల్సిందే’’ అంటాడు పోలీసు. అది విని మీ బుర్ర గిర్రున తిరుగుతుంది. ‘‘మా లాయరుతో మాట్లాడుతా. ఏం చేయాలో ఆలోచించి మీ దగ్గరికి వస్తా’’ అంటారు. ‘‘ఆ పప్పులక్కడ ఉడకవ్ తమీ. ఈ చట్టం కిందికి వచ్చే ఏ నేరమైనా కాగ్నిజబుల్ అఫెన్స్. నిన్ను వెంటనే అరెస్టు చెయ్యాల్సిందే. లాయరొచ్చి బెయిలు తెస్తాడనుకుంటున్నావేమో ఈ కేసుల్లో బెయిలు కూడా ఇవ్వరు. కదులు ముందు’’ అని తొందరపెడతాడు పోలీసు. ఇక మీకు ఏడుపొచ్చేస్తుంది. ‘‘కనీసం నా మీద కంప్లయింటు చేసిందెవరో చెప్పండి. పోయి కాళ్లయినా పట్టుకుంటాను’’ అంటారా?

నో చాన్స్! ఆ ఆశాలేదు. బాధితుడు ఎవరన్నది ఎవరికీ తెలియనివ్వకూడదని 40వ సెక్షను ఆన!
పోనీ - మీ ఏడుపుకు దయతలిచో, మీ వాలకం గమనించో, వారినీ వీరినీ వాకబు చేసో, మీకు అంతటి నేరం చేసేంత సీను లేదని పోలీసు ఇన్స్ప్‌క్టరు ధ్రువపరచుకుని మిమ్మల్ని వదిలేద్దాం అనుకున్నాడనుకోండి. ఐనా మీ కష్టాలు తీరవు.

పసలేని ఫిర్యాదులెమ్మని పోలీసులు దేన్నీ బుట్టలో పడెయ్యటానికి వీల్లేదు. ఫిర్యాదుపై దర్యాఫ్తు ఎంతవరకు వచ్చిందీ, ఎవరిని అరెస్టు చేసిందీ, చార్జిషీటు ఎప్పుడు పెట్టేదీ ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుకు రాతపూర్వకంగా దాఖలు చేసుకోవలసిన బాధ్యత 69వ సెక్షను ప్రకారం దర్యాఫ్తు అధికారిపై ఉంటుంది! అరెస్టు చెయ్యలేదు, చార్జిషీటు పెట్టట్లేదు అని పోలీసులంటే ‘‘బాధితుడు’’ ఊరుకోడు. ఏకంగా సరికొత్త ‘‘నేషనల్ అథారిటీ’’కో, ‘‘స్టేట్ అథారిటీ’’కో పోతాడు. ఒక్కో అథారిటీలోనూ ఏడుగురు మెంబర్లుంటారు. వారిలో కనీసం నలుగురు కంపల్సరీగా మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే ఉంటారు. వాళ్ల చేతిలో ప్రభుత్వాలనే ఫుట్‌బాల్ ఆడగలిగేంతటి అధికారాలుంటాయి.

కట్ చేస్తే... ఏ మహాద్భుతమో జరిగితే తప్ప మీకు మూడేళ్ల నుంచి యావజ్జీవం వరకూ జైలుశిక్ష, భారీ జుల్మానా గ్యారంటీ!

దేశవిభజన కాలం నుంచి నేటిదాకా ఇండియాలో ఎన్నో మతకల్లోలాలు జరిగాయి. ఎన్నో వేలూ, లక్షల మందిని దారుణంగా బలిగొన్నాయి. వారిలో అన్ని మతాలకు చెందినవారూ ఉన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన పాపంలో మెజారిటీ మైనారిటీ అన్న తారతమ్యం లేదు. దేశం మొత్తంమీద చూస్తే మైనారిటీ అయిన వారిది కూడా ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, లేక ఒక నగరంలో మెజారిటీ అయిన దృష్టాంతాలు లెక్కలేనన్ని. మానవత్వానికి, సభ్య సమాజానికి సిగ్గుచేటు అయిన మత హింస ఉన్మాదానికి పాల్పడింది ఎవరైనా, ఏ మతస్థులైనాసరే అందరినీ ఒకే విధంగా పరిగణించి, కఠినాతి కఠినంగా శిక్షించాలనే ఎవరైనా కోరేది. మతంతో విశ్వాసాలతో నిమిత్తం లేకుండా భారత పౌరులందరికీ సమాన న్యాయం, సమాన హక్కు ఉండాలనే అందరమూ అడిగేది.

