Saturday, October 29, 2011





కోటా ఏదైనా... ఫీజు ఒక్కటే!
హైకోర్టు ధర్మాసనం తీర్పు
ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య కోటాలకు ఏకీకృత ఫీజు
సంబంధిత ప్రక్రియను ప్రారంభించాలని ప్రవేశ, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ)కి ఆదేశం
ఫీజులపై జారీ చేసిన జీవోలు 76, 77, 85, 86 కొట్టివేత
ఫీజు ఖరారుకు ఒక్కో విద్యా సంస్థలో ఒక్కో కోర్సుకయ్యే తలసరి వ్యయాన్ని ఏఎఫ్‌ఆర్‌సీ పరిగణనలోకి తీసుకోవాలి
తలసరి వ్యయాన్ని లెక్కించే సమయంలో ఆ విద్యాసంస్థ ఖర్చులను లెక్కేయాలి
తర్వాత ఏఎఫ్‌ఆర్‌సీ చెప్పిన మొత్తాన్నే ఫీజుగా పరిగణించాలి
దాన్ని ఆ నిర్దిష్ట విద్యాసంస్థ ఫీజుగా ప్రభుత్వం నోటిఫై చేయాలి
ఎన్నారై కేటగిరీలో అధికంగా వసూలు చేసే ఫీజును ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి
2010-11, 2011-12, 2012-13 విద్యాసంవత్సరాల
ఫీజు ప్రతిపాదనలను తాజాగా నోటిఫై చేయాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో కన్వీనర్, యాజమాన్య కోటాల కింద ఏకీకృత(ఒకే తరహా) ఫీజును ఖరారు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఏకీకృత ఫీజు ఖరారుకు అవసరమైన కసరత్తును ప్రారంభించాలని ప్రవేశ, ఫీజు నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ)ని నిర్దేశించింది. ఈ కళాశాలల్లో కన్వీనర్, యాజమాన్య కోటాల కింద ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 76, 85, 86తోపాటు దీనికి సంబంధించి ఏఎఫ్‌ఆర్‌సీ చేసిన సిఫారసుల తాలుకు జీవో 77ను కొట్టివేసింది. ఈ జీవోలు చట్టప్రకారం చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గోడా రఘురాం, జస్టిస్ పి.దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేటగిరీ-ఎ, కేటగిరీ -బి సీట్ల ఫీజు ఖరారుకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యా సంస్థలను కోరుతూ ఫీజు నియంత్రణ కమిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ.. జోసెఫ్ శ్రీ హర్ష మేరీ ఇంద్రజ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కె.వి.కె.రావుతో పాటు పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై ధర్మాసనం ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్, తెల్లప్రోలు చరణ్‌లు చేసిన పలు వాదనలతో ఏకీభవించింది. ఒక్కో విద్యా సంస్థకు ఒక్కో కోర్సుకయ్యే తలసరి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఏకీకృత ఫీజును ఖరారు చేయాలని ధర్మాసనం తన 102 పేజీల తీర్పులో ఏఎఫ్‌ఆర్‌సీని ఆదేశించింది. తలసరి వ్యయాన్ని లెక్కించే సమయంలో సదరు విద్యా సంస్థలో ఉన్న మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పెట్టిన పెట్టుబడులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాలు, భవిష్యత్ అభివృద్ధి కోసం ఉన్న మిగులు, నిర్వహణ, విస్తరణకయ్యే ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ విధంగా ఒక్కో విద్యా సంస్థ ఒక్కో కోర్సు తలసరి వ్యయాన్ని లెక్కించిన అనంతరం ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సు చేసినదాన్నే.. ‘ఫీజు’గా పరిగణించాలని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్దిష్ట విద్యాసంస్థ ఫీజుగా నోటిఫై చేయాలని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

