Sunday, October 23, 2011


మతాన్నిబట్టి న్యాయం

--సాక్షి
September 17th, 2011

మాటవరసకు మీ వీధిలో ఓ కిరాణా దుకాణముంది. అక్కడ సరుకులు కల్తీ; తూకంలో మోసం! ఆ సంగతి మీరు కనిపెట్టారు.పదిమందికీ చెప్పారు. అందరూ అక్కడ కొనడం మానేశారు. మీ దెబ్బకు ఆ దుకాణం మూతపడింది.

మంచిపని చేశానని మీరు అనుకున్నారు. మంచిపనే. కాని - సరికొత్త మతహింస బిల్లు చట్టమయ్యాక మీరు ఇదే పని చేస్తే... ఆ షాపు నడిపేవాడు ఏ అబ్రహామో, అబ్దుల్లానో అయితే... మీకు మూడినట్టే! అతగాడు పితూరీ చేసిన మరుక్షణం పోలీసు ఇనె్స్పక్టరు రెక్కలు కట్టుకుని మీ ఇంటికొచ్చి- ‘‘మైనారిటీ వర్గానికి చెందినవాడి వ్యాపారాన్ని బహిష్కరించి, అతడి జీవనోపాధిని దెబ్బతీయుట ద్వారా మైనారిటీ వర్గానికి ప్రతికూల వాతావరణాన్ని కల్పించుట’’ అనే నేరం కింద మిమ్మల్ని ఉన్నపళాన అరెస్టుచేసి జైల్లోకి తోస్తాడు. దాని వెనక ఎవరున్నదీ మీకు తెలుసు కాబట్టి మీరో, మీ వాళ్లో పరుగున పోయి వ్యాపారి కాళ్లు పట్టుకుని కేసు మాఫీ చేయించుకోగలరేమో! కాని కొన్ని సందర్భాల్లో అదీ కుదరదు.

యథేచ్ఛగా జరిగే మతాంతరీకరణలు అనర్థమనో, ఇస్లామిక్ టెర్రరిజానికి పాలుపోసే వారిని పట్టుకోవాలనో, ఏదో మైనారిటీ విద్యాసంస్థ అక్రమాల గురించో మీరు ఎప్పుడో, ఎవరి ముందో ఘాటుగా మాట్లాడి ఉండవచ్చు. మైనారిటీ మతస్థులతో ఏ లావాదేవీలోనో, వృత్తి, వ్యాపార పరంగానో గొడవపడి ఉండవచ్చు. లేదా ఏ వందేమాతరం క్లబ్బుకో, మైనారిటీలకు సరిపడని హిందూమత సంస్థకో విరాళం ఇచ్చి ఉండవచ్చు. కర్మంచాలకపోతే వీటిలో దేని గురించి ఫిర్యాదు అందినా పోలీసువాడు సంకెళ్లుపట్టుకుని మీ ఇంటికి రాగలడు. మైనారిటీ వర్గంపై ద్వేష ప్రచారం చేశావనో, మైనారిటీ వర్గానికి చెందిన కారణంతో ఒక వ్యక్తిపై దౌర్జన్యం చేశావనో, చేస్తానని బెదిరించావనో, మైనారిటీ వర్గానికి ప్రతికూల వాతావరణం కల్పించేందుకు సహకరించావనో ఫిర్యాదు అందింది కనుక మతహింస చట్టం కింద అర్జంటుగా నిన్ను అరెస్టు చేస్తున్నాననగలడు. ‘‘ఎవడో ఫిర్యాదు చేసినంత మాత్రాన నేను నేరం చేసినట్టేనా? చేశానో లేదో మీరు విచారించి నిర్ధారించుకోవద్దా?’’ అంటారు మీరు. ‘‘అదేమో నాకు తెల్వద్. నేరం రుజువయ్యేదాకా ప్రతోడూ నిర్దోషేనని నీలాంటోళ్లు చెప్పే కబుర్లు ఇక్కడ నడవవ్. మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా నేరం జరిగిందా లేదా అన్న ప్రశ్న వస్తే - జరిగిందనే భావించాలని కొత్త చట్టం 73వ సెక్షను చెబుతుంది. నేరం చెయ్యలేదని రుజువయ్యేదాకా నిందితుడు నేరంచేసి ఉంటాడనే అనుకోమని 74వ సెక్షను అంటుంది. నీ మీద ఫిర్యాదు వచ్చింది కాబట్టి నువ్వు నేరం చేసినట్టే! నిన్ను బొక్కలో తొయ్యాల్సిందే’’ అంటాడు పోలీసు. అది విని మీ బుర్ర గిర్రున తిరుగుతుంది. ‘‘మా లాయరుతో మాట్లాడుతా. ఏం చేయాలో ఆలోచించి మీ దగ్గరికి వస్తా’’ అంటారు. ‘‘ఆ పప్పులక్కడ ఉడకవ్ తమీ. ఈ చట్టం కిందికి వచ్చే ఏ నేరమైనా కాగ్నిజబుల్ అఫెన్స్. నిన్ను వెంటనే అరెస్టు చెయ్యాల్సిందే. లాయరొచ్చి బెయిలు తెస్తాడనుకుంటున్నావేమో ఈ కేసుల్లో బెయిలు కూడా ఇవ్వరు. కదులు ముందు’’ అని తొందరపెడతాడు పోలీసు. ఇక మీకు ఏడుపొచ్చేస్తుంది. ‘‘కనీసం నా మీద కంప్లయింటు చేసిందెవరో చెప్పండి. పోయి కాళ్లయినా పట్టుకుంటాను’’ అంటారా?

