Tuesday, November 29, 2011

‘మాయ’ నాలుగుముక్కలాట ఇది!
అబద్ధాల అంకయ్యలకు అరవై నాలుగు అసత్య ప్రమాణాలని మన పెద్దలంటుంటారు. అలాగే ఉన్న పదవిని కోల్పోయే ప్రమాదం ఉందని భావించే వారు, లేని పదవిని సాధించుకోవడానికి తాపత్రయ పడేవారు, ఎన్నికలలో తిరిగి గెలుస్తామో లేదో అని శంకాపీడితులుగా మారే నేతలు ఏదో ‘మిష’, లేదా ‘సాకు’ వెదుక్కుంటారు, తమ భవిష్యత్తును పదిలం చేసుకునేందుకు. ఆ ‘మిష’ మూలాన ప్రజాబాహు ళ్యం విశాల ప్రయోజనాలకు నష్టం వాటిల్లినా వాళ్లకి అనవసరం. తమ పబ్బం గడవాలి, తాపత్రయం తీరాలి. నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం నాడు జరిగిన దేశ విభజన తరువాత తొలిసారిగా ఇటీవల కాలంలో ప్రజలను చీలుబాటల వైపునకు నెట్టే ‘బృహత్’ కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఉన్నారు.
  ఒకే భాషా, సంస్కృతులున్న జాతినీ, అది అనేక త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాన్ని విడగొట్టాలనే పదవీకాంక్షాపరులు ఉత్తరాదిలో తాజాగా పుట్టుకొస్తున్నారు. భారత రాజకీయ రంగంలో అనేక మంది ప్రధాన మంత్రు లను దేశానికి అందించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విభజించాలని రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి మాయా వతి కొత్త పన్నుగడపన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆమె ప్రకటించారు. అందుకు ‘సాకు’గా చూపిన సమర్థన ‘‘చిన్నరాష్ట్రాలు, చిన్న ప్రాంతాలలో సమర్థపాలన అందించ వచ్చునన్న బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం’’. వాస్తవం ఏమిటంటే అం బేద్కర్ ఏనాడూ చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించలేదు. భారత రాజ్యాంగ రచనా దురంధరుడు, దేశ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలలో అగ్రవర్ణాలతోపాటు సమ ప్రతిపత్తి కల్పించడం కోసం ఉద్య మించిన దళితనేత అంబేద్కర్ చిన్న రాష్ట్రాల విషయమై ఏం చెప్పారో తెలుసు కునే ముందు మాయావతి ఉత్తరప్రదేశ్ విషయంలో అనుసరించిన అక్రమ విధానాల్ని తెలుసుకోవడం అవసరం. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా (అవధ్‌ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, పశ్చిమప్రదేశ్) తెగ్గొట్టడానికి ప్రభు త్వపరంగా తీసుకున్న నిర్ణయం గురించి ప్రతిపక్షాలతో చర్చించడానికి గానీ, లేదా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత దానిపైన సభలోని సకల పక్షాల అభిప్రాయాలకు సుదీర్ఘ చర్చ ద్వారా అవకాశం కల్పించడం గానీ జరగ లేదు. మూడే మూడు వాక్యాల ‘తీర్మానాన్ని’ మొక్కుబడిగా ప్రవేశపెట్టినట్టు ప్రవేశపెట్టి పదే పదినిమిషాల్లో చర్చతో నిమిత్తం లేకుండా కేవలం మూజువాణీ ఓటుతో ముగించి, రాష్ర్ట ప్రజల్ని మూగవాళ్లను చేశారు.

ఇంతకీ మాయావతి ‘రాజకీయ’ నిర్ణయాన్ని త్వరితం చేసిన పరిణామం ఏది? కాంగ్రెస్ కార్యదర్శి రాహుల్ గాంధీ యూపీ పర్యటనలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఎంతగా వెనుకబడి ఉందో గణాంకాలతో సహా నిరూపించ డంతో మాయావతి తట్టుకోలేకపోయారు. రాహుల్ ప్రకటన వెలువడిన మరు నాడే - మాయావతి ఉత్తరప్రదేశ్‌ను చీల్చే కార్యక్రమం ప్రకటించారు. రాష్ర్ట విభజనను ‘వివిధ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నార’ని ఆమె ఆపద్ధర్మంగా చెప్పిన మాట నిజమే అయితే అన్ని ప్రతిపక్షాలూ కూడా సమర్థించి ఉండా ల్సింది గదా? తన ప్రతిపాదన కొత్తగా పుట్టింది కాదు, 2007లోనే కేంద్రానికి రాష్ర్ట విభజన ప్రతిపాదన పంపానని కేంద్రమే నిర్ణయం తీసుకోలేదని ఇప్పుడు చెబుతున్న మాయావతి గడచిన అయిదేళ్లుగా ‘నిమ్మకు నీరెత్తి’నట్టు ఎందుకు వ్యవహరించారు? కేంద్రం ముందుకువచ్చి ఉంటే ఈ సరికే అసెంబ్లీని ప్రత్యే కంగా సమావేశ పరిచి తీర్మానం చేసి ఉండే వాళ్లమనీ, కేంద్రం స్పందించనం దుననే ఇప్పుడు తీర్మానం చేయాల్సి వచ్చిందనీ ఆమె సమర్థించుకున్నారు.