ప్రతి విద్యా సంవత్సరంలో మార్చి మొదటివారానికల్లా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పింది. ఏదైనా ఒక వర్గానికి చెందిన విద్యార్థి విద్యకయ్యే ఖర్చును ప్రభుత్వం గ్రాంట్, లోన్, లేదా ఇతర పద్ధతుల ద్వారా భరించాలనుకుంటే, అందుకు ఓ విధానాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తెలిపింది. ఏదైనా ఒక విద్యార్థి ఫీజును మొత్తంగా గానీ, కొంత భాగంగా గానీ రద్దు చేయాలనుకుంటే.. దానిపై ఆ విద్యాసంస్థ ఓ విధానాన్ని రూపొందించుకోవచ్చునని పేర్కొంది. ఎన్నారై కేటగిరీ కింద చేరే విద్యార్థులకు ఏఎఫ్‌ఆర్‌సీ ఎక్కువ ఫీజును నిర్ణయించవచ్చునని , దానిని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాలని తెలిపింది. ఈ కేటగిరీ(కేటాయించిన సీట్లలో 15 శాతం మించకూడదు) కింద వసూలు చేసే ఫీజును ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఓ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, అయితే ఈ ఆదేశం ప్రభుత్వం లేదా ఫీజుల నియంత్రణ కమిటీ జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

తీర్పులో ముఖ్యాంశాలివీ..

ఒక విద్యార్థి నుంచి వసూలు చేసిన ఫీజుతో మరో విద్యార్థికి ఫీజు రాయితీ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. ఆ విధంగా ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సులు ఉండరాదు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేం. ఫీజు ఖరారు సిఫార్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం, దానిని నోటిఫై చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట విద్యా సంస్థ తలసరి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదు. అందువల్లే ఒక విద్యార్థి నుంచి వసూలు చేసిన ఫీజుతో మరో విద్యార్థికి ఫీజు రాయితీ కల్పించడం జరుగుతోంది.

ప్రతి ప్రైవేటు అన్ ఎయిడె డ్ విద్యా సంస్థలో ప్రవేశం పొందే విద్యార్థి నుంచి వసూలు చేసే ఫీజులో.. ఆ విద్యా సంస్థ తలసరి వ్యయం ప్రతిబింబించాలి.
ఎన్నారై కేటగిరీ కింద అధికంగా వసూలు చేసే ఫీజులను ఓ ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. దానిని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ప్రయోజనం కోసం ఉపయోగించాలి. ఈ మొత్తాలను ఏ విధంగా ఉపయోగించబోతోంది? ఎవరి కోసం ఉపయోగించబోతోంది తదితరాలను ప్రభుత్వం నోటిఫై చేయాలి.

విద్యార్థులు ఏ కేటగిరీ, బీ కేటగిరీలో ప్రవేశం పొందినప్పటికీ.. ఫీజు ప్రతిపాదనల కోసం నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో అన్ని కేటగిరీ విద్యార్థులకు ఏకీకృత ఫీజు ఉంటుందనే విషయాన్ని అందులో చేర్చాలి. ఎన్నారై కేటగిరీ విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేసే విషయాన్ని కూడా ప్రస్తావించాలి.
ఆదాయ, వ్యయాలు, ఆస్తిఅప్పుల పట్టీలు, జీతభత్యాలు, మౌలిక సదుపాయాల తాలూకు వివరాలను ఏదైనా విద్యా సంస్థ అందచేయకుంటే.. ఆ విద్యాసంస్థ ఎటువంటి ఫీజును వసూలు చేసుకునేందుకు అవకాశం లేదనే విషయాన్ని ఫీజుల నియంత్రణ కమిటీ కూడా తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనాలి. నోటిఫై చేసే సమయంలో ప్రభుత్వం ఇదే విషయాన్ని విధిగా రికార్డ్ చేయాలి.

వివిధ కోర్సుల్లో విద్యను అందించే విద్యాసంస్థల్లో ఫీజును ఖరారు చేసేందుకు ఫీజుల నియంత్రణ కమిటీ చేసే సిఫారసులను ప్రభుత్వం నోటిఫై చేయాలి. దీని వల్ల విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజుల నియంత్రణ కమిటీ ఫీజు ప్రతిపాదనలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఫీజు ఖరారు నోటిఫికేషన్ జారీ చేసే విద్యా సంవత్సరానికి ముందు ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఈ ప్రక్రియ జరగాలి.

