Monday, November 28, 2011

జీవం కోల్పోతున్న గోదావరి

భద్రాచలం టౌన్, నవంబర్ 28 : గోదావరికి ఎగువ ప్రాంతం నుంచి ఆశించినంత స్థాయిలో వరద నీరు రాకపోవడంతో గోదావరి గొంతెండుతోందని నీటి పారుదల రంగ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు గోదావరి పరిధిలో నీటి వినియోగం కూడా గతేడాది కంటే పెరిగిందంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే వేసవిలో కష్టాలు తప్పవన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోదావారి పరివాహక ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు దాహార్తిని తీర్చుకునేందుకు శ్రమించక తప్పదనే హెచ్చరికలు వెలువడుతున్నాయి.

వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందుగానే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జీవనది అయిన గోదావరి ప్రస్తుతం వాగును తలపిస్తోంది. పిల్ల కాలువల్లా పారుతూ మధ్యలో ఇసుక తిన్నెలు దర్శనమిస్తుండటంతో గోదావరి తన సహజ స్వరూపాన్ని కోల్పోయి నిర్జీవంగా కన్పిస్తుండటం పట్ల యాత్రికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

1976 నుంచి ఇదీ.. పరిస్థితి
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం విషయంలో 1976వ సంవత్సరం నుంచి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా 1976 నుంచి ఇప్పటి వరకు కేవలం 11 సార్లు మాత్రమే గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహించింది. అలాగే 1986 ఆగస్టు 16న ఇప్పటి వరకు అత్యధికంగా 75.6 అడుగుల నీటిమట్టాన్ని నమోదు చేసింది. అయితే కొన్నేళ్లుగా గోదావరి నీటి వినియో గం గణనీయంగా పెరగడం నీటి మట్టం పడిపోవడానికి ప్రధాన కారణం. అయితే ఇప్పటి దాకా నీటిని వినియోగిస్తున్న ఐటీసీ పీఎస్‌పీడీ, హెవీవాటర్‌ప్లాంట్, సింగరేణి సంస్థలు గతేడాది నుంచి విద్యుత్ ఉత్పాదన కోసం బూర్గంపాడు నుంచి గోదావరి జలాలను పాల్వంచలోని కేటీపీఎస్‌కు తరలిస్తున్నారు.

కనిష్ట స్థాయికి పడిపోయిన నీటిమట్టం
గోదావరి నీటిమట్టం ఇప్పటికే కనిష్టస్థాయికి పడిపోయింది. ఆగస్టులో 43.3 అడుగులున్న గోదావరి నీటిమట్టంలో మూడు రోజుల క్రితం 7.5 అడుగులు తగ్గి 35.8 అడుగులకు చేరింది. గతేడాది ఇదే రోజున 10.7 అడుగులు గోదావరి నీటి మట్టం ఉండగా 2009లో ఇదే రోజున 10.5 అడుగుల నీటిమట్టం ఉంది. దీనికి ప్రధాన కారణం గతంలో కంటే ఈ ఏడాది వర్షాలు భారీగా లేకపోవడం, వరదల తీ వ్రత కూడా లేకపోవడమే కారణమని అధికారులు అంటున్నారు.

గతేడాది మూడుసార్లు గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటి.. ఆప్రవాహం సుమారు 45 రోజుల పాటు మొదటి ప్రమాద హెచ్చరిక సమీపంలో ఉంది. దీంతో భూగర్భ జలాలు భారీస్థాయిలో పెరిగాయి. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల భూగర్భజలాలు భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే వేసవి నాటికి సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

కనీస అవగాహన కరువు..
నీటిని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై ప్రజల్లో కనీస అవగాహన లేకపోవడం కూడా గోదావరి నీటిమట్టాలు గణనీయం గా పడిపోవడానికి కారణమని నీటిపారుదల ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. ఇసుక తవ్వకాలు నిర్ణీత పరిధిని దాటి జరుగుతుండటం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయంటున్నారు.