నో చాన్స్! ఆ ఆశాలేదు. బాధితుడు ఎవరన్నది ఎవరికీ తెలియనివ్వకూడదని 40వ సెక్షను ఆన!
పోనీ - మీ ఏడుపుకు దయతలిచో, మీ వాలకం గమనించో, వారినీ వీరినీ వాకబు చేసో, మీకు అంతటి నేరం చేసేంత సీను లేదని పోలీసు ఇన్స్ప్‌క్టరు ధ్రువపరచుకుని మిమ్మల్ని వదిలేద్దాం అనుకున్నాడనుకోండి. ఐనా మీ కష్టాలు తీరవు.

పసలేని ఫిర్యాదులెమ్మని పోలీసులు దేన్నీ బుట్టలో పడెయ్యటానికి వీల్లేదు. ఫిర్యాదుపై దర్యాఫ్తు ఎంతవరకు వచ్చిందీ, ఎవరిని అరెస్టు చేసిందీ, చార్జిషీటు ఎప్పుడు పెట్టేదీ ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుకు రాతపూర్వకంగా దాఖలు చేసుకోవలసిన బాధ్యత 69వ సెక్షను ప్రకారం దర్యాఫ్తు అధికారిపై ఉంటుంది! అరెస్టు చెయ్యలేదు, చార్జిషీటు పెట్టట్లేదు అని పోలీసులంటే ‘‘బాధితుడు’’ ఊరుకోడు. ఏకంగా సరికొత్త ‘‘నేషనల్ అథారిటీ’’కో, ‘‘స్టేట్ అథారిటీ’’కో పోతాడు. ఒక్కో అథారిటీలోనూ ఏడుగురు మెంబర్లుంటారు. వారిలో కనీసం నలుగురు కంపల్సరీగా మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే ఉంటారు. వాళ్ల చేతిలో ప్రభుత్వాలనే ఫుట్‌బాల్ ఆడగలిగేంతటి అధికారాలుంటాయి.

కట్ చేస్తే... ఏ మహాద్భుతమో జరిగితే తప్ప మీకు మూడేళ్ల నుంచి యావజ్జీవం వరకూ జైలుశిక్ష, భారీ జుల్మానా గ్యారంటీ!

దేశవిభజన కాలం నుంచి నేటిదాకా ఇండియాలో ఎన్నో మతకల్లోలాలు జరిగాయి. ఎన్నో వేలూ, లక్షల మందిని దారుణంగా బలిగొన్నాయి. వారిలో అన్ని మతాలకు చెందినవారూ ఉన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన పాపంలో మెజారిటీ మైనారిటీ అన్న తారతమ్యం లేదు. దేశం మొత్తంమీద చూస్తే మైనారిటీ అయిన వారిది కూడా ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, లేక ఒక నగరంలో మెజారిటీ అయిన దృష్టాంతాలు లెక్కలేనన్ని. మానవత్వానికి, సభ్య సమాజానికి సిగ్గుచేటు అయిన మత హింస ఉన్మాదానికి పాల్పడింది ఎవరైనా, ఏ మతస్థులైనాసరే అందరినీ ఒకే విధంగా పరిగణించి, కఠినాతి కఠినంగా శిక్షించాలనే ఎవరైనా కోరేది. మతంతో విశ్వాసాలతో నిమిత్తం లేకుండా భారత పౌరులందరికీ సమాన న్యాయం, సమాన హక్కు ఉండాలనే అందరమూ అడిగేది.

అదీ పేరాశేనని దయగల యు.పి.ఎ. సెక్యులర్ సర్కారువారు ఇప్పుడు బ్రహ్మాండంగా తేల్చి పారేశారు. పార్లమెంటు నెత్తిమీద సూపర్ పార్లమెంటులా అమాంబాపతు శాల్తీలతో కొలువుతీరిన నేషనల్ అడ్వయిజరీ కౌన్సిలు వండివార్చి, కేంద్ర కేబినెటు కళ్లు మూసుకుని ఓకే చేసి, ఇక పార్లమెంటు ఆమోదం తతంగమే తరువాయి అనుకుంటున్న Prevention of Communal and Targeted Violence Bill, 2011 లో ఫొందుపరిచిన ప్రకారం-

మైనారిటీలపై మెజారిటీ వర్గం జరిపేది మాత్రమే ‘మతహింస’గా పరిగణించబడును. ముస్లింలపై హిందువులలాగే, హిందువులపై ముస్లింలో, ఇంకో మతస్థులో మతహింసకు పాల్పడ్డ ఉదంతాలు ఇటీవలి చరిత్రలో ఎన్ని ఉన్నా సరే! ఈ తల తిక్క బిల్లు దృష్టిలో - మైనారిటీ వర్గాలు మాత్రమే మతహింసకు బాధితులు.

'Victim' means any person belonging to a "group"
(భాధితుడు అనగా ఒక గ్రూపునకు చెందిన వారెవరైనా.)