అదీ పేరాశేనని దయగల యు.పి.ఎ. సెక్యులర్ సర్కారువారు ఇప్పుడు బ్రహ్మాండంగా తేల్చి పారేశారు. పార్లమెంటు నెత్తిమీద సూపర్ పార్లమెంటులా అమాంబాపతు శాల్తీలతో కొలువుతీరిన నేషనల్ అడ్వయిజరీ కౌన్సిలు వండివార్చి, కేంద్ర కేబినెటు కళ్లు మూసుకుని ఓకే చేసి, ఇక పార్లమెంటు ఆమోదం తతంగమే తరువాయి అనుకుంటున్న Prevention of Communal and Targeted Violence Bill, 2011 లో ఫొందుపరిచిన ప్రకారం-

మైనారిటీలపై మెజారిటీ వర్గం జరిపేది మాత్రమే ‘మతహింస’గా పరిగణించబడును. ముస్లింలపై హిందువులలాగే, హిందువులపై ముస్లింలో, ఇంకో మతస్థులో మతహింసకు పాల్పడ్డ ఉదంతాలు ఇటీవలి చరిత్రలో ఎన్ని ఉన్నా సరే! ఈ తల తిక్క బిల్లు దృష్టిలో - మైనారిటీ వర్గాలు మాత్రమే మతహింసకు బాధితులు.

'Victim' means any person belonging to a "group"
(భాధితుడు అనగా ఒక గ్రూపునకు చెందిన వారెవరైనా.)

"Group" means a religious or linguistic minority...
(‘‘గ్రూఫు’’ అనగా మతపరమైన, లేక భాషాపరమైన మైనారిటీ...)

అని 3వ సెక్షనులో ఇచ్చిన అమోఘ నిర్వచనాలను బట్టే ‘గోధ్రా’ రైలు పెట్టెలో సజీవ దహనమైన అభాగ్యులూ, 1993 బొంబాయి అల్లర్లలో ఘోరంగా బలి అయిన వందలాది హిందువులూ, కాశ్మీర్ గడ్డ నుంచి గెంటివేయబడ్డ లక్షలాది పండిట్లూ ‘మత హింస’ బాధితుల లెక్కలోకి రారని స్పష్టం. కుల, మత, విశ్వాసాలకు అతీతంగా భారత పౌరులందరూ చట్టం దృష్టిలో సమానులన్న రాజ్యాంగ సూత్రాన్నీ, నేరం రుజువయ్యేదాకా ఎవరినైనా నిరపరాధిగా చూడాలన్న సాధారణ న్యాయాన్నీ గుంటపెట్టి గంట వాయించి... ‘మతాన్నిబట్టి న్యాయం’ అన్న అడ్డగోలు సిద్ధాంతాన్ని లేవదీసిన జాతీయ సలహామండలి మేధావుల తెలివికి జోహార్లు! మైనారిటీల ప్రయోజనాలను కాపాడటమంటే మెజారిటీ ప్రజలను కాలరాచి, తుంగలో తొక్కడమేనని కనిపెట్టిన వీర సెక్యులర్ సర్కారువారి బుర్రే బుర్ర!







పేదల 'దిగజారుడు' - కేంద్రమంత్రుల 'ఎగబాకుడు'