ఏ రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ లేదా కొత్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమని మాయావతి నమ్ముతున్నారో ఆ అధికరణ ప్రకా రం గానీ, లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు వీలుగా సాధికార కమిటీ చేసే సిఫారుసుల ప్రకారం గానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఈ రాజ్యాంగబద్ధ ప్రక్రియకు మాయావతి స్వస్తి చెప్పి సొంత ఎజెండా ప్రకటించుకున్నారు. యూనియన్ కేబినెట్ బిల్లుకు సమ్మతించిన తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి, ఆ పిమ్మట రాష్ట్రపతి అదే బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి నివేదించిన దరిమిలా నిర్ణీత గడువులో తీర్మా నం రూపంలో తిరిగి సభ వారు పంపించాలి. అలాగే తీర్మానం ఉన్నా లేక పోయినా కూడా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు నివేదించవచ్చు. అప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం కాదు, పార్లమెంటు ఉభయ సభలు బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే - ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి అర్హమవుతుంది. ఈ క్రమానుగతమైన పద్ధతికి స్వస్తి చెప్పి, ‘లేడికి లేచిందే ప్రయాణ’మన్న చందంగా రాజ్యాంగ క్రమాన్ని అతిక్రమించి అసెంబ్లీకి విలువ లేకుండా చేసి పదినిమిషాల్లో రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చీల్చి ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటును ప్రకటించేశారావిడ.

ఐదేళ్లుగా మిగతా రాష్ట్రాల్లో మాదిరే ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి నాయ కత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణల మధ్య ఈదులాడుకుంటూ వస్తోంది. ‘తాజ్ కారిడార్’ నిర్మాణ కుంభకోణాల నుంచి నాయకురాలు ఇంకా బయటపడలేదు. చనిపోయిన తరువాత తమను మరచి పోతారనో లేదా తాము బతికి ఉండగానే వేడుక చూసుకోవాలన్న తపనతోనో కొందరు మన సమాజంలో చనిపోయిన తరువాత చేసే కర్మకాండను ముందు గానే ‘జీవకర్మ’ అని జరుపుకుంటారు. అలాగే ‘చైతన్యశీలి’గా పేరు పొందిన మాయావతి కూడా తాను సజీవంగా ఉన్న కాలంలోనే సుమారు వంద సొంత విగ్రహాలు నిర్మించడానికి అనుమతించిన కుంభకోణం కూడా బయటపడి సుప్రీంకోర్టు దాకా వ్యవహారం దేకింది. సొంత మంత్రులు, ఉన్నతాధికారులు కొందరు అవినీతి ఆరోపణల మధ్య జీవనం గడుపుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి కేంద్రం విడుదల చేసిన భారీ నిధుల్ని దుర్వినియోగం చేసి అవినీతిని తలకెత్తుకున్న అధికారులపై వచ్చిన ఆరోపణ లపైన విచారణ జరపాలని కేంద్రం పదే పదే కోరినా గత సంవత్సరన్నర కాలంగా మాయావతి కాలక్షేపం చేస్తూ వచ్చారే తప్ప ఇప్పటిదాకా విచారణకు ఆదేశించలేదు.

పైగా సీబీఐ విచారణకు ‘మాయ’ సమ్మతించలేదు. ఆమే స్వయంగా, అవి నీతికి బాధ్యులని ప్రకటించిన అధికారులపైన కూడా చర్యతీసుకోలేదు. వారిలో ఒకరు గోండా ప్రాంతం ప్రధాన ఉన్నతాధికారి రాజ్‌బహదూర్. ఈ రోజుకీ అతనిపైన కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదుకాలేదు. యూపీ సామాన్య ప్రజ లు, ముస్లిం మైనారిటీలు సహా రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తున్నారు. స్థానిక సం స్థల ఎన్నికలను వెంటనే జరపాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆదే శాన్నీ మాయావతి వాయిదావేస్తూ రావడం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బిఎస్‌పీ ఓటమిని చవిచూడబోతోందన్న సంకేతం కారణంగానే. కనుకనే మాయావతి రాష్ట్రాన్ని ముక్కలు చేయడంద్వారా ముంచుకొచ్చే ‘బ్యాలెట్’ ప్రమాదాన్ని నివారించేందుకు రాజకీయలబ్ధిని ఆశించి ఈ వ్యూహం పన్నారు.
‘చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం’ అని అంబేద్కర్ చెప్పారన్న ప్రచా రం అబద్ధం. ఆయన, అగ్రవర్ణాలకు ప్రాధాన్యం కల్పించే శాసన వేదికలలో దళిత, బడుగువర్గాలకు తగిన ప్రాతినిధ్యం, ప్రాధాన్యం లభించదేమోనన్న అనుమానంతో గతంలో చిన్నరాష్ట్రాల ఏర్పాటును అభిలషించారేగాని, చిన్న రాష్ట్రాల ఏర్పాటు పేరిట తిరిగి ధనిక, భూస్వామ్య వర్గాలకు చెందిన వారే అం దలమెక్కి పాత దోపిడీనే కొనసాగే పరిస్థితిని ఆయన కోరుకోలేదు.