"Group" means a religious or linguistic minority...
(‘‘గ్రూఫు’’ అనగా మతపరమైన, లేక భాషాపరమైన మైనారిటీ...)

అని 3వ సెక్షనులో ఇచ్చిన అమోఘ నిర్వచనాలను బట్టే ‘గోధ్రా’ రైలు పెట్టెలో సజీవ దహనమైన అభాగ్యులూ, 1993 బొంబాయి అల్లర్లలో ఘోరంగా బలి అయిన వందలాది హిందువులూ, కాశ్మీర్ గడ్డ నుంచి గెంటివేయబడ్డ లక్షలాది పండిట్లూ ‘మత హింస’ బాధితుల లెక్కలోకి రారని స్పష్టం. కుల, మత, విశ్వాసాలకు అతీతంగా భారత పౌరులందరూ చట్టం దృష్టిలో సమానులన్న రాజ్యాంగ సూత్రాన్నీ, నేరం రుజువయ్యేదాకా ఎవరినైనా నిరపరాధిగా చూడాలన్న సాధారణ న్యాయాన్నీ గుంటపెట్టి గంట వాయించి... ‘మతాన్నిబట్టి న్యాయం’ అన్న అడ్డగోలు సిద్ధాంతాన్ని లేవదీసిన జాతీయ సలహామండలి మేధావుల తెలివికి జోహార్లు! మైనారిటీల ప్రయోజనాలను కాపాడటమంటే మెజారిటీ ప్రజలను కాలరాచి, తుంగలో తొక్కడమేనని కనిపెట్టిన వీర సెక్యులర్ సర్కారువారి బుర్రే బుర్ర!
*******************************************************************



జగన్.. జీరో నుంచి ప్రారంభిద్దామా!
వి. రాధాకృష్ణ

సహనం, సంస్కారం అందరికీ అర్థం కావు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శిబిరానికి కూడా నా సహనం అర్థం కాలేదు. మూడు రోజులుగా జగన్ మనుషులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, రోత మీడియాగా పేరొందిన సాక్షి పత్రిక, ఛానెల్ ఆ కారుకూతల్నే పరమ సత్యాలుగా ప్రచారం చేస్తున్నా, ఊరుకున్నది... తిరిగి సమాధానం చెప్పలేక కాదు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణగా ఇప్పుడు చెబుతున్నాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డీ, నీ చెంచాలను పక్కనపెట్టి నాతో చర్చకు రా! నీలో ఏ మాత్రం నీతీ నిజాయితీ ఉన్నా, నా సవాలును స్వీకరించు.

నాపై నువ్వు చేయించిన ఆరోపణలన్నింటికీ నేను సమాధానం చెబుతాను. నీపై వచ్చిన ఆరోపణలకు నువ్వు సమాధానం చెప్పుకో. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు ఏమిటో. జర్నలిస్టుగా నా ఎదుగుదల వెనుక ఏదో క్షమించరాని నేరమున్నట్టు నీ శిబిరం గోబెల్స్ ప్రచారం చేస్తోంది. నీ తండ్రి వైఎస్ హయాంలో మొదలైన ఈ ఎదురు దాడి సంస్కృతిని నీవు మరింత పరాకాష్ఠకు తీసుకుపోయావు. ఆనాడు నీ తండ్రికి చెప్పాను, 'నేను-నా అక్షరం' ఎంత నికార్సయినవో. చర్విత చరణమైనా ఈరోజు నీకు, నీ వందిమాగధులకు విడమరచి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.

మూడు దశాబ్దాల నా జర్నలిస్టు కెరీర్‌లో, నేను తప్పు చేసినట్టు, తప్పుడు రాతలు రాసినట్టు, అవినీతికి పాల్పడినట్టు నువ్వు రుజువు చేయగలిగితే ఆంధ్రజ్యోతి పత్రికలో నా వాటాను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల సంఘానికి విరాళంగా ఇస్తాను. జర్నలిస్టుల సంఘమే పత్రికను నిర్వహించుకోవచ్చు. 2004 నుంచి నువ్వు ఎంత ఎదిగావో, ప్రజల సొమ్ము ఎన్ని కోట్లు కొల్లగొట్టావో, ఎన్ని ఆస్తులు మూటగట్టుకున్నావో... అవన్నీ లెక్కకట్టి ప్రజలకు పంచడానికి నువ్వు సిద్ధమేనా? సీబీఐ నీ ఇంటికొచ్చిన వార్త రాసినందుకు, నా ఇంటి ప్రస్తావన కూడా తీసుకొచ్చావు కాబట్టి చెబుతున్నా... ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న నీ ఇల్లు,

నా ఇల్లు రెండూ ఒకటే అయితే... నా ఇల్లు కూడా అమ్మేసి ఆ సొమ్ము నీకే ఇస్తా. రేపు సీబీఐ నీ ఇంటికి కట్టబోయే విలువలో, నాకు నాలుగోవంతు ఇవ్వు చాలు; నా ఇంటిని వదులుకుంటాను. నేను ఉంటున్న ఇల్లు నాదేనని నేను సగర్వంగా చెప్పుకోగలను. అందుకు అవసరమైన అన్ని ఆధారాలూ చూపగలను. నువ్వా స్థితిలో ఉన్నావా? నీ పెంపుడు జంతువులు పదే పదే ప్రకటిస్తున్నట్టు, అది నీ ఇల్లేనని డాక్యుమెంట్స్ చూపించగలవా? ఇంటి స్థలంలో సగం వాటాదారు యూనస్ సుల్తాన్ నీ మాయలో ఎలా పడ్డారో, నీకెలా ఆ స్థలం సమర్పించుకున్నారో వివరించగలవా?

