Thursday, November 3, 2011



దీపశిఖ

సంపన్న భారత్ ఫార్ములా వన్
-రాజ్‌దీప్ సర్దేశాయ్

గత పన్నెండు మాసాల్లో దేశంలో జరిగిన రెండు క్రీడా వేడుకలు రెండు భారతదేశాలను ప్రతిబింబించాయి. రాజకీయ నాయకుల-ప్రభుత్వాధికారుల సంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబర్‌లో కామన్వెల్త్ క్రీడోత్సవాలు జరిగాయి. ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ ఇటీవలే జరిగింది. నవ భారతదేశపు స్ఫూర్తికి నిదర్శనంగా ఫార్ములా వన్ నీరాజనాలనందుకొంది. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారవేత్తల సామర్థ్యాల మేళవింపుతో ఈ విజయం వన్నెకెక్కింది.

కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో జరగని అవినీతి ఏముంది? అవి భారతదేశపు ప్రతిష్ఠను ఎంతైనా మసకబార్చాయి. సకల రంగాలలో ప్రపంచ అగ్రగామిగా ఆవిర్భవిస్తోన్న భారతదేశపు ప్రతిభా సామర్థ్యాలను ఫార్ములా వన్ ప్రపంచానికి చాటి చెప్పింది. మరి రాజకీయ-ఉద్యోగస్వామ్య వితరణకు పేరుకెక్కిన పాత భారతదేశంపై కార్పొరేట్ సంస్థల దక్షత, షో బిజ్ ప్రభావశీలతకు ప్రతీక అయిన నవ భారతదేశంపై ఆధిక్యత సాధించినట్టేనా? అవును. కాదు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా ఫార్ములా వన్ ఒక అద్భుత విజయమనడంలో ఎవరికీ కించిత్ సందేహం కూడా లేదు.

రేస్ ట్రాక్‌పై ఒక జాగిలం కొద్ది సేపు అటూ ఇటూ తిరగడం మినహా అన్నీ ముందుగా నిర్ణయించిన ప్రకారం టంచనుగా జరిగిపోయాయి. ఏర్పాట్లు, వసతులు బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. డ్రైవర్లూ పూర్తి సంతృప్తి చెందారు. భరించలేని దుర్గంధాన్ని వెదజల్లే అపరిశుభ్ర టాయ్‌లెట్‌లు, టైమ్ టేబిల్‌ను పాటించక పోవడం, కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో మాదిరిగా చివరి నిమిషంలో సైతం నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించడం లాంటివేవీ ఈ గ్రాండ్ ప్రీలో చోటుచేసుకోలేదు.

కామన్వెల్త్ క్రీడోత్సవాలను పలువురు రాజకీయ వేత్తలు, బ్యూరోక్రాట్స్, క్రీడా శాఖ అధికారులు కలసికట్టుగా, కాదు, కుమ్మక్కయి నిర్వహించగా మేనేజ్‌మెంట్ నిపుణులతో కూడిన ఒక చిన్న బృందం ఫార్ములా వన్‌ను నిర్వహించింది. కామన్వెల్త్ క్రీడోత్సవాల నిర్వాహకులు తమ స్నేహితులు, ఆశ్రితులకు రాజకీయ, ఆర్థిక లబ్ధి సమకూర్చేందుకు, ఆ పోటీలు ఒక సువర్ణావకాశాన్ని కల్పించాయి. ఫార్ములా వన్ నిర్వాహకులకు ఆ కార్ల పోటీ ఒక వ్యాపార అవకాశం.

లాభార్జనతో పాటు తమ బ్రాండ్‌ను మరింత సమున్నత స్థాయికి పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఆ పోటీ జరిగింది. కామన్వెల్త్ క్రీడోత్సవాల నిర్వహణకు అయిన సొమ్ము ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన ధనం. కనుకనే దానిని ఎవరు ఎలా ఖర్చు పెట్టారనే విషయమై ఎవరూ జవాబుదారీ కాకుండా పోయారు. ఫార్ములా వన్ నిర్వహణకు నిధులు లిస్టెడ్ కంపెనీల నుంచి వచ్చాయి. ఆ ఖర్చుకు తగు లాభాలను ఆర్జించినట్టు ఆ కంపెనీలు తమ వాటాదారులకు చూపవలసివుంది.