అందుకే అంబేద్కర్ ఒక నికార్సయిన ప్రజాస్వామ్యవాదిగా, బహుజనుల సంక్షేమాన్ని అభిలషించినవాడుగా దోపిడీపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను, సామాజిక వ్యవ స్థనూ విమర్శిస్తూ వచ్చాడు. ‘ప్రజాస్వామ్యం అనేది సమాజంలోని అల్పసం ఖ్యాకుల అవసరాలకు, అభిప్రాయాలకు సానుకూలంగా స్పందించి తీరాల’ని స్పష్టం చేశాడు అంబేద్కర్. దేశ విభజనను వ్యతిరేకించిన అంబేద్కర్, దేశ నాయకుల మధ్య వచ్చిన విభేదాలు ఆసరాగా బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుల కుట్ర ఫలితంగా విభజన తప్పనప్పుడు అంబేద్కర్ ‘ఒక ప్రత్యేక జాతిగా ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని’ భావించాడే గానీ ఒకేభాష, ఒకే సంస్కృతి ప్రాతిపదికపై రాష్ట్రంగా ఏర్పడిన జాతిని చీల్చాలని ఎన్నడూ ప్రతిపా దించలేదు. ఆయన సిద్ధాంతంలోని కేంద్రీకరణ అంతా ఎంతసేపూ దళిత, బహుజన, బడుగు అసంఖ్యాక వర్గాల మౌలిక ప్రయోజనాలను రక్షించడం పైననే గానీ ప్రజల మధ్య విభజనను సృష్టించడం కాదని గమనించాలి! ఈ విషయాన్ని ఆయన 1947 మార్చిలో ‘రాష్ట్రాలు, మైనారిటీలు’ అన్న మెమొ రాండంలో స్పష్టం చేశాడు.

అందుకే రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందని చం కలు గుద్దుకుంటే లాభం లేదనీ, సామాజిక, ఆర్థిక జీవనంలో రాబోయే రోజుల్లో తీవ్రమైన అసమానతలు తలెత్తుతాయనీ, నిజజీవితంలోని ఈ వైరుధ్యాన్ని పెందలాడే తొలగిస్తే తప్ప భారతీయ సమాజం కష్టాలు ఎదుర్కోవలసి వస్తుం దనీ 62 ఏళ్లనాడే ముందస్తుగా హెచ్చరించాడు. ఈ దృష్టితోనే ఆయన సమాజం లోని అసంఖ్యాకులుగానూ, ప్రధాన ఉత్పత్తి శక్తులుగానూ ఉన్న దళిత, బడుగు వర్గాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే వారికి పాలనా పగ్గాలు అందా లంటే, దోపిడీ వ్యవస్థకు దూరంగా ఉండగల పాలనా వ్యవస్థను కోరుకున్నా డేగానీ, కేవలం చిన్న రాష్ట్రాల వల్లనే వారి అభ్యున్నతి స్థిరమవుతుందని ఎక్కడా చెప్పలేదు. నిజానికి పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో రాష్ట్రాలు చిన్నవైనా, పెద్దవైనా అభివృద్ధి ప్రజాబాహుళ్యానికి విధిగా అనుకూలంగా ఉంటుందన్న హామీగానీ, ఉండగలదన్న భరోసాగాని ఎవరూ ఇవ్వలేరు.

ఇందుకు ఉదాహరణ బీజేపీ హయాంలో చీలుబాటల మీద ఏర్పడిన ఉత్త రాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు. ‘అభివృద్ధి’ సాధించిందనుకున్న ఉత్తరా ఖండ్ సంపదంతా ఢిల్లీ, ముంబైల పాలవుతోందనీ, ఫలితంగా ఆ చిన్న రాష్ట్రం లోని భిన్న ప్రాంతాల మధ్య అసమానతలు తీవ్రమవుతున్నాయనీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్ జనాభాలో నూటికి 63 మంది కటిక దారిద్య్రం లో ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు ఛత్తీస్‌గఢ్‌లో కటిక దారిద్య్రం లో ఉన్న జనాభా సంఖ్య 20 లక్షలుండగా, అది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో 32 లక్షలకు పెరిగిపోయింది. ఇదే పరిస్థితి తరతమ భేదాలతో జార్ఖం డ్‌లోనూ ఉంది. ప్రజాహితమైన సంస్కరణల ద్వారా మాత్రమే ప్రగతి ఫలాలు ప్రజాబాహుళ్యం అనుభవంలోకి వస్తాయి. ఇందుకు ముందు అంబేద్కర్ చెప్పి నట్లుగా ‘‘ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. ఏకతాటిపైకి తేవాలి. ఆందోళన చేపట్టాలి’’. 
________________________________________________________________________