నేను సైకిల్‌పై తిరిగిన జీరోనన్నారు కదూ, తిరిగి జీరో నుంచి జీవితం ప్రారంభించడానికి నేను రెడీ... నీ అవినీతి సామ్రాజ్యాన్ని కాలదన్నుకొని నువ్వొస్తావా ఆ జీరో దగ్గరకు? అయినా నాకూ నీకూ పోలిక ఏంటి! నీ బాబు ముఖ్యమంత్రి. ఆ బాబును అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడగలిగిన అవకాశం నీకే ఉంది. నాకేముందని ఈ పిచ్చి కూతలు? నీకో పార్టీ ఉందని, ఆ పార్టీకో పత్రిక, టీవీ ఉన్నాయని, ఇష్టమొచ్చిన రాతలు రాసి, ఇష్టమొచ్చిన కూతలు కూస్తూ పోతే ఇవతలి వాళ్లు చేతులు కట్టుకు కూర్చోరు. మొత్తం మీడియానే భ్రష్టు పట్టించే ప్రయత్నాలను ప్రతిఘటించకుండా ఊరుకోరు.

అందుకే నేరుగా నీకే సవాలు విసురుతున్నాను జగన్‌మోహన్‌రెడ్డీ రా.. నాతో బహిరంగ చర్చకు రా! 2004 ముందు నీ తండ్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూలో ఉన్న ఇంటిని అమ్ముకుంటేగానీ తనకు మనుగడ ఉండదని భావించడం నిజం కాదా? ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును రిక్వెస్ట్ చేయడం నిజం కాదా? "వైఎస్ ఇంటికి బాబు గొళ్లెం'' అని 'ఆంధ్రజ్యోతి' పతాక శీర్షికన ప్రచురించలేదా? అలాంటి స్థితి నుంచి మీ నాన్న ఎలా ఎదిగాడు? ఆ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆరేళ్లలో నీవెలా ఎదిగావు? ఇవన్నీ బహిరంగ రహస్యాలు కావా?

నీ తండ్రి మరణానంతరం ఒక్కొక్క వాస్తవం వెలుగు చూడడం నడుస్తున్న చరిత్ర కాదా! మీడియాను, రాజకీయ ప్రత్యర్థుల్ని సహించలేక మీ నాన్న ఎదురుదాడికి దిగితే, నువ్వా దుర్మార్గపు విద్యను మరింత ముందుకు తీసుకుపోవాలనే నిర్ణయించావా! సీబీఐ ముప్పేట దాడితో ఊపిరాడని నువ్వు, పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన నువ్వు, అసహనంతో వేస్తున్న పెడబొబ్బలకు మీడియా ఎందుకు టార్గెట్ కావాలి? నువ్వు బురదలో కూరుకుపోయావని ఆ బురద అందరికీ అంటిస్తే ఊరుకుంటామా?

ఇవాళ సెజ్‌ల గురించి నీ మనుషులు ధర్మ పన్నాలు వల్లిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సెజ్‌ల బాగోతం తెలియందెవరికి? వైఎస్ హయాంలో మంజూరైన సెజ్‌లన్నీ పర్సెంటేజీల రూపంలో జగన్‌మోహన్‌రెడ్డికి కప్పం కట్టిన వైనం నిజం కాదా? తెలంగాణకు చెందిన ఓ ప్రముఖుడి సిమెంట్ కంపెనీపైనా ఇదే అస్త్రం ప్రయోగించలేదా! కొందరు నీ పర్సెంటేజీల దందా భరించలేక నీ తండ్రికే మొరపెట్టుకున్న దాఖలాలు ఎన్నిలేవు? ఎంత మంది నీ దాష్టీీకానికి జడిసి నోరుమూసుకొని ఉండిపోలేదు! అసలు నీ అవినీతి సామ్రాజ్య విస్తరణకు కేంద్ర బిందువైన సండూర్ పవర్‌కు మార్జిన్ మనీ కూడా లేని స్థితిలో ఎవరెవరి దగ్గర చేయిచాపావో, ఎంతెంత సొమ్ము తెచ్చుకున్నావో మరచిపోయావా!

నీ చరిత్ర ఇంత ఘనంగా ఉంటే, వర్తమానంలో నిన్ను కేసులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, నీ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంటే ఇంకా ఏ ధైర్యంతో ఎదురుదాడిని కొనసాగిస్తున్నావో నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. హైదరాబాద్‌లో నువ్వు కట్టుకున్నది ఇంద్ర భవనమో కాదో త్వరలోనే తేలిపోతుంది. కొల్లగొట్టిన కోట్లలో ఎన్ని కోట్లు పోసి ఆ భవనాన్ని ముస్తాబు చేశావో త్వరలోనే లెక్క తేలుతుంది. ఇంత మంది అధికారులు, అంత మంది సిబ్బంది, ఇన్నేసి రోజులు నీ ఇంటి చుట్టూ తిరుగుతూ లెక్కలేస్తున్నారంటేనే అది మయసభను తలపించే మాయదారి ఇల్లని తెలియడం లేదా!