ఫార్ములా వన్ విజయం పూర్తిగా ప్రైవేట్ రంగ వ్యాపార సంస్థల ఘన విజయంగా భావించనవసరం లేదు. ఎందుకని? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి పూర్తి మద్దతు లేకుండా గ్రేటర్ నోయిడాలో ఫార్ములా వన్ జరిగి ఉండడం సాధ్యమయ్యేది కాదని స్పష్టంగా చెప్పవచ్చు. గ్రాండ్ ప్రీ ని ప్రారంభించింది సచిన్ టెండూల్కర్ కాగా బహుమతి ప్రదానం చేసింది మాయావతి కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. రేస్ ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా సత్వరమే పూర్తయ్యేదే కాదు; సకాలంలో సకల వసతులను అభివృద్ధిచేయడం నిర్వాహకులకు సాధ్యమయ్యేదే కాదు. భూ సేకరణలో కొంత మంది రైతులకు నష్టపరిహారం సరిగ్గా చెల్లించలేదనే ఆరోపణలు రాకపోలేదు.

అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి లభించిన మద్దతుతో నిర్వాహకులు ఆ విమర్శలన్నిటినీ అధిగమించగలిగారు. ఫార్ములా వన్, ఆచరణలో ప్రైవేట్ రంగం- ప్రభుత్వ రంగం భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. అంతేకాదు ఈ 21 వ శతాబ్ది ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి (పరస్పర ప్రయోజనాలు సిద్ధించేలా ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన ప్రైవేట్ సంస్థలకు లబ్ధి సమకూర్చడం) కూడా అది తిరుగులేని రుజువు అయింది.

ఒక ముఖ్య విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి తీరాలి. నియంతృత్వ వైఖరితో వ్యవహరించే శక్తిమంతమైన ముఖ్యమంత్రుల పాలనలో ఉన్న రాష్ట్రాలలో ప్రైవేట్-ప్రభుత్వ భాగస్వామ్యం సఫలమవ్వడం గమనార్హమైన విషయం. ఆటోమొబైల్ కంపెనీలకు గుజరాత్ ఏ కారణంగా గమ్యమయిందో, అదే కారణంగా ఫార్ములా వన్‌కు కూడా ఉత్తరప్రదేశ్ గమ్యమయిందని చెప్పవచ్చు.

భారీ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులన్నిటినీ నరేంద్రమోడీ, మాయావతి లాంటి ముఖ్య మంత్రులు ఇచ్చినంత సత్వరంగా బహుశా మరే రాష్ట్రాలు ఇవ్వడం లేదు. అటువంటప్పుడు పరిశ్రమాధిపతులు, వ్యాపారవేత్తలకు ఆ రాష్ట్రాలు గమ్యాలు కాకుండా ఎలా ఉంటాయి? కామన్వెల్త్ క్రీడలను ఢిల్లీలో నిర్వహించడం ఒక దుస్వప్నంగా మిగిలిపోయింది. జాతీయ రాజధానిలో వివిధ స్థాయిలలోని అధికారులు పెత్తనం చెలాయించడంతో ఆ క్రీడల్లో అంతులేని అవినీతి చోటు చేసుకొంది.

మరి ఈ ప్రైవేట్-ప్రభుత్వ భాగస్వామ్యం ఇతర క్రీడలలోను, ఆ మాట కొస్తే ఇతర రంగాలలోను సఫలమవుతుందా? ఫార్ములా వన్ పలు విధాలుగా ప్రత్యేకమైనది. ఫార్ములా వన్ వలే మార్కెట్ ప్రయోజనాలకు ఉపయోగపడే క్రీడలు చాలా తక్కువ. ఆటో మొబైల్ కంపెనీల నుంచి ఎఫ్ఎమ్‌సిజిల వరకు వాటి వాటి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఫార్ములా వన్ ఒక ఆదర్శ వేదిక. కామన్వెల్త్ క్రీడలు ప్రభుత్వ రంగ సంస్థలు, పాతకాలపు సంప్రదాయాలను మరచిపోని ప్రైవేట్ కంపెనీల ఉదారతపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఫార్ములా వన్‌కు అలా కాక దేశీయ, బహుళజాతి కార్పొరేట్ సంస్థలన్నిటి మద్దతు ఉంది.