మరో వైపు గతంలో దట్టమైన అటవీ ప్రాంతాల వల్ల వర్షాలు పడటం, కొండల నుంచి, వాగుల నుంచి నిరంతరం నీటి ప్రవాహం గోదావరిలో కలిసేదని ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదని వాపోయారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, అధికారులు ప్రజలకు నీటి వినియోగం పై అవగాహన కల్పించకపోతే మంచినీటి కొరత తీవ్రమయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
_______________________________________________________________________
అమెరికా- పాక్‌ లడాయి!
శనివారం నాటి నాటో దాడులలో 24 మంది అమెరికన్‌ సైనికుల దుర్మరణం ఘటన అమెరికాకు దూరమై ఇటు అఫ్ఘాన్‌లోని ఉగ్రవాదులకు అటు చైనాకు చేరువ కావడానికి పాకిస్థాన్‌కు ఒక చక్కని రాజమార్గంగా ఉపయోగపడగల అవకాశాలున్నాయి. అఫ్ఘాన్‌లో శాంతి ప్రక్రియకు అమెరికాతో తామింక ఎంత మాత్రమూ సహకరించేది లేదని పాక్‌ ప్రధాని గిలానీ తాజాగా చేసిన ప్రకటనను గమనిస్తే వాషింగ్‌టన్‌, ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగానైనా తీవ్రంగా బెడిసికొట్టే వైపు పరుగులు తీస్తున్నాయని బోధ పడుతున్నది. అమెరికా ప్రపంచమంతటినీ తన క్రీడా స్థలంగా భావించి అన్య దేశాల సరిహద్దులు, సార్వభౌవూధికారాల పట్ల బొత్తిగా గౌరవం ప్రదర్శించకుండా వ్యవహరిస్తున్న తీరు పాక్‌ వంటి అత్యంత విధేయ దేశాన్ని కూడా దానికి దూరం చేస్తున్న దృశ్యాన్ని కళ్ళకు కడుతున్నది.

అఫ్ఘానిస్థాన్‌ సరిహద్దులలోని పాక్‌ సైనిక స్థావరాలపై నాటో దాడుల్లో 24 మంది పాకిస్థానీ సైనికుల దుర్మరణం గురు శిష్యులను తలపించే వాషింగ్‌టన్‌- ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలను మరింత క్షీణ దశకు చేర్చింది. ఇటీవలి కాలంలో అమెరికా- పాక్‌ల మధ్య పరస్పర అనుమానాలను పెంచిన పలు సంఘటనలు సంభవించాయి. గత జనవరిలో రేమండ్‌ డేవిస్‌ అనే ఒక సిఐఎ అధికారిని పాక్‌లో అరెస్టు చేసిన ఘటన రెండు దేశాల మధ్య సంబంధాలలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించింది. గత మే నెలలో పాకిస్థాన్‌కు చెప్పకుండానే దాని భూభాగమైన యాబొటాబాద్‌లోని బిన్‌ లాడెన్‌ స్థావరంపై అమెరికన్లు దండెత్తి అతడిని హతమార్చడం రెండు దేశాల మధ్య అఖాతం మరింత పెరగడానికి దోహదం చేసింది.

ఇప్పుడీ దాడిలో 24 మంది పాక్‌ సైనికులు నేలకు ఒరగడం సహజంగానే అమెరికాతో స్నేహంపై పాక్‌లో తీవ్రపునరాలోచనకు పురికొల్పుతుంది. ఈ దాడి జరిగిన వెంటనే తమ భూభాగంలోని వైమానికదళ స్థావరాన్ని ఖాళీచేయవలసిందిగా పాకిస్థాన్‌ ప్రభుత్వ, సై నిక పెద్దలు అమెరికానుకోరారు.అలాగే అఫ్ఘానిస్థాన్‌లోని నాటో దళాలకు కరా చీ నుంచి వెడుతున్న సరఫరాల నిలిపివేతకు పాకిస్థాన్‌ నిర్ణయం తీసుకున్నది. కలలో కూడా ఊహించని ఈ దాడి పాకిస్థాన్‌ను తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. అటు నాటో సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, టర్కీలు కూడా నష్ట నివారణ చర్యలను ముమ్మరం చేశాయి. పాకిస్థాన్‌ నేతలతో ఫోన్‌ సంభాషణలు ప్రారంభమయ్యాయి. సైనిక స్థాయిలో జరిగిన ఈ దుర్ఘటన రాజకీయ సంబంధాలపై ఎటువంటి దుష్ర్పభావం చూపకుండా జాగ్రత్త పడవలసిన అవసరం గురించి ఇస్లామాబాద్‌కు నచ్చజెప్పే ప్రయత్నం సాగుతున్నది.