సీబీఐ సోదాలు చేసి చెబుతున్న సమాచారం ప్రచురించడమే పత్రికల పాపమైందా! ఆ వార్తలను ప్రసారం చేయడమే టీవీ ఛానళ్ల నేరమైందా! అందుకేగా నీ పెంపుడు జంతువుల్ని ఉసిగొల్పి విషం కక్కిస్తున్నావు. ఆరేళ్లు అధికారంలో ఉన్న నీ తండ్రే నన్నేమీ చేయలేకపోయాడు. నేను అవినీతికి పాల్పడినట్టు ఒక్కటంటే ఒక్క రుజువూ చూపలేకపోయాడు. మార్గదర్శిని అడ్డంపెట్టుకొని ఈనాడుతో ఆడుకోగలిగాడు కానీ ఆంధ్రజ్యోతి జోలికి రాలేకపోయాడు. నా దగ్గర దోషమే ఉంటే, నేను అక్షరాన్ని అమ్ముకొనే ఎల్లో జర్నలిస్టునే అయివుంటే నీ తండ్రి నన్నెందుకు ఏమీ చేయలేక ఊరుకున్నాడో తెలిస్తే సమాధానం చెప్పు.

తండ్రికి తెలియని సంగతులు నీకేమన్నా తెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చెబుదువురా! మందబుద్ధుల కోసం మళ్లీ మళ్లీ చెబుతున్నాను... ఆంధ్రజ్యోతి రాసిన రాతలు అక్షర సత్యాలు. 'ఆంధ్రజ్యోతి' ఎండీగా నా విశ్వసనీయత, నిజాయితీలపై ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం. పెంపుడు జంతువుల్ని పక్కనబెట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాతో చర్చకు రావాలని సవాలు చేస్తున్నాను. ఆస్తులు వదులుకోవడానికి నేను విసురుతున్న ఈ సవాల్‌కు స్పందించే దమ్ము, ధైర్యం నీకు లేకపోతే, నోరు మూసుకోవలసిందిగా నీ పెంపుడు జంతువులను ఆదేశించు. లేదా నీ అక్రమ సంపాదనను ప్రజల పరం చేయడానికి సిద్ధం కా!


