Thursday, November 10, 2011

నేడు అరుదైన తేదీ (11-11-11)
100 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ సంఖ్య
తేదీ కోసం కొందరి ఎదురుచూపు... మరికొందరికి అపనమ్మకాలు

11-11-11. ఈ సంఖ్యను చూడగానే మీకు ఈపాటికే విషయం తెలిసిపోయి ఉంటుంది కదా! అదేనండీ...సంవత్సరం, నెల, తేదీ ఒకే సంఖ్యతో శుక్రవారం ప్రపంచాన్ని పలకరించనుంది. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ఇటువంటి తేదీని పాలిన్‌డ్రోమ్ అంటారు. సంఖ్యాశాస్త్ర రీత్యా కూడా ఇలా అన్నీ ఒకట్లు రావడం అత్యంత అరుదైన విషయంగా భావిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను కొందరు శుభసూచికంగా భావిస్తే మరికొందరు అరిష్టమని నమ్ముతున్నారు.

చైనాలో 3,200 జంటల పెళ్లిళ్లు: జీవితకాలంలో ఒకసారి మాత్రమే చూడగల ఈ తేదీన ఒక్కటి కావడం ఎంతో మంచిదని చైనీయులు విశ్వసిస్తున్నారు. అందుకే 11-11-11న పెళ్లిళ్లు చేసుకునేందుకు బీజింగ్‌లో 3,200కుపైగా జంటలు సిద్ధమయ్యాయి. కొందరేమో మరో అడుగు ముందుకేసి 11-11-11 ఉదయం 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లను పెళ్లి ఘడియలుగా నిర్ణయించుకున్నారు. మరోవైపు స్కాట్లాండ్‌లోనూ 50కిపైగా జంటలు శుక్రవారం ఒక్కటికానున్నాయి. స్కాట్లాండ్, ఇంగ్లండ్ సరిహద్దున ఉన్న గ్రెట్నా గ్రీన్ అనే పట్టణం ఇందుకు వేదికగా నిలవనుంది.

ఆరు ఒకట్లు శుక్రునికి సంకేతం: ఈ తేదీలోని అన్ని ఒకట్లను కలిపితే 6 అవుతుంది. ఈ సంఖ్య శుక్రునికి సంబంధించినదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పైగా ఈ రోజు శుక్రవారం కావడం... ఉదయం 6.57 గంటల వరకూ భరణీ నక్షత్రం ఉండటం...కూడా శుక్రునికి చెందినవేనంటున్నారు. అయితే ఈ తేదీ శుభకార్యాలకు పనికిరాదని పేర్కొంటున్నారు. కేవలం క్రయ విక్రయాలకు, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం పనికి వస్తుందంటున్నారు. అదృష్ట సంఖ్య 6 గల వారికి కలిసి వస్తుందని చెబుతున్నారు.

ప్రకృతి ప్రకోపిస్తుందని భయాలు: ఈ తేదీ ప్రపంచానికి కీడు చేకూరుస్తుందని కొందరు ప్రజలు ప్రత్యేకించి పశ్చిమ దేశాలవారు భయపడుతున్నారు. ప్రకృతి ప్రకోపిస్తుందేమోనని కలవరపడుతున్నారు. ఇందుకు ఉదాహరణలు చూపుతున్నారు. 11-11-1911న అంటే...సరిగ్గా 100 ఏళ్ల కిందట ఇటువంటి తేదీ రోజునే అమెరికాలో విపరీతమైన వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. గ్రేట్ బ్లూ నార్తర్‌గా పేర్కొన్న దీనివల్ల అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయని...ఉదయం 24 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత రాత్రికల్లా -12 డిగ్రీలకు పడిపోయిందని గుర్తుచేస్తున్నారు.

సినీ ప్రయోగాలు: అరుదైన ఈ తేదీపై అటు హాలీవుడ్ నుంచి మన బాలీవుడ్ వరకూ అప్పుడే సినిమాలు సిద్ధమయ్యాయి. బాలీవుడ్‌లో ‘ప్రాజెక్ట్ 11’ అనే షార్ట్ ఫిల్మ్ శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ఇందులోని కథాంశం, నటించిన వ్యక్తులు, దీన్ని తీసిన దర్శకులు, చిత్రీకరించిన ప్రాంతాలు అన్నీ కూడా 11 కావడం మరో విశేషం. కేవలం రూ. 9 లక్షల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని పూర్తిచేసినట్లు నిర్మాతల్లో ఒకరైన రంజన్‌సింగ్ తెలిపారు. మరోవైపు హాలీవుడ్‌లో ‘11-11-11’ పేరుతో శుక్రవారం సినిమా విడుదలవుతోంది. హీరో కుటుంబం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు రోడ్డు ప్రమాదంలో మరణించడం...అప్పటి నుంచి 11 సంఖ్య హీరోను వెంటాడటం అనేది ఈ చిత్ర కథాంశం.
 