రేపే ధర్మరక్షణ శంఖారావం

హైదరాబాద్, నవంబర్ 29 : హిందూ ధ ర్మం పరిరక్షణ, ఆచరణ ఆవశ్యకతను చాటి చెప్పడానికి డిసెంబర్ ఒకటో తేదీన ధర్మరక్షణ శంఖారావం నిర్వహించనున్నట్లు సర్వార్ధ సంక్షేమ సమితి అధ్యక్షుడు పి.వి.మనోహర్‌రావు తెలిపారు. ఇక్కడి లలితకళాతోరణంలో జరిగే శంఖారావసభలో పరిపూర్ణానందస్వామి ఆధ్వర్యంలో పీఠాధిపతులు మదనానంద సర్వసతి స్వామి, దక్షిణామూర్తి, సచ్చిదానందస్వామి, కమలాకర స్వామి, సద్గురు శివానందమూర్తి, వాత్సల్యానంద స్వామి పాల్గొంటారని చెప్పారు.

దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి రమణాచారి, తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం, దేవాదాయశాఖ కమిషనర్ బలరామయ్య, వేలాది మంది భక్తులు, భజనమండళ్ల కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. కాగా, నేటితరం యువతీ యువకుల్లో భారతీయ సంస్కృతి, భారతీయతత్వం ఆధ్యాత్మిక ధోరణులపై ఆసక్తి కలిగించేందుకు లక్ష మందితో త్వరలో ధార్మిక సభ నిర్వహిస్తామని పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ప్రకటించారు.
__________________________________________________________________

చర్చను అడ్డుకోవడమే ప్రజాస్వామ్యమా!
naresh , December 1 , 2011
 
కాలం గడుస్తున్నకొద్దీ అనుభవం రాటుదేలి పని విధానంలో పరిపక్వత పెరుగుతుందని ప్రజలు ఆశిస్తారు. కానీ, మన దేశంలో చట్టసభల తీరుతెన్నులు గమనిస్తుంటే, రోజులు గడుస్తున్నకొద్దీ వాటి పనితీరు మరింత అధ్వానంగా మారడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమై ఆరు దశాబ్దాలు దాటిందన్నది గమనార్హం. వారం రోజుల క్రితం ప్రారంభమై నడుస్తున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల తీరుతెన్నులను గమనిస్తుంటే, మనది ప్రజాస్వామ్య దేశమేనా? అన్న సందేహం కలుగక మానదు. అధిక ధరలు, గిట్టుబాటు ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, తీవ్రవాదం, ‘ప్రత్యేక’ రాష్ట్రాల ఏర్పాటు వంటి తీవ్ర సమస్యలు ప్రజల దైనందిన జీవనాన్ని అతలాకుతలం చేస్తుంటే, ఇందులో ఏ ఒక్క అంశం మీద కూడా పట్టుమని గంట పాటు కూడా చర్చ జరగలేదంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు.

అధికారంలో ఉన్న పార్టీలను ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు చట్టసభలే వేదికలుగా ‘అల్లరి’ పెట్టడం అన్న ఏకైక ఎజెండా తప్ప, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించి, పరిష్కార మార్గాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు బాటలేయాలన్న కనీస అవగాహన, చిత్తశుద్ధి ఒక్క పార్టీలోనూ కనిపించకపోవడం విచారకరం. సభ నిర్వహణకు ఎంత ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నారో తెలుసుకుంటే సామాన్యులు స్పృహతప్పి పడిపోక తప్పదు. గౌరవ సభ్యుల జీతభత్యాలు కాకుండా, సభ నిర్వహణకు రోజుకు రెండు కోట్ల రూపాయలు దాటుతుందంటే నమ్మశక్యం కాదు. అన్నిటినీ మించి, ప్రజాప్రతినిధులుగా దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ పార్లమెంటేరియన్‌లు కూడా సభలో ‘విజ్ఞత’ మరచి ప్రవర్తించడం దురదృష్టకరం. అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించి పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగి, ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని మనవి.

-జీవీ రత్నాకరరావు హన్మకొండ, వరంగల్ జిల్లా

డ్రైనేజీల ఆక్రమణ ప్రమాదకరం!

రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లోనూ, పట్టణాల్లోనూ గృహ యజమానులు పరిసరాల్లోని డ్రైనేజీలను ఆక్రమించి, తమ కట్టడాలను విస్తరించడంతో మురుగు నీటి సమస్యలు తెలెత్తి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంకొందరు, వారి ఇళ్ల ముందున్న మురుగు కాల్వలపై ఇష్టమొచ్చిన రీతిలో ఇంటి మెట్లను నిర్మించడం పరిపాటిగా మారింది. దీంతో కాల్వలు పూడిపోయి మురుగు నీరు రోడ్ల మీద ప్రవహిస్తోంది. పారిశుధ్యం పని వారు కాల్వలు శుభ్రం చేయడం కూడా ఇబ్బందిగా మారుతోంది. రోడ్ల మీద మురుగు నీటి గుం టలు ఏర్పడటంతో దోమలు, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరీ నరకంగా మారుతోంది. చిన్నచిన్న వర్షాలకే వీధులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు ప్రవేశించి కోట్లాది రూపాయల ఆస్తి నష్టాన్ని కలిగిస్తోంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత మునిసిపాలిటీల అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా డ్రైనేజీలను కాపాడటానికి కఠినమైన నిబంధనలను రూపొందించి అమలు చేయాలని విజ్ఞప్తి.

-గోపాలుని శ్రీరామమూర్తి వినుకొండ, గుంటూరు జిల్లా
Posted at 12:33:19 AM 0 comments
‘ఆకాశవాణి’ సేవలను గుర్తించాలి!
naresh , November 30 , 2011
 
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతీయస్థాయి ప్రసారమాధ్యమంగా ఆకాశవాణి ఎనలేని ప్రాముఖాన్ని, గుర్తింపును పొందిం ది. అత్యవసర సమయాల్లోనూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ‘రేడియో’ రూపంలో ఆకాశవాణి ప్రసారాలు సామాన్య ప్రజలకు సదా అందుబాటులో ఉండటం నేటికీ చెక్కుచెదరలేదన్నది అతిశయోక్తి కాదు. అభివృద్ధి ఆకాశాన్నంటుతోందని అట్టహాసంగా ప్రకటించుకుంటున్న రోజుల్లో కూడా కరెంటు సమస్య ప్రజలను పట్టి పీడిస్తుండటంతో టీవీ చానళ్లు ఎంత విస్తృతంగా అందుబాటులోకి వచ్చినా, వాటి ద్వారా అత్యవసర వార్తలు గానీ, సమాచారం గానీ తెలుసుకునే అవకాశాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో లేవనే చెప్పాలి. మారుమూల గిరిజన ప్రాంతాలతో సహా దేశంలో ఎక్కడైనా కరెంటు, సెల్ టవర్లు లేకపోవడం వంటి సమస్యలతో నిమిత్తం లేకుండా అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే రేడియో ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ప్రసారమాధ్యమం ఆకాశవాణి అన్నది వాస్తవం. మార్కోనీ కనుగొన్న రేడియో ప్రసారాలు, భారతదేశంలో 1927లో ప్రారంభమై, 1930లో ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్‌గానూ, 1936లో ఆల్ ఇండియా రేడియోగానూ, 1957లో ఆకాశవాణిగానూ ప్రసిద్ధిచెంది, అంచలంచెలుగా దాని ప్రస్థానం కొనసాగుతోంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకాశవాణి న్యాయం చేసినంతగా మరే సంస్థా చేయడంలేదన్నది వాస్తవం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఆకాశవాణి అభివృద్ధి పట్ల అలక్ష్యం వహించడం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. కావున, రేడియో రూపకర్త మార్కోనీ పుట్టిన 1874 ఏప్రిల్ 25ను ‘రేడియో శ్రోతల దినం’గా ప్రకటించి, ప్రతి సంవత్సరం జరిగేలా ప్రభుత్వం ఆదేశించి తగు న్యాయం చేయాలని మనవి.

-కూనపరెడ్డి రమేష్ బాబు జొన్నలవారి మోడి, కృష్ణా జిల్లా

‘పచ్చ’పార్టీ నేతల ‘అవినీతి’ ఫీట్లు!