******************************************************************************

నరహంత ఖాతాల్లో గడాఫీ


  • ప్రస్తుతం
ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ల దురాక్రమణ తర్వాత అమెరికా లక్ష్యం లిబియా,ఇరాన్‌ వంటి దేశాలేనని ఎప్పుడో స్పష్టమైంది. అయినా దౌత్య నీతితో గడాఫీ ప్రభుత్వం వారితో సంబంధాలు, సంప్రదింపులు నెరపుతూ నెట్టుకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని అడ్డుకునే పేరిట అమెరికా సృష్టించిన తాలిబాన్లు,అల్‌ ఖయిదా, బిన్‌లాడెన్‌ వంటి వారి ప్రాబల్యానికి గడాఫీ ఎప్పుడూ లోను కాలేదు. అయితే 9/11 నిందితులలో ఒకడైన అబ్దెలఖిమ్‌ బెల్వద్జీని 2003లో మలేషియాలో పట్టుకున్న సిఐఎ మరుసటి ఏడాది లిబియాకు అప్పగించింది.
నియంతవో.. నీతి మంతుడివో.. ఉత్సాహివో..ఉన్మాదివో.. పోరాడిన యోధుడివి, నిలబెట్టిన నాయకుడివి..మంటల మధ్యనా మడమ తిప్పని స్థయిర్యం, పంజరంలోనూ లొంగని ధైర్యం..నీలోనే చూసిందొక కాలం,,నీవే ప్రతిఘటనకు ఆలవాలం.. కాల సంధ్యలో నీ బలిదానం,, బుష్సాసురులకు రణనాదం.. అయిదేళ్ల కిందట 2007వ సంవత్సరం ప్రవేశించనున్న తరుణంలో సద్దాం హుస్సేన్‌ను లోపాయికారిగా ఉరి తీసిన కథనాన్ని విడుదల చేసినప్పుడు రాసిన చరణాలివి. లిబియా అధినేత కల్నల్‌ గడాఫీ అమానుష హత్య తరుణంలో ఇవే వాక్యాలు గుర్తుకు వస్తున్నాయి. రోజెన్‌ బర్గులను కక్షకట్టి కరెంటుతో చంపినా, పర్షియా నేత మొసాదిక్‌ను సిఐఎ హత్య చేయించినా,వజ్రాల సీమ కాంగోలో పాట్రిస్‌ లుముంబా ప్రాణాలు బలిగొన్నా, లాటిన్‌ అమెరికాలో చే గువేరాను బలిగొన్నా, చిలీలో ప్రజలెన్నుకున్న అలెండీని హతమార్చినా, ఆఫ్ఘనిస్తాన్‌లో అభ్యుదయ పాలకుడు నజీబుల్లాను నడివీధిలో ఉరి తీయించినా, సోషలిస్టు రుమేనియా అధినేత సెషెస్క్మూను నిరంకుశంగా కాల్చిపారేసి టీవీలలో అదే పనిగా చూపించినా అన్నిటా ఒకే దుర్నీతి. ఒకే దుర్మార్గం. కొన్ని చోట్ల సైన్యం,కొన్ని చోట్ల కోర్టులు, కొన్నిచోట్ల కిరాయి హంతకులు.... ఇప్పుడు లిబియాలో చూస్తున్నది ప్రజాస్వామ్యం పేరిట తిరుగుబాటు శక్తుల ముసుగులో సాగిన ఘాతుకం.
నేషనల్‌ ట్రాన్షిషనల్‌ కౌన్సిల్‌(ఎన్‌టిసి) ఆధ్వర్యంలో గడాఫీ హతమైనట్టు చెబుతున్నా దాని వెనక వున్నది నాటో అమెరికాలే. అరబ్‌ వసంతం పేరిట పలు అరబ్‌ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ప్రజ్వరిల్లినప్పుడు అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. తన చెప్పుచేతల్లో వుండే ఈజిప్టు అధ్యక్షుడు హౌస్నీ ముబారక్‌ పట్ల ఒక విధంగానూ లిబియా అధ్యక్షుడు గడాఫీ, సిరియా అధ్యక్షుడు అస్సాద్‌ పట్ల మరో విధంగానూ వ్యవహరించింది. గడాఫీ పాలనలో లోటుపాట్లు, ఆయన వ్యక్తిగత పోకడలు, నిరంకుశ పద్దతులను ఎవరూ సమర్థించనవసరం లేదు. కానీ అలాటి అభద్రతా వాతావరణాన్ని సృష్టించడంలో అమెరికా కూటమి పాత్ర చాలా వుంది. తమకు అనుకూలమైన నియంతలంతా వారికి మనోహరంగానే గోచరిస్తారు. అదే స్వతంత్రంగా వుండేవారైతే మాత్రం ఎక్కడ లేని ప్రజాస్వామ్య పాఠాలు గుర్తుకు వస్తాయి. సద్దాం హుస్సేన్‌ విషయంలో ఎన్ని కథలు వదిలారో ఎవరూ మర్చిపోలేరు. ఉగాండా అధ్యక్షుడు ఈదీ అమీన్‌ సంగతీ అంతే. కమ్యూనిస్టు నేతలపైన సోషలిస్టు శిబిరంపైన ప్రచ్ఛన్న యుద్ధం పేరిట ప్రత్యక్షయుద్ధమే సాగించిన సామ్రాజ్యవాదులకు తర్వాతి కాలంలో అరబ్‌ దేశాల నేతలు కంటిలో నలుసులయ్యారు. ప్రతిదశలోనూ ఎవరో ఒకరిని శత్రువుగా చూపిస్తూ వచ్చారు. ఆ క్రమంలో నాజర్‌, అరాఫత్‌, గడాఫీ, సద్దాం హుస్సేన్‌, బిన్‌లాడెన్‌ ఇలా.