వివిధ ప్రైవేటు అన్ ఎయిడెడ్‌విద్యా సంస్థల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించే ప్రక్రియను, తదానుగుణ బాధ్యతలను ఫీజుల నియంత్రణ కమిటీ ఔట్‌సోర్స్ చేయవచ్చు. తమకు వచ్చే ప్రతిపాదనలను, వాటి వివరాలను ఆ ఔట్‌సోర్స్ ఏజెన్సీ పత్రికా ప్రకటనల ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలి. విద్య సంస్థలు సమర్పించే ప్రతిపాదనల్లో లాభదాయకత ఉందా? తదితర అంశాలకు సంబంధించిన విషయాలను ఆ ఏజెన్సీ రికార్డ్ చేయాలి.

ఔట్‌సోర్స్ ఏజెన్సీలు తయారు చేసే నివేదిక, సిఫార్సు కాపీలను ఫీజుల నియంత్రణ కమిటీ ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు పంపి, ఫీజు ఖరారు ప్రతిపాదనలను ఆహ్వానించాలి. ఈ సమయంలో ఫీజు ఖరారు కోసం అవసరమయ్యే సమాచారాన్నంతా విద్యా సంస్థలు ఈ కమిటీకి అందచేయాలి.

ప్రభుత్వానికి సమర్పించే సిఫార్సులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏఎఫ్‌ఆర్‌సీ చర్యలు తీసుకోవాలి.
2010-11, 2011-12, 2012-13 విద్యా సంవత్సరాలకు ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు సమర్పించే ఫీజు ఖరారు ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పుడు తాజాగా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని అంశాలను పరిశీలించి, ఏదైనా సమాచారం కావాలనుకుంటే సదరు విద్యా సంస్థకు ఫీజుల నియంత్రణ కమిటీ నోటీసు జారీ చేసి మరీ తెప్పించుకోవచ్చు.

పరిశీలన పూర్తయిన తరువాత ఫీజు ఖరారుకు సంబంధించి తయారు చేసే సిఫార్సుల నివేదికలో ఫీజు వారీగా ప్రతి కోర్సుకయ్యే వ్యయాన్ని అందులో ప్రస్తావించాలి.

2010-11, 2011-12, 2012-13 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేయాలి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రక్రియను వీలైనంత వేగంగా ప్రారంభించాలి. నేటి నుంచి మూడు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి.

**********************************************************************************

చేతిలో 'కారు' చిచ్చు
'గులాబీ ఆకర్ష్'తో కాంగ్రెస్ అతలాకుతలం
ఒకే రోజు చెయ్యివ్వనున్న ముగ్గురు ఎమ్మెల్యేలు

పార్టీకి జూపల్లి, రాజయ్య, సోమారపు గుడ్‌బై!
నేడో రేపో 'కారు' ఎక్కడం ఖాయం
వద్దని ఎంపీలు వారించినా ససేమిరా
సోమారపుతో బొత్స మంతనాలు విఫలం
వారి బాటలోనే మరికొందరు శాసనసభ్యులు
హైదరాబాద్, అక్టోబర్ 29 : కాలచక్రం తిరగబడింది. ఒకప్పుడు కాంగ్రెస్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' తాకిడికి తల్లడిల్లిన టీఆర్ఎస్.. ఇప్పుడు ఆకర్ష్ గులాబీతో అదే కాంగ్రెస్‌ను అతలాకుతలం చేస్తోంది. నిన్నమొన్నటి దాకా టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రమే తమవైపు లాక్కుంటూ వచ్చిన గులాబీ దళాధిపతి కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించారు.

ఫలితంగా.. అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు 'కారు' ఎక్కబోతున్నారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించారు.

సకల జనుల సమ్మె ముగిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో ఈ ముగ్గురు శాసనసభ్యుల నిర్ణయం అధికార కాంగ్రెస్ పార్టీని కష్టాల్లో పడేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికిప్పుడు కొంప మునిగిపోయే ప్రమాదం లేకపోయినా, మున్ముందు వలసలు తీవ్రమైతే పార్టీ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారు, స్వతంత్ర సభ్యులు అధికారంలో ఉన్న పార్టీవైపు చూడటం, అందులో చేరే ప్రయత్నాలు చేయడం ఆనవాయితీ. కానీ, 'చేతి'లో మరో రెండున్నరేళ్లు అధికారం ఉండగా పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సిద్ధమవుతున్నారు.