తమదాకా వస్తే కానీ నొప్పి తెలియదన్న చందంగా మారింది ‘పచ్చ’పార్టీ అధినేతల పరిస్థితి. రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీలో బాధ్యతాయుత స్థానంలో కొనసాగుతూ, అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులనూ విస్మరించి వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై శంకరరావు సీబీఐ విచారణ జరపాలంటూ హైకోర్టుకు ఉత్తరం రాసినప్పుడు, ఏ ప్రజాస్వామ్య నీతిని అనుసరించి తెలుగు తమ్ముళ్లు తెగ నోరు పారేసుకున్నారో రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ప్రభుత్వంలో భాగస్వామి కాని, ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా వైఎస్ విజయమ్మ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా పాలించి ఆర్థికంగా ఎలా అధోగతి పాలు చేశాడో పూసగుచ్చినట్టు వివరిస్తూ హైకోర్టును సీబీఐ విచారణ కోరడం ‘కుట్ర’, ‘కుమ్మక్కు’ అంటూ ప్రజలను తప్పు దోవ పట్టించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని బీరాలు పలికిన చంద్రబాబు, విచారణ జరిగితే బండారం బయట పడుతుందన్న గుబులుతో మొసలి కన్నీళ్లు కారుస్తూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో రోజుకొక తీరున ప్రకటనలు గుప్పిస్తూ బరితెగించి వ్యవహరించడాన్ని చైతన్యవంతులైన తెలుగు ్రపజలు క్షమించరన్నది గుర్తెరిగి ప్రవర్తించడం విజ్ఞత అనిపించుకుంటుంది.

-దామరాజు శంకరం విజయనగరం
Posted at 2:03:41 AM 0 comments
వయోపరిమితి పెంచాలి!
naresh , November 29 , 2011
 
ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాల అమలు అనంతరం ప్రైవేటైజేషన్ ఊపందుకోవడంతో ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు కరువై నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎప్పుడోగానీ ఖాళీలు ఏర్పడేవి కాదు. వాటి భర్తీకి నోటిఫికేషన్ వెలువడే సరికి వేలాది మంది వయోపరిమితి దాటిపోవడంతో దిక్కుతోచని స్థితికి గురయ్యేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని సడలించి 44 సంవత్సరాలుగా పెంచి వేలాది మంది నిరుద్యోగులను ఆదుకున్నారు. లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను సీఎం ప్రతిరోజూ ఊరిస్తున్నారు. అయితే, గతంలో లాగా వయోపరిమితిని సడలించి నిరుద్యోగులకు న్యాయం చేయడం సబబుగా ఉంటుంది. గత మూడేళ్లుగా ఏ శాఖలోనూ ఉద్యోగాలు భర్తీకాలేదు. ఇప్పటికే ఆర్టీసీ, ఏపీపీఎస్సీ, రెవెన్యూ, అటవీ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లను సవరించి, రిజర్వేషన్ కేటగిరీలతో సహా వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలని మనవి.
-కొండ్ర శ్రీనివాస్ జగిత్యాల, క రీంనగర్ జిల్లా

విద్యార్థులను ఒత్తిడి చేయకండి!

‘ప్రత్యేక రాష్ట్ర’ ఉద్యమ ప్రభావంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఇటీవలి కాలం వరకూ ఉధృతంగా సాగిన ఉద్యమాలతో విద్యాసంస్థలు నిరవధికంగా మూతపడటం తెలి సిందే. విద్యా సంవత్సరం చివరి దశలో ఎదురైన ఈ అవాంతరంతో అనేక విద్యాలయాల్లో సిలబస్ పూర్తికాకపోవడం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. సిలబస్‌ను ఎలాగైనా పూర్తిచేయాలన్న తలంపుతో విద్యా సంస్థల యాజమాన్యాలు, అధికారులు ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఊహించని రీతిలో ఒత్తిడికి గురి చేస్తున్నారు. కావున విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు కల్పించుకుని, ఈ విద్యా సంవత్సరానికి సిలబస్‌ను కుదించి పరీక్షలు నిర్వహించాలి. అప్పుడు పిల్లలపై ఒత్తిడి తగ్గి, మంచి వాతావరణంలో పరీక్షలు రాయడానికి తోడ్పడుతుందని గమనించాలి.
-సి.విజయవంశీ కోరుకొల్లు, కృష్ణా జిల్లా

ఉపకార వేతనాలు ఇవ్వాలి!

రచ్చబండ, రాజీవ్ యువకిరణాలు అంటూ ముఖ్యమంత్రి చేస్తున్న హడావుడి పైకి చూడడానికి బాగానే ఉన్నా, సమస్యలను పరిష్కరించడంలో అది లేశమాత్రం కూడా కనిపించకపోవడం విచారకరం. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తూ రచ్చబండ కార్యక్రమాలను ఆర్భాటంగా నిర్వహించడం కన్నా, స్కాలర్‌షిప్‌లురాక లక్షలాది మంది విద్యార్థులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. రచ్చబండలో ప్రజలు సమర్పిస్తున్న విజ్ఞాపనలు పరిష్కారానికి నోచుకోకపోగా, అదే వేదికమీద నుంచి చెత్తబుట్ట పాలు కావడం ప్రత్యక్షంగా చూస్తున్నదే. ఇది ఎవరి లోపమన్నది ముఖ్యమంత్రి బాధ్యతతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా, విద్యార్థులకు మంజూరు చేయాల్సిన స్కాలర్‌షిప్‌లు వెంటనే మంజూరయ్యేలా తగు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి.
-కురువ శ్రీనివాసులు అంబర్‌పేట, హైదరాబాద్
Posted at 2:48:32 AM 0 comments
‘సామాజిక న్యాయ’ దార్శనికుడు ఫూలే!
naresh , November 27 , 2011
 