*********************************************************************

వచ్చే వారమే ప్రకటన!
తెలంగాణపై సస్పెన్స్‌కు త్వరలో తెర
ఎస్సార్సీ తెలంగాణకు వర్తించదు

కేకేకు రషీద్ అల్వీ స్పష్టీకరణ!
శ్రీకృష్ణ 4,5,6 సిఫారసులపై దృష్టి
పరిష్కార మార్గాలపై మథనం
ప్రణబ్‌తో బొత్స, అహ్మద్ పటేల్ చర్చలు
స్వదేశానికి ప్రధాని రాక రేపు
ఆ వెంటనే తెలంగాణపై కదలిక
న్యూఢిల్లీ, నవంబర్ 10 : తెలంగాణ అంశం తుది అంకానికి చేరుకుంది. సస్పెన్స్‌కు ఇక తెరపడనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22న ప్రారంభమవుతున్నందున.. అంతకంటే ముందే తెలంగాణ అంశాన్ని తేల్చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ప్రత్యేక రాష్ట్ర అంశంపై ఢిల్లీలో వచ్చే వారం అత్యంత కీలకమైన ప్రకటన ఒకటి వెలువడే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా.. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్సీకి నివేదించే ఉద్దేశం కేంద్రానికి లేదని, కేవలం ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రమే అది వర్తిస్తుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన 4, 5, 6 సిఫారసుల ఆధారంగా.. తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రెండు ప్రాంతాలకూ వేర్వేరు రాజధానులను ప్రకటించడమా? లేక హైదరాబాద్‌ను ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిగా నిర్ణయించి.. ఆ తరువాత సీమాంధ్రకు వేరే రాజధానిని ప్రకటించడమా? అన్న రెండు మార్గాలే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు స్పష్టత వస్తుంది: బొత్స
మాల్దీవుల్లో జరుగుతున్న సార్క్ సమావేశాలకు వెళ్లిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వదేశానికి శనివారం తిరిగి రానున్నారు. ఆయన రాగానే తెలంగాణపై కదలికలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందే తెలంగాణపై తేల్చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉన్నదని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.

కాగా.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం మధ్యాహ్నం రెండోసారి కీలక సమాలోచనలు జరిపారు. బుధవారం రాత్రి కూడా ప్రణబ్‌తో బొత్స చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తెలంగాణ అంశంపై ప్రధానంగా వీరి మధ్య చర్చలు కేంద్రీకృతమైనప్పటికీ.. ఏ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నదీ ప్రణబ్ విస్పష్టంగా సూచించలేదని తెలిసింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో తాను శుక్రవారం చర్చలు జరిపిన తర్వాత స్పష్టత ఏర్పడుతుందని బొత్స చెప్పారు.

కేకేతో బొత్స మంతనాలు
తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్సీకి నివేదించే ఉద్దేశం కేంద్రానికి లేదని, కేవలం ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రమే అది వర్తిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. యూపీని దృష్టిలో పెట్టకొని మాత్రమే తాను రెండో ఎస్సార్సీ అంశాన్ని ప్రస్తావించానని.. తెలంగాణకు కూడా అది వర్తిస్తుందని చెప్పలేదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె.కేశవరావుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ చెప్పినట్లు తెలిసింది. కేశవరావు గురువారం సాయంత్రం ప్రణబ్ ముఖర్జీని కూడా కలిశారు. ప్రణబ్‌ను కలిసే ముందు కేకేతో బొత్స మంతనాలు జరపడం గమనార్హం.

శ్రీకృష్ణ కమిటీ సిఫారసులపై దృష్టి
శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన 4, 5, 6 సిఫారసుల ఆధారంగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలిసింది. హైదరాబాద్ భోగౌళిక పరిధులను విస్తరించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని, తెలంగాణ, సీమాంధ్రలు ప్రత్యేక రాజధానులను ఏర్పాటు చేసుకోవాలని శ్రీకృష్ణ కమిటీ 4వ సిఫారసు పేర్కొంటోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే.. మూడు ప్రాంతాలకూ దాన్ని భౌగోళికంగా చేరువగా మార్చాలని ఈ సిఫారసులో కమిటీ పేర్కొంది.