వీరి బాటలోనే నడిచేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మరి కొంద రు నేతలు కూడా సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక మాజీమంత్రితో పాటు అతని అనుంగు ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు కూడా టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ వలసలు ఉధృతంగా ఉంటాయని వారంటున్నారు.

ప్రధానంగా వచ్చే నెల ఆరోతేదీ చాలా కీలకమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ రోజు నాటికి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు పతాకస్థాయికి చేరుకుంటాయని వారు వివరిస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీలోకి వస్తారంటూ టీఆర్ఎస్ ముఖ్యనేతలు ప్రకటిస్తున్నారు. ఈ మాటలకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. కాంగ్రెస్ నుంచి వలసలు ఉండబోవని సీఎం కిరణ్‌తో పాటు పీసీపీ చీఫ్ బొత్స కూడా భావిస్తూ వచ్చారు.

అయితే.. శనివారం ముగ్గురు ఎమ్మెల్యేల నిర్ణయంతో ఉలికిపాటుకు గురయ్యారు. ఈ సమాచారం తెలియగానే సోమారపు సత్యనారాయణతో పీసీసీ చీఫ్ బొత్స ఫోన్‌లో మాట్లాడారు. పార్టీకి గుడ్‌బై చెప్పే విషయం నేరుగా చెప్పకుండా పార్టీలో తనకు ఎదురవుతున్న కష్టాల గురించి బొత్సతో సోమారపు ఏకరువు పెట్టారు. కాగా.. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నివాసంలో శనివారం జరిగిన సమావేశంలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, మందా జగన్నాధం, వివేక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్యలకు శాసనసభ్యులు పార్టీని వీడుతున్న విషయం తెలిసింది.

అప్పుడే తొందర పడొద్దంటూ సోమారపును వారించేందుకు వివేక్ ప్రయత్నించినా, సోమారపు అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూపల్లి, సోమారపు, రాజయ్య తమ అనుచరులతో కలసి ఆదివారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తర్వాత నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకుంటారు. కాగా.. ఈ ముగ్గురు శాసనసభ్యులు గులాబీ కండువాను కప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని, కొంతకాలంగా పార్టీకి దూరమవుతారనే సంకేతాలను ఇస్తున్నారని కాంగ్రెస్‌నేతలు పేర్కొంటున్నారు.

అధినేతల వ్యవహార శైలి మారాల్సిందే
కాంగ్రెస్ పార్టీ నుంచి మరిన్ని వలసను నివారించాలంటే రాష్ట్ర అధినేతల వ్యవహారశైలి మారాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధానంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని పోవాలని అంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాము అధికార పక్షంలో ఉన్నా, పార్టీలో తగిన గుర్తింపు దక్కట్లేదన్న అసంతృప్తే వలసలకు ప్రధాన కారణమని కొందరు నేతలు చెబుతున్నారు.

నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు కాకపోవడం, నామినేటెడ్ పదవులు భర్తీకి నోచుకోకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పేరుకుపోయిందని కూడా వారు అంటున్నారు. మరికొందరు నేతలు మాత్రం ఈ వాదనతో ఏకీభవించ డం లేదు. తెలంగాణ వాదం ముందు అధికార, ప్రతిపక్షాలనే పదాలకు తేడాలేకుండా పోయిందని, ప్రత్యేక రాష్ట్ర వాదనను ఎక్కువగా వినిపించేవారి వెం ట వెళ్లడమే శ్రేయస్కరమన్న అభిప్రాయంతో నేతలు ఉన్నారని అంటున్నారు.