శనివారం నాడు పాక్‌ సరిహద్దు సైనిక స్థావరాలపై నాటో దళాల హెలికాప్టర్‌, జెట్‌ దాడులకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరిపించడానికి నిర్ణయించారు. ఎటువంటి కవ్వింపు లేకుండా ఈ దాడులు జరిగాయని పాక్‌ సైన్యం చెబుతున్నది. పాక్‌ సైనిక స్థావరాలనుంచి కాల్పులు జరిగిన మీదటనే ఈ దాడులకు సమకట్టినట్టు నాటో, అఫ్ఘాన్‌ సైనిక వర్గాలు పేర్కొంటున్నాయి.ఉగ్రవాదులు స్థావరాలేర్పరచుకొని రాకపోకలు సాగించే పాక్‌- అఫ్ఘాన్‌ సరిహద్దులలో వారి ఏరివేతకు ఉద్దేశించిన నాటో సేనల ఉనికి, గాలింపు చీకట్లో దేవులాటగానే నిరూపించుకుం టున్నది. ఉగ్రవాదుల గుట్టుమట్టులు తెలిసిన పాక్‌ సైన్యం హృదయపూర్వకమైన పరిపూర్ణ సహకారం అందించకపోవడం వల్ల నాటో దళాల పని క్లిష్టతరమవుతున్నట్టు స్పష్టపడుతున్నది. ఈ నేపథ్యం లోనే చీమ చిటుక్కు మన్నా, పాము కాటు వేయబోతున్నంతగా భయోత్పాతం చెంది అవి అతిగా స్పందిస్తున్నట్టు బోధపడుతున్నది.

ఉగ్రవాదుల ఏరివేత కోసం అఫ్ఘానిస్థాన్‌పై అమెరికా ఏకపక్ష యుద్ధం దాని సారథ్యంలో నాటో దండయాత్ర లక్ష్య సాధనలో విఫలమవుతున్నాయి. ఉగ్రవాదులను ఏరివేసి కర్జాయ్‌ ప్రభుత్వానికి దేశాన్ని పూర్తిగా అప్పగించి అక్కడినుంచి సేనలను ఉపసంహరించుకోవాలని అమెరికా పెట్టుకున్న గడువు చేరువ అవుతున్న కొద్దీ ఆశించిన ఫలితాన్ని సాధించలేక అడుగులు తడబాటుకు గురి కావడమే జరుగుతున్నది. ఆ క్రమంలో ఇటుంటి ఘోరమైనపొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. దేశాల సరిహద్దులు, సార్వభౌమాధికారాలను గౌరవించడం అంతర్జాతీయ సంబంధాలలో అతి ముఖ్యమైన ప్రజాస్వామిక బాధ్యత. దీనిని గాలికి వదిలేసి అమెరికా రహస్య ఆపరేషన్‌ ద్వారా పాక్‌ భూభాగంలోని బిన్‌ లాడెన్‌ను హతమార్చింది.

ఈ ఏడాది జనవరిలో లాహోర్‌లో ఇద్దరు పాకిస్థానీయులను హతమార్చిన సిఐఎ అధికారి రేమండ్‌ అలెన్‌ డేవిస్‌ను పాక్‌ అధికారులు అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టగా అతడికి దౌత్య సంబంధమైన రక్షణలున్నాయంటూ అమెరికా పాక్‌పై కల్పించిన ఒత్తిడి చివరికి ఏ శిక్షా పడకుండా మృతులకు పరిహార విత్తం చెల్లింపుతో సరిపుచ్చి అతడిని విడుదల చేయించుకొని స్వదేశానికి రప్పించుకున్న వైనం అమెరికాకు ఇతర దేశాలలో ఆయా దేశాల చట్టాలకుండవలసిన స్వేచ్ఛ మీద కూడా గౌరవం లేదని నిరూపించింది. రేమండ్‌ డేవిస్‌ ఉదంతంతో ఆ విధంగా అమెరికా- పాక్‌ల సంబంధాలలో మొదలైన క్షీణత ఆ తదుపరి సంభవించిన పరిణామాలతో మరింత చిక్కబడింది.