కాగా.. హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచి, సీమాంధ్రకు వేరే రాజధానిని ప్రకటించాలన్నది శ్రీకృష్ణ కమిటీ 5వ సిఫారసు. దీని ప్రకారం కొత్త రాజధాని ఏర్పరచే వరకూ సీమాంధ్ర రాజధాని హైదరాబాద్‌లోనే కొనసాగాలి. అయితే దీనివల్ల తీవ్ర పర్యవసానాలుంటాయని కమిటీ హెచ్చరించింది. ఇక.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే తెలంగాణకు చట్టబద్ధమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలన్నది శ్రీకృష్ణ కమిటీ అన్నిటికన్నా అత్యుత్తమ మార్గంగా సూచించిన 6వ సిఫారసు.

ప్రాంతీయ మండలికి కోర్ కమిటీ విముఖం!
ఈ మూడు సిఫారసుల ఆధారంగానే కేంద్రం ప్రధానంగా నిర్ణయం తీసుకోబోతున్నదని కేంద్ర హోంశాఖ వర్గాలు చెప్పాయి. అయితే.. శ్రీకృష్ణ కమిటీ అత్యుత్తమ మార్గంగా సూచించిన ప్రాంతీయ మండలి పరిష్కారం కాదని, దీని వల్ల సమస్య తీవ్రత తగ్గే అవకాశాలు లేకపోగా, కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం కలుగుతుందని కోర్‌కమిటీలో పలువురు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. "రాజకీయంగా కలిగే లాభనష్టాలను దృష్టిలో పెట్టుకోకుం డా శ్రీకృష్ణ కమిటీ సిఫారసులు చేసింది.

కానీ.. రాజకీయ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ భిన్న దృక్పథంతో ఆలోచించాల్సి ఉంటుంది'' అని కోర్ కమిటీ సభ్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌ను విస్తరించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రెండు ప్రాంతాలకూ వేర్వేరు రాజధానులను ప్రకటించడమా? లేక, హైదరాబాద్‌ను ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిగా నిర్ణయించి, సీమాంధ్రకు తరువాత వేరే రాజధానిని ప్రకటించడమా? అన్న రెండు మార్గాలే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌తో కోర్ కమిటీ సభ్యుడి మంతనాలు!
ఈ విషయంపై కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడొకరు కేసీఆర్‌తో మాట్లాడినప్పుడు.. హైదరాబాద్ విషయంలో ఎలాంటి రాజీకి అంగీకరించబోమని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ నిర్ణయానికి వస్తుందనేది స్పష్టంగా తెలియడం లేదు. శీతాకాల సమావేశాల లోపు హోంమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పరచి చర్చించే అవకాశం కూడా లేకపోలేదని అధికార వర్గాలు చెప్పాయి. ప్రస్తుతానికి.. హోంమంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం తెలంగాణ అంశంపై తీసుకోవాల్సిన నిర్ణయం గురించి విస్త­ృత చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 
__________________________________________________________________________________
సో‘మంచి’ సాహిత్య ‘యజ్ఞం’!
ఆయన గురజాడ అడుగుజాడల్లో నడిచిన అభ్యుదయ రచయిత. అబ్బూరి మేస్టారి మార్గదర్శకత్వంలో ముందడుగు వేసిన నాటక రచయిత. గంభీరమయిన సామాజిక సమస్యలనునవ్వు పుట్టించేలా రంగస్థలంపైన ఆవిష్కరించిన గొప్ప శిల్పి. ఆయనే సోమంచి యజ్ఞన్న శాస్త్రి. జాన్ గాల్స్‌వర్దీ, మారిస్ మేటర్‌లింక్, నికలాయ్ గగోల్, జార్జ్ బెర్నాడ్ షా తదితర మహామహుల నాటకాలను అర్ధ శతాబ్దం కిందటే అనువదించి, మనకందించిన ఇంత గొప్ప రచయితకు రావలసినంత పేరు వచ్చిందో లేదో ప్రతి తెలుగువాడూ వేసుకోవలసిన ప్రశ్న!