Thu, 22 Sep 2011, IST    vvShare
పేదల 'దిగజారుడు' - కేంద్రమంత్రుల 'ఎగబాకుడు'
పి. సాయినాధ్‌
మనం కోరుకుంటున్న రీతిలో ఎయిర్‌ ఇండియా పనిచేస్తూ వుండకపోవచ్చు. అయితే దానిని దట్టమైన అప్పుల మేఘాల్లోకి మాత్రం ధైర్యవంతులు తీసుకుపోతు న్నారు. ప్రఫుల్‌ పటేల్‌ (ఇప్పుడు విమానశాఖ మం త్రిత్వశాఖ అతని క్రిందలేదు) మే 2009నుండి ఆగస్ట్‌ 2011 వరకు గత 28 మాసాల్లో తన ఆస్తులను, ప్రతిరోజూ రు.5 లక్షల చొప్పున పెంచు కుంటూ పోయారు. ఇది చాలా తక్కువ చేసి చెప్పిన అంకె అవుతుంది. ఎందుకంటే ఇది అతని మాటపైనే ఆధారపడింది. ఇలాంటి విషయాల్లో మంత్రులు నిరాడంబరతతో ఉంటూ ఉంటారు. అయితే అధికారిక సమాచారాన్ని బట్టి ఈ లెక్కను తప్పించుకునేవీలులేదు.
2009లో పటేల్‌ అందజేసిన ఎన్నికల అఫి డవిట్‌లో ఆయన తన ఆస్తుల విలువ రు.79 కోట్లుగా తెలియజేశారు. 2009 ఏప్రిల్‌ వరకు గల తన ఆస్తుల న్నింటికీ ఆయన అంత విలువ కట్టి వుంటారను కుందాం. ఎందుకంటే ఆ సంవత్సరంలో మేలో ఎన్నికలు జరిగాయి. ఆయన పేరు ఎదురుగా ఈ నెలలో రు.122 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) ఆన్‌లైన్లో వివ రాలుంచింది. ఈ పెరుగుదల, 28 మాసాల్లో చోటుచేసు కుంది. కాబట్టి, రోజుకు సగటున రు.5 లక్షలుగా ఈ పెరుగుదల ఉంటోందని నా లెక్క చెబుతోంది. (ఒక్క విషయం చెప్పాలి. పటేల్‌ అంత వేగంగా లెక్కవేయలేను)
ఇదిలాగుంటే, ఎయిర్‌ ఇండియా తన ఉద్యో గులకు వేతనాలిచ్చేందుకు తంటాలుపడుతోంది. సంవత్సరంలో ఎయిర్‌లైన్‌ ఉద్యోగి ఆర్జించే వేతనంలో 40 శాతం పటేల్‌ ప్రతిరోజు తన సంపదకు జోడిస్తు న్నాడు. ఆవిధంగా ఎయిర్‌లైన్‌ క్రిందికి దిగుతుంటే ఆయన మరింత ఎత్తుగా ఎగురుతున్నాడు. పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ మండలి (బిఐఎఫ్‌ఆర్‌) మాజీ అధినేత ఒకరు దశాబ్దాల క్రితమే చెప్పినట్లుగా ''సంస్థలు ఎంతగా అస్వస్థత పాలైపోతూ వుంటే సొంతదారులు అంత పుష్టికరంగా వుంటారు'' ఇది భారతదేశ పేద ప్రజలకు తమ ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు మొరటుగా ఉన్నప్పటికీ సరిగ్గా అతికినట్లు వుంటుంది. వారెంతగా దారుణంగా దిగజారిపోతూ వుంటే, కేంద్ర మంత్రివర్గం అంతపుష్టిగా వుంటుంది( ఈ సమీకరణం లోకి కార్పొరేట్‌ అధినేతలను కూడా లాక్కురండి. అప్పుడు మరింత రసవత్తరంగా ఉంటుంది. అయితే అది మరో కథ) పటేల్‌కు తను చేసిన సేవలకు ప్రతిఫలం లభించింది. అతనిని కేబినెట్‌ స్థాయికి పెంచుతూ భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ పరిశ్రమల మంత్రిగా పదోన్నతి కల్పించారు.