అమెరికా, నాటో సేనలు 2014 నాటికి అఫ్ఘానిస్థాన్‌ నుంచి పూర్తిగా వైదొలగిన తర్వాత అక్కడ తన ప్రాబల్య, ప్రాధాన్యాలను పెంచుకోవాలని పాకిస్థాన్‌ భావిస్తున్నది. కర్జాయ్‌ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలు మరింత మెరుగు పరచుకోవడమూ పాక్‌కు కంటగింపుగా ఉన్నది. అఫ్ఘాన్‌ లోని ఉగ్రవాద సంస్థలతో పాక్‌ సైన్యం సత్సంబంధాలు కాపాడుకుంటూ వాటికి తోడ్పాటు కూడా ఇస్తున్నది. ఉగ్రవాదుల గుట్టు మట్టులు తెలిసిన పాకిస్థాన్‌ సహకారంతోనే వారిని తుదముట్టించాలని తలంచి అందుకోసం దానికి అపారమైన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న అమెరికాకు ఇది ఆందోళన కలిగిస్తున్నది.

శనివారంనాటి నాటో దాడులలో 24మంది అమెరికన్‌ సైనికుల దుర్మరణం ఘటన అమెరికాకు దూరమై ఇటు అఫ్ఘాన్‌లోని ఉగ్రవాదులకు అటు చైనాకు చేరువ కావడానికి పాకిస్థాన్‌కు ఒక చక్కని రాజమార్గంగా ఉపయోగపడగల అవకాశాలున్నాయి. అఫ్ఘాన్‌లో శాంతిప్రక్రియకు అమెరికాతో తామింక ఎంత మాత్రమూ సహకరించేదిలేదని పాక్‌ ప్రధాని గిలానీ తాజాగా చేసిన ప్రకటన ను గమనిస్తే వాషింగ్‌టన్‌, ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగానైనా తీవ్రంగా బెడిసికొట్టే వైపు పరుగులు తీస్తున్నాయని బోధ పడుతున్నది. అమెరికా ప్రపంచమంతటినీ తన క్రీడా స్థలంగా భావించి అన్య దేశాల సరిహద్దులు, సార్వభౌవూధికారాల పట్ల బొత్తిగా గౌరవం ప్రదర్శించకుండా వ్యవహరిస్తున్న తీరు పాక్‌ వంటి అత్యంత విధేయ దేశాన్ని కూడా దానికి దూరం చేస్తున్న దృశ్యాన్ని కళ్ళకు కడుతున్నది. పాకిస్థాన్‌ సహాయంతో అఫ్ఘానిస్థాన్‌లోని ఉగ్రవాదులను మట్టు బెట్టాలని, అదే సమయంలో మితవాదులను చర్చలకు రప్పించడం ద్వారా అక్కడ శాంతిని నెలకొల్పి పునర్మిర్మాణ కృషిని నిరవరోధం చేయాలని అమెరికా రచించుకున్న వ్యూహానికి విఘాతం ఏర్పడే సూచనలు కనుపిస్తున్నాయి. 
_______________________________________________________________________
మనసుకు ఓ ‘తోడు’
ఎంపు-55
యవ్వనంలో జరిగే పెళ్లికి ఎలాంటి ప్రశ్నలూ ఉండవు. అది సహజం. సంప్రదాయం. కానీ ఒక వయసు దాటిన తరువాత జరిగే పెళ్లిళ్ల వెనుక దాంపత్య సుఖానికి అతీతమైన అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి పెళ్లిళ్లలో శారీరక వాంఛల ఆలోచనలు ఇద్దరికీ దాదాపు ఉండవు. అయినా, కాలం ఎంతో మారిపోయింది అనుకుంటున్నా అలాంటి పెళ్లిళ్లు ఇప్పటికీ చెవులు కొరుక్కునే విషయాలు గానే ఉండిపోతున్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం జరగడం లేదు.