ఆధునిక తెలుగు సాహిత్య ‘చరిత్ర’కారులు కన్వీనియెంట్‌గా మర్చిపోయిన ఒక రచయిత సోమంచి యజ్ఞన్న శాస్త్రి. కథలూ, నాటికలూ, నాటకాలూ రాసిన ఈ తొలితరం అభ్యుదయ రచయిత, దశాబ్దాల తరబడి బొంబాయి (నేటి ముంబై)లో -ఉద్యోగరీత్యా- ఉండిపోవడం ఈ ఉపేక్షకు ఒక కారణం కావచ్చు. అంతకు మించి, యజ్ఞన్న శాస్త్రికి ప్రమోటర్లు ఎవరూ లేకపోవడం పెద్దకారణమనిపిస్తుంది.

సరదాగా...

1936లో లక్నోలో అభ్యుదయ రచయితల సంఘం మహాసభలు జరిగాయి. ఆ సభలకు తెలుగువాళ్లు ఇద్దరే ప్రతినిధులుగా వెళ్లారు. వారిలో అబ్బూరి రామకృష్ణరావు గారు ఒకరయితే, యజ్ఞన్న శాస్త్రి రెండవవారు. సుప్రసిద్ధ రచయిత ప్రేమ్‌చంద్ అధ్యక్షత వహించిన ఈ సభలకు -అప్పట్లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ చరిత్ర శాఖలో అధ్యాపకునిగా పనిచేస్తూన్న- హిరేన్ ముఖర్జీకూడా ఒక ప్రతినిధిగా హాజరయ్యారు. లక్నో అనుభవాల ఆధారంగా యజ్ఞన్న శాస్త్రి హాస్యస్పోరకమయిన ‘స్కెచ్’ కూడా రాశారు. ఉత్తర దక్షిణ భారతదేశాల ప్రజల ఆహారపు అలవాట్లలోని భిన్నత్వాన్ని ఆధారంగా చేసుకుని సరదాగా రాసిన రచనిది.

సీరియస్ హాస్యం

యజ్ఞన్న శాస్త్రి రచనలన్నింట్లోనూ హాస్యరసం చిప్పిల్లుతూనే ఉంటుంది. అయితే, అవన్నీ చాలా సీరియస్ రచనలే కావడం విశేషం. యజ్ఞన్న శాస్త్రి రచనల్లో ఎక్కువ ప్రాచుర్యానికి నోచుకున్నవి అనుసృజనలే. అయితే, అవన్నీ ప్రపంచ సాహిత్యంలో మేలుబంతులనిపించుకున్న నాటకాలే. అదీ ఆయన అభిరుచి! దానికి తగిన రచనా శైలిని అలవర్చుకోవడంలో శాస్త్రిగారు సఫలీకృతులయ్యారు. అవన్నీ ప్రదర్శనయోగ్యంగా ఉండడం ఓ విశేషమయితే, ప్రేక్షకజనసామాన్యం ఆదరణకు నోచుకోవడం మరింత విశేషం. ఈ రెండో ఫలితం సాధించడానికి ప్రధానంగా ఉపయోగపడింది యజ్ఞన్న శాస్త్రి రచనా శైలిలోని హాస్యరసమే! సీరియస్ సాహిత్యం కళాత్మకతతో కళకళ్లాడుతూ ఉండితీరాలని గురజాడ ‘కన్యాశుల్కం’ అందించిన సందేశాన్ని గ్రహించిన అభ్యుదయ రచయితల్లో యజ్ఞన్న శాస్త్రి ముఖ్యులు.

మూలకథకు ‘న్యాయం’

ప్రపంచ ప్రసిద్ధ ఇంగ్లిష్ నవలాకారుడూ, నాటకకర్తా జాన్ గాల్స్‌వర్దీ 1910లో ‘జస్టిస్’ అనే నాలుగంకాల నాటకాన్ని రాశారు. దాని తొలి ప్రదర్శనకు విన్‌స్టన్ చర్చిల్ హాజరయ్యారంటారు. ఈ నాటకాన్ని మారిస్ ఎల్వీ 1917లో సినిమాగా తీశాడు కూడా. ఖైదీల జీవన స్థితిగతులు ఇతివృత్తంగా రాసిన నాటకమిది. కారాగార సంస్కరణల చరిత్రలో ఈ నాటకానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. జస్టిస్ నాటకాన్ని యజ్ఞన్న శాస్త్రి ‘న్యాయం’ పేరిట 1955లో అనుసృజించారు. ఛాయానుసరణలకు చక్కని గ్రామర్‌ను నిర్దేశించింది ఈ రచన. (అయితే, ఈ గ్రామర్‌ను ఎందరు పాటించారన్నది వేరే చర్చ!)