ఎప్పుడూ జరిపేలాగే, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఎడిఆర్‌) జాతీయ ఎన్నికల నిఘా(ఎన్‌ఇడబ్ల్యు) కేంద్ర మంత్రి వర్గ ఆస్తులపై జరిపిన విశ్లేషణ అధికారిక మైనది. ఫలితాలు నెమ్మదిగా బొట్లుబొట్లుగా దిగువకు చేరతాయన్నది పాత మాట. ఉన్నతస్థాయికి ఎత్తిపోతల ద్వారా ఎంతో వేగంగా, బలంగా పంపడం నేటి మాట. కేంద్ర మంత్రి సగటు ఆస్తుల విలువ రు.7.3 కోట్ల నుండి రు.10.6 కోట్ల వరకు ఈ 28 మాసాల్లో పెరి గింది. అంటే ఈ 28 మాసాల్లో సగటున ఏదో ఒక మోస్తరుగా 10 లక్షల రూపాయలు నెలనెలా ఆస్తులకు కలిశాయన్నమాట.
ఏవిధంగా చూసినా పటేలే అత్యంత సంపన్నుడైన కేంద్ర మంత్రివర్గ సభ్యుడు. అయితే డిఎంకెకు చెందిన డా. జగద్రక్షకన్‌ అత్యంత త్వరితంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సమాచార, ప్రసార శాఖల సహాయమంత్రిగా వున్న ఈయన ఆస్తులు 1,092 శాతం పెరిగాయి. అదే పటేల్‌ ఆస్తులు 53 శాతమే పెరిగాయి. ఎడిఆర్‌ విశ్లేషణ ప్రకారం, ఆయన ఆస్తులు 2009లో రు.5.9 కోట్లకు పెరగగా ఈ ఏడాది రు.79 కోట్లకు పెరిగాయి. అయితే పటేల్‌ 122 ఇంకా బ్యాటింగ్‌ చేస్తూ కేబినెట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఇదిలాగుంటే, డాషింగ్‌ యువదళం ఏమంత వెనుకబడి లేదు. కమ్యూనికేషన్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి యువకుడైన మిలింద్‌దేవరా 2009, 2011ల మధ్య తన ఆస్తులను దాదాపు రెట్టింపు చేసుకొన్నారు. ఆయన తన రు.17 కోట్ల నుండి రు.33 కోట్లకుపైగా ఎగబాకారు. గుర్తుంచుకోండి 2004 ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రు.8.8 కోట్లుగా మదింపుచేశారు. ఏడేళ్ళుగా ప్రతి రోజు దాదాపు రు.1 లక్ష జోడిస్తూ ఏడేళ్ళలో తన ఆస్తులను నాలుగింతలుగా చేసుకోవడం ఏమంత తీసివేయ దగిందేం కాదు.
పైపైన చూస్తే, దేవరా వ్యవసాయమంత్రి శరద్‌ పవార్‌ను మించిపోయారు. వారి డిక్లరేషన్లను బట్టి చూస్తే, 2009లోనే ఆ మారాఠా యోధుడికంటే దేవరా రెండున్నరరెట్లు సంపన్నుడు. అయితే అప్పటి నుండి అతను తన ఆస్తులను 90 శాతం పెంచుకొన్నాడు. అదే సమయంలో పవార్‌ నామమాత్రపు రు.4 కోట్లైనా తన ఆస్తులకు చేర్చుకోలేకపోయాడు. దానర్ధం రు.12.5 కోట్లు అని ఆయన ఆస్తి విలువ లెక్కకట్టి చెప్పారు. కాని ఆయన సొంత రాష్ట్రంలో వినిపిస్తున్న గుసగుసలేమిటంటే, పవార్‌ మొత్తం ఆస్తుల విలువని లెక్కకట్టి ప్రకటించాడా లేక నెలసరి ఆదాయం మీద ప్రకటించాడా అని.
మరో నిగ్రహం గల నిర్వాహకులు శాస్త్ర సాంకేతిక మంత్రి విలాస్‌రావ్‌ దేశముఖ్‌, 2009 నుండి ఆయన ఏమాత్రం విలువలేని రు.1.73 కోట్లు మాత్రమే తన ఆస్తులకు జమచేయగలిగారు. దేశ్‌ముఖ్‌ భూశాస్త్రాల మంత్రిగా కూడా పనిచేశారు. (మహారాష్ట్రలో దీనిని రియల్‌ ఎస్టేట్‌ సామర్థ్యానికి పారిభాషిక పదంగా పరిగణిస్తారు)
మరోపక్కన మన్మోహన్‌సింగ్‌ బృందంలోని క్రికెట్‌ ముఠా చక్కగా పనిచేస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కొత్త ఐపిఎల్‌ బాస్‌ రాజీవ్‌ శుక్లా, ఆ 28 నెలల్లో రు.22 కోట్లను తన ఆస్తులకు జోడించారు. అది 2009లోని రు.7 కోట్ల నుండి ఈ ఏడాది రు.30 కోట్లకు మించి పెరిగిపోయింది.