ఆర్థిక అసమానతలు, సాంఘిక బానిసత్వంతో శతాబ్దాలుగా కొట్టుమిట్టాడుతున్న భారతీయ సమాజం, ఒక జాతిగా మనుగడ సాగించలేదని విశ్లేషించిన తాత్వికుడు మహాత్మా జ్యోతిబా ఫూలే. బడుగు, బలహీన వర్గాలను ‘బహుజనులు’గా సం ఘటితం చేసిన సామాజిక దార్శినికుడాయన. ఆధునికయుగంలోనూ కొనసాగుతున్న కులాధిక్య కుళ్లును నిర్మూలించే ఉద్యమాలకు బీజం నాటిన జ్యోతిరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న సతారా గ్రామంలో ‘మాలి’ అనే శూద్రకులంలో పుట్టారు. 1840లో సావిత్రిబాయితో వివాహం. సమాజంలోని దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అణగారిన కులాలను చైతన్యవంతం గావించిన సామాజిక ప్రజాస్వామ్యవాది ఆయన. అగ్రవర్ణ, కుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ‘గులాంగిరి’ అన్న విశ్లేషణాత్మక గ్రంథాన్ని ప్రచురించారు. పేద ప్రజలకు విద్య, ఆంగ్లభాషల ఆవశ్యకతను, అక్షరజ్ఞానం ప్రాముఖ్యతను వివరించి, ఆసక్తిని రేకెత్తించారు. ‘ఇల్లాలి చదువు-ఇంటికి వెలుగు’ అన్న సామాజిక భావనతో 1848లో సావిత్రిబాయితో కలిసి బాలికలకు ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. 1873లో ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించారు. 1888లో సమాజంలోని పౌరుల నుంచి ‘మహాత్మా’ అన్న బిరుదును అందుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఫూలే 1890 నవంబర్ 28న తుదిశ్వాస విడిచారు. నేటికీ అసంపూర్తిగా మిగిలిపోయిన కుల నిర్మూలనా పోరాటానికి ఫూలే స్ఫూర్తి కావాలి.
-బట్టు వెంకయ్య తెనాలి, గుంటూరు జిల్లా
(నవంబర్ 28 ఫూలే 121వ వర్ధంతి)

రేపటి రక్షకులు ‘ఎన్‌సీసీ క్యాడెట్స్’!

ఒక గొలుసు బలము దాని మడతల శక్తిపై ఆధారపడి ఉంటుంది. అలాగే సమాజ ఉజ్వల భవిష్యత్తు, ఆ సమాజంలోని యువత దేహ దారుఢ్యంపైనా, మేధోపరమైన శక్తియుక్తులపైనా ఆధారపడి ఉంటుంది. రేపటి పౌరులైన విద్యార్థులు, యువకులను విజ్ఞానంతో కూడిన తేజోమూర్తులుగా తీర్చిదిద్దడంతోపాటు, దృఢమైన పౌరులుగా శిక్షణ నివ్వ డం సామాజిక బాధ్యత. అందుకే డాక ్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ‘‘దేశ ప్రయోజనాలను కాపాడగలిగిన క్రమశిక్షణ, దృఢచిత్తం కలిగిన యువతను తయారు చేయ డం మన బాధ్యత’’ అన్నారు. ఏకత్వం, క్రమశిక్షణ ప్రధాన లక్ష్యాలుగా భావితరాలను తీర్చిదిద్ద డానికి ‘నేషనల్ క్యాడెట్ కోర్ (లేదా) జాతీయ సైనిక శిక్షణా దళం-1948’ రూపొందింది. భారతదేశంపై 1962లో చైనా దాడి అనంతరం దేశంలోని యువకుల్లో సైనిక శిక్షణ పట్ల ఆసక్తిని పెంచడానికి ‘ఎన్‌సీసీ’ని ప్రతి కళాశాలలోనూ ప్రారంభించారు. ప్రతి ఏడాది నవంబర్ నెల చివరి ఆదివారాన్ని ‘ఎన్‌సీసీ’ శిక్షణకు సంబంధించిన ప్రాముఖ్యాన్ని వివరించే దినంగా పాటిస్తున్నారు. యువతలో పట్టుదలను, ధైర్యాన్ని, ఐక్యతను పెంచడానికి ఎన్‌సీసీ క్యాంపులు నిర్వహిస్తుంది. ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థులకు మరింత స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం.