ఆరోగ్యకరమయిన రచనలు చేసేవాడిగా రా.వి.శాస్త్రి అభినందనలందుకున్న కేవీఎస్ వర్మ రాసిన కథ ‘తోడు’ కూడా ఒక పెళ్లి గురించినదే. ఈ కథలో భద్రయ్య పెళ్లి చేసు కోవడం జీవితంలో ఒక తోడు కోసమే. మరో కాంక్ష ఏదీ లేదు. భద్రయ్య చేసుకున్న సత్యవతికీ నలభయ్ సంవత్స రాలు దాటాయి. జుట్టు కొంచెం నెరిసింది. పేదరికం ఆమె కు పెళ్లి రాత లేకుండా చేస్తుందేమోననుకుంటున్న సమ యంలో భద్రయ్య తాళికట్టి నీడ కల్పించాడు. భద్రయ్యకు తోడు, సత్యవతికి నీడ- ఇవీ ఈ పెళ్లికి కారణాలు.

ఒంటరితనం, అదీ అరవై దాటాక, ఎంత దుర్భరమో అనుభవించిన వారికే తెలుస్తుంది అంటాడు భద్రయ్య. తోడు కథలో ఇదే కీలకాంశం. మనిషి ఆయుష్షు అంచనాకు అందనిది. కానీ జీవన ప్రమాణాల దృష్ట్యా ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటి బతికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అరవై పైబడి, ఎనభయ్ సంవత్సరాలు వచ్చే దాకా బతికే అవకాశం కనిపిస్తూ ఉంటే, ఆ మిగిలిన ఇరవై సంవత్సరాలు ఒక మనిషిని ఒంటరిగా ఉండిపొమ్మనడం ఘోరమైన శిక్షే.

జీవిత సంధ్యా సమయం వైపు నడుస్తున్న తండ్రుల తరానికి భద్రయ్య ప్రతినిధి. కొడుకూ కోడలూ లేదా కూతురూ అల్లుడు స్థితిమం తులుగానే ఉండొచ్చు-ఎక్కడో అమెరికా లోనో, లేదంటే ఇంగ్లండ్‌లోనో! ఇక్కడే ఉన్న తల్లిదండ్రులకు కూడా ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు. కానీ ఒంటరి తనం మాటో! అప్పుడప్పుడూ విదేశాల్లో ఉన్న కొడుకూ కోడలు దగ్గరకు వెళ్లినా ‘చెప్పుకోలేని’ కొన్ని బాధలతో మళ్లీ తిరిగి రావడమే అవుతోంది. అన్నీ ఉన్నా ఆత్మీయంగా పలకరించేవాళ్లు లేకుంటే జీవితంలో అదో శూన్యమే. ఈ సమస్య నుంచి విముక్తం కావడానికి ఏ కొందరో చేస్తున్న యత్నం - మళ్లీ పెళ్లి- మానవ సంబంధాలలో కొత్తకోణమే. వర్మగారి కథ పురుషుల జీవితానికే పరిమితం.

భద్రయ్య మళ్లీ పెళ్లి చేసుకుంటే అతని కొడుకు సుందర్రావు చూసిన కోణం-ఇక ‘ఆస్తిలో చిల్లిగవ్వ దక్కదు’ అనేదే. అంతేకానీ, తండ్రి అలాంటి నిర్ణయం తీసుకోవ డానికి కారణం ఏమిటి అన్న ఆలోచన మాత్రం అతడికి రాదు. అప్పుడు తన భార్య సుశీల మీద కూడా అతడికి ఆగ్రహం కలుగుతుంది. తండ్రి మళ్లీ పెళ్లి, ఆస్తిలో చిల్లిగవ్వ దక్కకుండా పోయే ఆ పరిణా మాలకి కారణం ఆమేనని అతడు భావి స్తాడు. సుందర్రావే కాదు, దారిలో కనిపిం చిన ఒక బంధువు కూడా భద్రయ్య నిర్ణ యాన్ని హర్షించలేకపోతాడు, ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే వెళ్లి, నలు గురు పెద్దల్ని కూడగట్టి వాళ్ల చేత చీవాట్లు పెట్టించు. ఆస్తంతా దానికి రాసెయ్యక ముందే జాగ్రత్తపడు’ అని ఉచిత సలహా పడేస్తాడు.