ఇలా పదవుల్లో వున్న మంత్రులే వర్ధిల్లడం లేదు. అలాగే ఇలా పైపైకి ఎదగడం కేంద్రానికే పరిమితం కాదు. ఎప్పటిలాగే, ఈ గిన్నిస్‌బుక్‌ రాయుళ్ళు నా రెండు సొంత రాష్ట్రాల నుండే-మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు వున్నాయి. (వాస్తవానికి నాకుమూడోది తమిళనాడు కూడా వుంది. అక్కడి నుండే జగద్రక్షకన్‌ వచ్చారు. ఆవిధంగా స్వరాష్ట్రాభిమానానికి అవకాశాలు మరింత విస్తృతమయ్యాయి).
ఒక్కసారి ఆంధ్రప్రదేశ్‌ వైపు చూద్దాం. వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి అధికారంలో లేడు. అయితే తన ఔత్సాహిక పారిశ్రామిక ప్రస్థానానికి అది ప్రతిబంధకం కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌తో గడచిన 24 మాసాల్లో, 2009 ఏప్రిల్‌లో కేవలం రు.72 కోట్లుగా ఉన్న అంకెకు ఆయన రు.357 కోట్లకు పైగా కలిపేరు. దీనర్ధం ఈ కాలంలో సగటున ఆయన ప్రతిఒక్క రోజు రు.50 లక్షలు జమచేసుకుంటూ వచ్చారన్నమాట. సకల రంగాల్లో అతను ఎదుర్కొంటున్న చిక్కుల నేపధ్యంలో ఈ ఫలితాలు చిన్నవేమీ కావు. ఇప్పుడు మీకు అర్థమౌతుంది. రాజకీయాల్లో వస్తున్న కొత్త తరం కార్యశూరత్వం అంటే ఏమిటో పండితులు చర్చిస్తున్నారు.
పాపం చంద్రబాబు నాయుడు మరింత పేద వాడిగా ఎదిగాడు. అన్నా హజారే శకంలో ఆవిష్కృతమైన 'వాతావరణం' దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి తన ఆస్తుల విలువను బహిరంగపర్చాడు. ఆయన ఆస్తి విలువ రు.40 లక్షలు కూడా లేదు. అయినప్పటికీ ఆయన జీవనాధారానికి తక్షణమే ఆందోళన చెందవలసిన కారణమేమీ లేదు. ఆయన భార్యకు దాదాపు రు.40కోట్లు విలువచేసే సంపదవుంది. అయినప్పటికీ, సంబంధిత చిత్రం ఆంధ్రరాజకీయాల సూక్ష్మ ప్రపంచంగా వుంది. జగన్‌ పెరుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు తగ్గుతున్నాడు. అయితే, అదృష్టం చంద్రబాబుకు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆయన అకౌంటెంట్లు మాత్రం ఆయన పట్ల ఎంతో ఉదారంగా వున్నారు. ఆయన జూబ్లీహిల్‌ ఆస్తి (1,125 చ||గజాలు లేదా 10,000చ||అడుగులు) రు.23.20 లక్షల కన్నా ఎక్కువగా చూపించలేదు.ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం. ఆసొమ్ముతో 10 వేల చదరపు అడుగులలో ఇల్లు కట్టడం ఎంతో పొదుపరి చర్య కదా! అయితే, ఆయన 2009 ఎన్నికల అఫిడవిట్‌లో దాని విలువ దాదాపు రు.9 కోట్లు. ఈ సారి చంద్రబాబు నాయుడు కేవలం 'సేకరణ ధర' మాత్రమే మనకు యిచ్చాడు. మార్కెట్‌ విలువ ఎప్పటికప్పుడు మారుతూ వుంటుంది కాబట్టి మార్కెట్‌ విలువ యివ్వలేదు.