-సయ్యద్ కలీమ్ అహ్మద్ రోజ్‌దార్ న్యాయవాది, కావలి, నెల్లూరు జిల్లా
(నేడు ఎన్‌సీసీ శిక్షణా దినం)
Posted at 2:01:45 AM 0 comments
‘చట్టం-న్యాయం’తోనే సమధర్మం!
siva , November 26 , 2011
 
‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్న మాటను మనం తరచూ వింటుంటాం. ‘చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదు’ అన్న హెచ్చరిక వంటి ఆదేశాన్ని ‘రాజ్యాంగం’ ప్రజ లకు సదా గుర్తుచేస్తూ ఉంటుంది. ఆ ఆదేశాన్ని ప్రతి ఒక్కరూ తూచ తప్పక పాటించేలా ‘న్యాయస్థానం’ అప్రమత్తతో పర్యవేక్షించడమే కాక, నిఘా నేత్రాలతో నిత్యం కాపలా కాస్తుంది. ‘చట్టం-న్యాయం’ ఎలాంటి అరమరికలు లేకుండా అవిభాజ్యంగా కొనసాగినప్పుడే ‘రాజ్యం’ సుభిక్షంగా విలసిల్లుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు పరిపూర్ణంగా వికసించడానికి అదొక అనుల్లంఘనీయమైన సూత్రంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగం విధిం చిన పరిధుల్లో ‘చట్టసభలు’ ప్రజల ఆకాంక్షలూ, అవసరాలకు అనుగుణంగా చట్టాలను రూ పొందించి అమలు చేస్తాయి.

న్యాయస్థానాలు వాటి మంచి చెడ్డలను బేరీజు వేసి ‘న్యాయం’ ప్రజలందరికీ సమంగా అందేలా సమధర్మం పాటిస్తాయి. ఆ మహత్తర బాధ్యతను బలంగా గుర్తు చేసుకోవాలన్న తలంపుతో, ప్రతి సంవత్సరం నవంబర్ 26ను ‘జాతీయ న్యాయ దినోత్సవం’ జరుపుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం రెండు దశాబ్దాల క్రితం నిర ్ణయిం చి ప్రకటించడం ముదావహం. స్వతంత్ర భారతదేశచరిత్రో ‘నవంబర్ 26’కు ఎనలేని ప్రాముఖ్యం ఉంది. భారతదేశం స్వాతంత్య్రం పొందిన అనంతరం రాజ్యాంగ రచనకు ఒక పూర్తిస్థాయి కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ముసాయిదా తొలి ప్రతిమీద 1949 నవంబర్ 26న రాజ్యాంగ కమిటీ సభ్యులు సంతకాలు చేశారు. 440కి పైగా ఆర్టికల్స్, 12 షెడ్యూళ్లు, 22 భాగాలతో కూడిన ‘భారత రాజ్యాంగం’ 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.

రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయడమే కాక, రాజ్యాంగ రక్షకురాలిగా న్యాయవ్యవస్థ వ్యవహరిస్తుంది గనుక, రాజ్యాంగ తొలి ప్రతులపై రాజ్యాంగ కమిటీ సభ్యులు సంతకం చేసి, రాజ్యాంగ ముసాయిదాను అధికారికంగా ఆమోదించిన నవంబర్ 26న న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం పరిపాటిగా మారింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా న్యాయవాదులు సమావేశమై ‘ప్రతిజ్ఞ’ చేయడం ఆనవాయితీ. చట్టం ముందు అందరూ సమానమని తెలియజేయడం, ప్రజలందరికీ సత్వర న్యాయం అందజేయడానికి కృషి చేయ డం న్యాయ దినోత్సవ ధ్యేయంకావడం దాని విశిష్టత. ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రజా వ్యతి రేకంగా ఉన్నా, రాజ్యాంగాన్ని అతిక్రమించేవిగా ఉన్నా, ఆ చట్టాలు చెల్లవని చెప్పే అధికారం రాజ్యాంగ బద్ధంగా రూపొందిన ధర్మాసనాలకు ఉంది.

విచారణా క్రమంలో సుప్రీంకోర్టు వెలువరించే తీర్పులను కూడా ఆచరణలో చట్టాలుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యవ్యవస్థలు అనుసరించడం ఆనవాయితీ. అలాంటి తీర్పును ప్రభుత్వం అమలు చేయడం సాధ్యం కాదని భావిస్తే, దానికి అనుగుణంగా పార్లమెంటు ద్వారా ఆమేరకు చట్టాన్ని రూపొందిం చాల్సి ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారతదేశం పేరుప్రఖ్యాతులు గడించడంలో ‘న్యాయవ్యవస్థ’ సాగిస్తున్న కృషి అనన్యసామాన్యమైనదన్నది అతిశయో క్తి కాదు. చట్టం-న్యాయం సమధర్మం పాటించినప్పుడే, ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించడం సాధ ్యమవుతుంది. ‘న్యాయ దినోత్సవం’ అందుకు స్ఫూర్తి కావాలని ఆశిద్దాం!

బారు ధనుంజయ న్యాయవాది, హైదరాబాద్
(నేడు జాతీయ న్యాయ దినోత్సవం)

No comments:

Post a Comment