మానవ సంబంధాలకు ఆర్థికభాష్యం అన్ని కాలాల లోనూ కనిపించినా దాని విశ్వరూపం, అది వేస్తున్న వెర్రి తలలు ‘తోడు’ కథలో క్లుప్తంగానే అయినా మనసుకు హత్తు కునేటట్టు చిత్రించాడు రచయిత. అందరికీ ఆమోదయోగ్య మైన రీతిలో భద్రయ్య తన అయిదెకరాల ఆస్తిని పంచి చూపించాడు. ఇక్కడ భద్రయ్య చెప్పిన వాదన ఒక్కటే.

బాధ్యతలు ఎరిగిన వారికే అధికారాలూ ఉంటాయి. తండ్రిగా తన బాధ్యత తాను నిర్వర్తిం చాడు. కానీ కొడుకు! తన బాధ్యతలని విస్మరించడమే కాదు, తప్పుదారిలో ఉన్న కోడలిని తన దారికి తీసుకురాక పోవడమే కాదు, ఆమె దారిలోకి తనే అడుగులు వేశాడు. అయితే ఇక్కడ భద్రయ్య కోడలిని తప్పుపట్టడు. ఆమె పరాయి పిల్ల. నిజానికి భద్రయ్యది బలమైన వ్యక్తిత్వం. లోకం కోసం బతకాలని అనుకోడు. అలాఅని తను తప్పు చేయడు. ఎవరి కోసమో తన అభిప్రాయాలను మార్చు కోడు. ఆ క్రమంలోనే అతడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. తన అయిదెకరాలలో మూడు ఎకరాలు సుందర్రావు పేరన, రెం డెకరాలు సత్యవతి పేరున రాశాడు. తన తదనంతరం సత్య వతిని చూసుకోవడానికి సుందర్రావు, సుశీల ఇష్టపడకపోతే ఆమె ఎవరినైనా పెంచుకోవచ్చుననీ, తోడు కూడా తెచ్చు కోవచ్చునని విల్లు రాసి తన ఔన్నత్యాన్ని కూడా చాటుకున్నాడు భద్రయ్య.

ముసలి అత్తమామలు వద్దు, వారి ఆస్తులు మాత్రం కావాలి అనుకునే తత్వం కొందరిలో కనిపిస్తున్న నైజమే. దీనికి పరిష్కారంగా ఒకరిని తోడు తెచ్చుకుంటే మధ్య తరగతి పరిధిలో వినిపించే దుర్మార్గపు వ్యాఖ్యానాలు అందరికీ తెలిసినవే. అమెరికా వంటి స్వేచ్ఛాయుత సమాజంలోనో, పెద్ద పెద్ద నగరాలలోనో ఉన్నా ఇలాంటి పెళ్లికి కారణాలను ఊహించలేనంతగా మనుషులు జడులు గా మిగిలి ఉండడమే ఈ కథలో గొప్ప లక్షణం. (వర్మ రాసిన ‘మరొకడు’/‘నేను నేనే’ కథా సంకలనాలు మార్కెట్‌లో దొరుకుతాయి).
- ఆర్. జగదీశ్వరరావు

మనసుపొరల మధ్యనుంచి చూపును సారించి, ‘సారాంశం’ గ్రహించగల ‘జర్నలిస్టు’ ఆర్.జగదీశ్వరరావు నటుడూ, నాటక కర్తా, కథా రచయితా కూడా. రా.వి.శాస్త్రి - కె.ఎన్.వై పతంజలిలాంటి దిగ్దంతుల రచనలకు అభిమానిగా ఉంటూ, ఉత్తమ సాహిత్యాన్ని మనసారా అభినందించే సంస్కారం పెంచుకున్నారు. కె.వి.ఎస్.వర్మ కథానిక ‘తోడు’ను ఇక్కడ పరిచయం చేసినందుకు జగదీష్‌కు కృతజ్ఞతలు.

No comments:

Post a Comment