దీనంతటి నుండి, తెలివైన అకౌంటెంట్లు నుండి తీవ్రమైన గుణపాఠాలు నేర్చుకోవలసివుంది. సంపత్తి, సంపద వెర్రిపెరుగుదల మంత్రుల విషయంలో మాత్రమే కాదు. ఎం.పీలు, ఎంఎల్‌ఎ ల విషయంలో కూడా, రాష్ట్రాలలో ప్రధాన రాజకీయశక్తులకు ప్రత్యేకించి, కాంగ్రెస్‌, బి.జె.పి.,ఎక్కువ పాలక లేదా పెద్ద పార్టీలకు చెందిన అన్ని స్థాయిలలోని రాజకీయ నాయకుల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని వుంది. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో కోటేశ్వరుల సంఖ్య పెరిగి పోయింది. మహారాష్ట్రలో 2004 లో 108 మంది కోటీశ్వరులుంటే 2009లో వారి సంఖ్య 186కి పెరిగింది. కేంద్ర మంత్రి వర్గంలో నాలోగింట మూడువంతుల మందికి పైగా కోటీశ్వరులు. వారి నూతన సంపదలో ఎక్కువ భాగం వారు పదవిలో వుండగా సంపాదించినదే.
ప్రజాగ్రహం, ఎడిఆర్‌లు, ఎన్‌.ఇ.డబ్ల్యూ.ల నిరంతర ప్రయత్నం, పట్టుదలతో దీనికి సంబంధించిన సమాచారం మరింతగా బహిర్గతమైంది. ఇది అద్భుతం. అయితే అన్ని డిక్లరేషన్లలో వారు పన్నులుగా చెల్లించినవి కూడా కలపాలి. దాన్ని బట్టి ప్రజలకు ఆస్తులకు సంబంధించిన సంఖ్యలు మరింత మెరుగ్గా అర్థమవుతాయి. ప్రజాసేవలో పార దర్శకతను కోరుకున్నట్లయితే ఆన్‌లైన్‌ ఆదాయవ్యయాలను కూడా కలిపి వెల్లడించాలి. మనకు చాలా అవసరమైన వాటిలో ఇదొక ముఖ్యమైన సంస్కరణ అవుతుంది. మరొకటి, మోసగించినందుకు జరిమానాలు. తమ డిక్లరేషన్లలో 12 సొంత నివాసిత భవనాలను చేర్చని మంత్రులను మనకు ఎడిఆర్‌ వెల్లడిస్తున్నది.
కేంద్రమంత్రి వర్గంలో మొదలుకొని పకడ్బందీ ఆడిట్‌ అవసరం వుంది. అధికారంలో వుండగా ప్రజలు ఒక్కరోజులో రూ.5లక్షలు ఎలా సంపాదిస్తారు? ప్రజలకు 'సేవచేసేటప్పుడు' వారిలో ఎక్కువ మంది వారి సంపదను పెంపొందించుకుంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా దీనిపై సమాధానాలు మనకు కావాలి. కేవలం సంపద వెల్లడించడం సరిపోదు. అది అసంబద్ధంగా అంత భారీది అయితే అది ఎలా సంపాదించారో మనం తెలుసుకోవలసిన అవసరముంది.
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్ధారించేందుకు జీవించదగిన దారిద్య్రరేఖగా రోజుకు 20 రూపాయాల తలసరి వ్యయాన్ని సమర్ధించుకుంటూ గత ఏప్రిల్‌లో ప్రణాళికా సంఘం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అది రు.15 గా వుంది. రు.20ని ఉదారంగా రు.25 చేశారు. అ సంఘటిత రంగాంలోని సంస్థలకు కీ||శే||డా||అర్జున్‌ సేన్‌గుప్తా నాయకత్వంలోని జాతీయ కమిషన్‌ నివేదిక గుర్తుందా? 8.36 కోట్ల మంది భారతీయులు రోజుకు రు.20 లేదా అంతకన్న తక్కువతో జీవిస్తున్నారు అని అది రికార్డు చేసింది. మన కోటీశ్వర పుంగవులు ఈప్రజలకు ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తారు? అది ఎలాగో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. అజాపజా దొరకడు. మనం దీన్నెలా నిరోధించగలం? ఇది ఆలోచించాల్సిన విషయం. గత 20 ఏండ్లలో వచ్చిన గాఢమైన మార్పులు మిలియనీర్లు తప్ప ఇతరులు ఎన్నికల్లో పోటీచేయడాన్ని కష్టతరం చేశాయి. గెలుపు ఆ తర్వాత మాట.

No comments:

Post a Comment