గడాఫీ లోపాలోపాలపై చాలనే చర్చ జరిగింది. అయితే ఆయన హయాంలో లిబియా మానవాభివృద్ధి సూచికల్లో అరబ్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన సంగతీ గుర్తుంచుకోవాలి. ఇస్లామిక్‌ సోషలిజం వంటి అశాస్త్రీయ సూక్తులు చెప్పినా, పుట్టినప్పటి నుంచి విద్య, వైద్యం, గృహ వసతి వీటన్నిటినీ ప్రభుత్వం సహాయపడే సంక్షేమ వ్యవస్థ అక్కడ కొనసాగింది. చమురు సంపద విలువను ప్రజలకు తెలియజెప్పి దీన్ని మరెవరో హరించకుండా కాపాడుకోవాలన్న చైతన్యం వారిలో నింపినవాడు గడాఫీ. అలీనోద్యమంలోనూ ముఖ్య పాత్రధారిగా వుండి ఆఫ్రికా దేశాల ఐక్యత కోసం పరితపించాడు. సోషలిస్టు దేశాలతో సన్నిహితంగా నిలిచి సామ్రాజ్యవాదాన్ని సవాలు చేశాడు. ఒకప్పుడు కాస్ట్రో, అరాఫత్‌, వంటి పేర్లు తల్చుకోగానే గడాఫీ కూడా గుర్తుకు వచ్చేవాడు. పాలస్తీనా ప్రజలకు భూభాగం లేకుండా వేటాడుతున్న ఇజ్రాయిల్‌ జాత్యహంకారాన్ని నిర్ద్వందంగా ఖండించి ఆ ప్రజలకు తోడు నిలిచాడు. ఆ దాడులకు గురవుతున్న లెబనాన్‌ను బలపర్చాడు. 80 వ దశకంలో రీగన్‌, థాచర్‌ అభివృద్ధి నిరోధక దాడి పెరిగినప్పుడే లిబియాతో ఘర్షణ కూడా పెరిగింది. ఆ సందర్భంలో యూరప్‌లో ఒక హౌటల్‌పై దాడి చేశాడనీ, అమెరికా విమానం కూల్చివేశాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. (ఇవన్నీ ఉగ్రవాదులకు ప్రోత్సాహంగా అమెరికా దాడి చేస్తూనే వచ్చింది.) సద్ధాం హుస్సేన్‌పై కత్తి కట్టడానికి ముందే 1986లోనే అమెరికా లిబియాపై గడాఫీ నివాసంపై వైమానిక దాడులు చేసి ఆయన పెంపుడు కూతుర్ని చంపేసిందని మర్చిపోకూడదు. కాస్ట్రోపైన జరిగినట్టే గడాఫీపైనా ఎన్నో హత్యాప్రయత్నాలు జరిగాయి.వాటన్నిటి మధ్యనా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ నిలబడిన గడాఫీ సోవియట్‌ విచ్ఛిన్నానంతర ప్రపంచంలో వ్యూహం కొంత మార్చుకున్నాడు. విమానం పేల్చివేతకు కారకునిగా వారు ఆరోపిస్తున్న వ్యక్తిని అప్పగించాడు కూడా. మెత్తపడినట్టు కనిపిస్తూనే ఆత్మరక్షణ సామర్థ్యం పెంచుకున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ల దురాక్రమణ తర్వాత అమెరికా లక్ష్యం లిబియా,ఇరాన్‌ వంటి దేశాలేనని ఎప్పుడో స్పష్టమైంది. అయినా దౌత్య నీతితో గడాఫీ ప్రభుత్వం వారితో సంబంధాలు, సంప్రదింపులు నెరపుతూ నెట్టుకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని అడ్డుకునే పేరిట అమెరికా సృష్టించిన తాలిబాన్లు,అల్‌ ఖయిదా, బిన్‌లాడెన్‌ వంటి వారి ప్రాబల్యానికి గడాఫీ ఎప్పుడూ లోను కాలేదు. అయితే 9/11 నిందితులలో ఒకడైన అబ్దెలఖిమ్‌ బెల్వద్జీని 2003లో మలేషియాలో పట్టుకున్న సిఐఎ మరుసటి ఏడాది లిబియాకు అప్పగించింది. ఇది స్నేహపూర్వక కానుక అని అప్పట్లో చెప్పింది. గదాఫీ అతడ్ని కొంత కాలం ఖైదులో వుంచి ఉదార దృష్టితో విడుదల చేశాడు. బెల్వద్జీ లిబియా ఇస్లామిక్‌ ఫైటింగ్‌ గ్రూప్‌ (ఎల్‌ఐఎఫ్‌జి) పేరిట ఒక ఛాందస సంస్థను ఏర్పాటు చేసి గడాఫీపైనే దాడికి దిగాడు. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై పోరాటమే తన ప్రాణమని చెప్పే అమెరికా వత్తాసుతో నడిచే నాటో కూటమి వీరికి సహాయం చేసింది. ఇస్లామిస్టులు అధికారంలో వాటా పంచుకోవడాన్ని అనుమతించాలని గార్డియన్‌ పత్రిక రాసింది.
తక్కిన అరబ్‌ దేశాలతో పాటు లిబియాలోనూ తిరుగుబాటుకు ప్రయత్నం జరిగి కొంత పురోగమించినా గడాఫీ ఆయన కుమారుడు పూర్తిగా లొంగిపోకుండా ఆపగలిగారు. తమ చేజారిన రాజధాని ట్రిపోలీనీ, ఇతర ప్రాంతాలను అదుపులోకి తెచ్చుకోవాలనుకుంటే అందుకు అవకాశం ఇవ్వకుండా ఐరాస ముసుగులో అమెరికా అడ్డుపడింది. ఆగష్టు 21న నేరుగా నాటో దళాలు రంగ ప్రవేశం చేశాయి. క్వతార్‌ వారికి ఆయుధాలు సమకూర్చింది. ఏప్రిల్‌ 20న గడాఫీ నివాసాన్ని ధ్వంసం చేశారు. దాంతో గడాఫీ దళాలు ఆయన స్వస్థలమైన సిర్టేలో తలదాచుకోవలసి వచ్చింది.గడాఫీ భార్య పిల్లలు అల్జీరియాలో ఆశ్రయం పొందితే వారిపైనా బెదిరింపులు నడిచాయి. నో ఫ్లై జోన్‌ అంటూ తాము కోల్పోయిన రాజధానిని స్వాధీనం చేసుకోవడానికి విమానాలు వెళ్లడాన్ని నిషేధించి తాము మాత్రం ఆయన వున్న చోట దాడులు కొనసాగించారు. లిబియా హస్తగతమయ్యే రోజు దూరంలో లేదని నాటో ప్రధాన కార్యదర్శి బాహాటంగా ప్రకటించాడు. ఆగష్టు 30న ఐరాస లిబియాలో రాజకీయ భవితవ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి పది పేజీల ప్రణాళిక సిద్ధం చేసింది. గడాఫీ అదుపు కోల్పోయాడని ఒబామా ప్రకటించాడు. ర్వాండాలో మారణహోమం తర్వాత తాముగా సృష్టించిన రక్షణ నివ్వాల్సిన బాధ్యత అనే నిబంధనను అడ్డుపెట్టుకుని బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు 26 వేల విమాన దాడులు చేశాయి. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ స్వయంగా పర్యటించి గడాఫీ అనంతర లిబియాకు తమ సహాయం వుంటుందని తాయిలాలు ప్రకటించి సన్నాహాలు చేసి వచ్చారు.ఇంత జరిగినా ఎన్‌టిసి ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కేవలం నలభై దేశాలు మాత్రమే గుర్తించాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు చాలా వరకూ గుర్తించలేదు. ఆ దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం అమెరికా వ్యూహంలో కీలకాంశం. ఇందుకోసమే జర్మనీలో ఆఫ్రికాం పేరిట ఒక సంస్థను కూడా ఏర్పాటుచేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం అనబడే ఐసిసి గడాఫీని యుద్ధ నేరస్థునిగా ప్రకటించింది. అంతకు ుుందు సూడాన్‌ అధ్యక్షుడు ఒమర్‌ అల్‌ బషీర్‌నూ నేరస్తునిగా చేసింది. ఈ రెండు దేశాలు చమురుతో సంపన్నమైనవి కావడం ఇక్కడ బహిరంగ రహస్యం. ఇదే తరుణంలో ఇజ్రాయిల్‌ విమానాలు గాజా భూ ఖండంలో దాడులు చేసి 1400 మంది పాలస్తీనియన్ల ప్రాణాలు తీస్తే వీరికి నేరంగా కనిపించలేదు.
ఈ అష్ట దిగ్బంధం మధ్యన గడాఫీని వేటాడి చంపడం తథ్యమనే ప్రపంచం భావించింది. నో ఫ్లై జోన్‌ ఆంక్షలు ఆచరణలో గడాఫీని పట్టుకోండి(గెట్‌ గడాఫీ)గా మారాయని అంతర్జాతీయ పరిశీలకులు హెచ్చరించారు. క్యూబా ఐరాస వేదికపై ఈ దుర్మార్గాన్ని ఖండించింది. వెనిజులా అద్యక్షుడు హ్యూగో చావేజ్‌ గడాఫీని నిర్మూలించేందుకు జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆయనకు సంఘీభావం ప్రకటించారు. అయినా నాటో దేశాలు గడాఫీని హతమార్చడమే ఏకైక లక్ష్యంగా వేట సాగించాయి. ఇదంతా చమురు దాహం ఫలితమే. ఆఫ్రికా దేశాలలో 4.6 కోట్ల బ్యారెల్స్‌ చమురు నిల్వలున్నాయి. చమురు సంపన్న దేశాలైన సౌదీ అరేబియా, కువైట్‌,ఇరాక్‌, సూడాన్‌లు ఇప్పటికే అమెరికా చెప్పుచేతల్లో వుండగా ఇప్పుడు లిబియా కూడా వశమైంది. మిగిలింది ఇరాన్‌ ఒక్కటే. దానిపైనా అణ్వస్త్ర తయారీ పేరిట వత్తిళ్లు సాగుతూనే వున్నాయి. లిబియా కూడా అణ్వాయుధానికై ప్రయత్నాలు చేసిందన్న వార్తలు వున్నాయి. అంతర్జాతీయ వాతావరణాన్ని బట్టి వాటిని విరమించుకుంది. వాటిని సంపాదించివుంటే ఇలా జరిగి వుండేది కాదని కొందరి వ్యాఖ్య. అమెరికాకు తొత్తు వంటి పాకిస్తాన్‌ పాలకులు కూడా మాది అణ్వస్త్ర దేశం గనక తేలిగ్గా మాపై దాడి చేయలేరు అంటున్నారంటే రేపు మిగిలిన దేశాలు కూడా ఆ దిశలో ఆలోచించవచ్చునని దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాడూ బొంగరం లేని తిరుగుబాటు దళాల చేతిలో ఇప్పటికే లిబియా కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. లూటీలు రాజ్యమేలుతున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌ ఏ విధంగా ఆటవిక స్థితిలోకి దిగజారిపోయిందో గడాఫీ అనంతర లిబియా కూడా అంత అగమ్యంగా మారే అవకాశముంది. అప్పుడు అమెరికా కూటమి మరింత బాహాటంగా తలదూరుస్తుంది. ఇప్పటికే అక్కడ లాభాలు పోగుపోసుకోవడానికి బ్రిటన్‌,ఫ్రాన్స్‌లు ఆదరాబాదరాగా వున్నాయని రాయిటర్స్‌ కథనం. గతంలో రష్యా, చైనా, బ్రెజిల్‌ దేశాలతో గడాఫీ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసి ఆ సంపదను తమ అదుపులోకి తెచ్చుకోవడమే వాటి లక్ష్యం. గడాఫీ మంచి చెడ్డలు ఏమైనా అది లిబియా అంతర్గత వ్యవహారం. ఆ ప్రజలే నిర్ణయించుకోవాలి. అమెరికా నాటోల దుర్మార్గమైన జోక్యాన్ని గనక ఈ విధంగా సాగనిస్తే రేపు అన్ని దేశాల సార్వభౌమత్వాలకూ ముప్పు తప్పదు. గడాఫీ నియంత అనేవారు ప్రపంచ నియంత పైశాచికత్వాన్ని చూడకపోతే అది ప్రపంచమంతటికీ ప్రమాదం. 

No comments:

Post a Comment