కామన్వెల్త్ క్రీడలు తమ విశిష్ట ఆకర్షణ అంశంగా పాత తరహా 'జాతీయవాదం'పై ఆధారపడుతుండగా ఫార్ములా వన్ సంపన్న నవ భారతదేశమనే ఒక వినియోగదారుడికి 'ఆకాంక్ష'ను విక్రయిస్తుంది; ఈ నూతన భారతదేశంలో ఒక పేద వ్యక్తి ఒక టీవీ షో పై ఆధారపడి రాత్రికి రాత్రే మోతీహరి స్థాయి నుంచి కోటీశ్వరుడు కాగల అవకాశముంది మరి. కామన్వెల్త్ క్రీడా పోటీలలో ఒక భారతీయుడు స్వర్ణ పతకాన్ని సాధించినప్పుడు మీ కళ్ళు చెమర్చుతాయి.

ఉద్వేగాలు మిమ్ములను ముప్పిరిగొల్పుతాయి. అయితే ఫార్ములా వన్ కార్ల పోటీ జరుగుతున్న ఆవరణలో వెండితెర అభినేత్రో లేదా క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ దిగ్గజాలు కన్పించినప్పుడు సంబంధిత 'స్టార్'ల అభిమానులతో సహా ఆక్కడున్న వారందరూ ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఫార్ములావన్‌లో నారాయణ్ కార్తికేయన్‌కు 17వ స్థానం మాత్రమే దక్కి ఉండవచ్చు. అయితే ఆయన అభిమానుల కోలాహలం, ఆనందోత్సాహాలను చూసినప్పుడు, అసలు వాటికి కారణమైన ఆ కార్ల పోటీ కేవలం ఆకస్మాత్తుగా జరిగినట్టు కనిపిస్తుంది.

నవ భారతదేశపు సామర్థ్యాలు, బలహీనతలను అర్థం చేసుకోవడానికి ఫార్ములా వన్ విజయం తోడ్పడుతుంది. ఒక స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ లో పురోగమిస్తోన్న ఒక జాతి అపూర్వ చైతన్యశీలతను అది ప్రదర్శిస్తుంది. భౌగోళిక సరిహద్దులను అధిగమించిన ఆకాంక్షలతో పురోగమిస్తున్న జాతి చైతన్యమది. గ్రాండ్ ప్రీ లో భారత్ ఒక శాశ్వత భాగస్వామిగా ఉండాలనే విషయమై ఫార్ములా వన్ అధిపతి బెర్ని ఎక్లెస్టోన్ విశే ష ఆసక్తి చూపడం అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతోన్న ప్రాధా న్యానికి ఒక తిరుగులేని నిదర్శనం.

అయితే మరొక స్థాయిలో ఫార్ములా వన్ ఈవెంట్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతికి వెంపర్లాడడమనేది ఆత్మగౌరవ లోపాన్నే తెలియజేస్తుంది. అందుకు ప్రత్యామ్నాయంగా గ్లామర్, ధనరాశులతో పరిహారం పొందడానికి ప్రయత్నిస్తున్నాము. సాపేక్షంగా చాలా స్వల్పకాలంలోనే మనం దున్నపోతుల బళ్ల నుంచి ఫార్ములా వన్ యుగంలోకి పురోగమించడమే మన సమస్యేమో? విశాల భారతదేశంలో ఇంకా చాలా ప్రాంతాలు వెనుకబడిపోయి ఉన్నాయన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు.

గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్‌లో ఒక చివర ఉంటే, ఆ విశాలరాష్ట్రం మరో చివర ఉన్న గోరక్‌పూర్‌లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల మెదడు వాపు వ్యాధితో దాదాపు 500 మంది బాలలు అకాల మరణం పొందారు. ఫార్ములా వన్ ఈవెంట్‌ను నిర్వహించడంలో చూపిన శ్రద్ధాసక్తులను ఉత్తరప్రదేశ్ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులను నిర్మించడంలో సైతం చూపే ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్య కృషిని మనమెప్పుడు చూస్తాం?

(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)




**********************************************************************************




**********************************************************************************



No comments:

Post a Comment