లోక ‘కల్యాణి’

మరుసటి సంవత్సరమే ఆయన సుప్రసిద్ధ బెల్జియన్-ఫ్రెంచ్ రచయిత మారిస్ మేటర్‌లింక్ 1902లో రాసిన ‘మోనా వానా’ అనే మూడంకాల నాటకాన్ని ‘కల్యాణి’ పేరుతో అనుసృజించారు. ప్రస్తుతం ఇటలీలో భాగంగా ఉన్న పీసా, ఫ్లారెన్స్ ఒకప్పుడు వేరువేరు స్వతంత్ర నగరరాజ్యాలు. వాటిమధ్య యుద్ధం చెలరేగిన తరుణంలో మోనా వానా అనే కులీన స్త్రీ -తన నగరవాసుల ప్రాణాలను కాపాడే నిమిత్తం- శత్రుశిబిరంలోకి ఒంటరిగా వెళ్తుంది. ఆమె భర్తా, మామగారూ దగ్గిరుండి వానాను ఫ్లారెన్స్ సైనిక డేరాల్లోకి పంపిస్తారు. అక్కడ ఆమెకు చిన్ననాటి సఖుడు ప్రింజివలే ఎదురవుతాడు. అతగాడే, ఫ్లారెన్స్ దళపతి! అతని సౌశీల్యానికి ఆశ్చర్యపోతుంది వానా.

తనతోపాటుగా అతన్ని పీసా నగరానికి తీసుకువస్తుంది. అయితే, భర్తా-మామా స్పందించిన తీరుకు మండిపడి సొంతగొంతు విప్పుతుంది. అక్షరాలా స్వతంత్ర స్త్రీ వానా. అలాంటి బలమయిన వ్యక్తిత్వం గల పాత్ర చుట్టూ అల్లిన కథను ఎంపికచేసుకోవడం యజ్ఞన్న శాస్త్రి సంస్కారంలోని విశిష్టత.

మహానుభావుడు గగోల్!

ఆధునిక రష్యన్ కథా సాహిత్యానికి ఆదిపురుషుడయిన నికలాయ్ గగోల్ -1836లో-రాసిన ‘రెవిజోర్’ అనే నాటకం ‘ద ఇన్‌స్పెక్టర్ జెనరల్’ పేరిట మన దేశంలో ప్రసిద్ధం. అలెక్సాంద్ పూష్కిన్ గగోల్‌కు వివరించిన ఒక (అప)హాస్యభరితమయిన సన్నివేశం ఈ రచనకు మూలం. జారుల కాలంలో రష్యన్ కులీనుల్లో పెచ్చరిల్లిన స్వార్థబుద్ధీ, మౌఢ్యం, రాజకీయపరమయిన అవినీతీ, అక్రమాలను అవహేళన చెయ్యడంకోసమే గగోల్ ఈ నాటకం రాశాడు. రష్యన్ సాహిత్య చరిత్రను ఓ మలుపు తిప్పిన రచన ఇది.

మూల రచన వెలువడి 120 సంవత్సరాలయిన తర్వాత -1957లో-దీన్ని ఛాయామాత్రంగా అనుసరిస్తూ యజ్ఞన్న శాస్త్రి ‘మహానుభావులు’ అనే నాటకం రాశారు. ఈ నాటకం తొలిప్రదర్శనలో డి.వి.నరసరాజు కథానాయకుడి పాత్ర పోషించారట. డాన్ యువాన్ కథ ఆధారంగా బెర్నాడ్ షా రాసిన నాటకం ‘మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్’ నాటకాన్ని కూడా యజ్ఞన్న శాస్త్రి ‘విశ్వం పెళ్లి’ పేరిట అదే సంవత్సరం అనుసృజించారు. కల్పనా చమత్కృతిలో షా కన్నా శాస్త్రిగారే పెద్ద చెయ్యని ఈ నాటకం చూస్తే అనిపిస్తుంది.

జాన్ గాల్స్‌వర్దీ, మారిస్ మేటర్‌లింక్, నికలాయ్ గగోల్, జార్జ్ బెర్నాడ్ షా తదితరుల నాటకాలను అర్ధ శతాబ్దం కిందటే అనువదించి, మనకందించిన ఇంత గొప్ప రచయితకు రావలసినంత పేరు వచ్చిందో లేదో ప్రతి తెలుగువాడూ వేసుకోవలసిన ప్రశ్న! సోమంచి యజ్ఞన్న శాస్త్రి రచనలు పెద్ద లైబ్రరీల్లోనూ, అరుదయిన పుస్తకాల కలెక్టర్ల దగ్గిర దొరకవచ్చు.

- పాఠక్
*******************************************************************************

No comments:

Post a Comment