మొదటి నుంచీ ధిక్కారస్వరమే
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య మొదట్నుంచి తెలంగాణ కోసం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. పార్టీలో దూకుడుగా ముందుకు పోతూ తెలంగాణ నినాదాన్ని బలంగా వినిపిస్తున్న రాజయ్య తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పడానికే నిర్ణయించుకున్నారు. నిజానికి ఆయనతో పాటు ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచి ఆయన వెంట వెళ్తారనే ప్రచారం కూడా గతంలో జరిగింది. కానీ, ఇంతలో ఉద్యమం బలపడటంతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఇటీవల జేఏసీ పిలుపు మేరకు కాజీపేట రైల్వేస్టేషన్‌లో రైలురోకోలో పాల్గొన్నందుకు రాజయ్యపై కేసులు నమోదయ్యాయి. చివరకు ఆయన కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికి టీఆర్ఎస్‌లో చేరడానికి ముందుకు కదిలారు.

దీపావళి రోజే ప్రతిపాదన
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ దీపావళి రోజున తన అనుచరులతో సమావేశమై టీఆర్ఎస్ నుంచి వచ్చిన ప్రతిపాదనను వారి ముందుపెట్టారు. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్ ఉండకపోగా ఇబ్బందులు తలెత్తుతాయని, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైతేనే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్‌లో చేరాలనే ఆయన నిర్ణయించుకున్నారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా రామగుండం నుంచి గెలుపొందిన ఆయన వైఎస్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

సకల జనుల సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు ఇటీవల సమ్మె చేసినప్పుడు సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. సమ్మె విషయంలో తనపై సీఎం ఒత్తిడి తెచ్చారని బహిరంగంగా చెప్పారు. అప్పటినుంచే ఆయనకు కాంగ్రెస్ మంత్రులతో సంబంధాలు దాదాపు తెగిపోయాయి. రైల్‌రోకోలో పాల్గొనడంతో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఉద్యమంలో చురుగ్గా ఉండటంతో పాటు సొంతంగా బలమైన కేడర్ కలిగి ఉన్న వ్యక్తి కావడంతో టీఆర్ఎస్ కూడా ఆయనపై ఆసక్తి కనబరిచింది.
*******************************************************************
‘చెల్లింపు’ నేరాలకు చెంపపెట్టు
సంపాదకీయం
సమాజ పురోగమనంలో సామాన్యుడికి సైతం చోటివ్వడానికి... తన ఆకాంక్షలేమిటో, అవసరాలేమిటో... వాటిని తీర్చడానికి ఎలాంటి విధానాలు అవలంబించాలో అతడు తెలియజెప్పడానికీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానం అవకాశం ఇచ్చింది. అయితే, మన దేశంలో క్రమేపీ ఎన్నికలే ప్రజాస్వామ్యమనేంతగా పరిస్థితి మారిపోయింది. మరోపక్క జీవితంలోని అన్ని పార్శ్వాలనూ తాకవలసిన ప్రజాస్వామ్య విలువలు లుప్తమవుతూ వచ్చాయి.

పర్యవసానంగా ప్రజాస్వామ్య మూలస్తంభాలుగా భాసిల్లవలసిన వ్యవస్థలకు చీడపట్టడం మొదలైంది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించి మరింత తేజోవంతం కావలసిన ప్రజాస్వామ్యం ఇలాంటి లోటుపాట్లతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రజాభిప్రాయాన్ని ప్రబలంగా ప్రతిబింబించాల్సిన ఎన్నికలు ధన బలం, నేరగాళ్ల ప్రవేశంతో ప్రహసనప్రాయంగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతోంది. దీన్ని సరైన మార్గంలో నడిపించడానికీ, లోపరహితంగా మార్చడానికీ అసలు ప్రయత్నాలే జరగడం లేదనడం సత్యదూరమే అవుతుంది. అయితే, వీటిని వమ్ము చేయడానికి అక్రమార్కులు సాగిస్తున్న సృజనాత్మక ఆలోచనలకూ కొదవలేదు. పర్యవసానంగానే ‘పెయిడ్ న్యూస్’ (చెల్లింపు వార్తలు) అనే భూతం పుట్టుకొచ్చింది.

గత కొన్నేళ్లుగా ఎన్నికల విధానాన్నే పరిహసిస్తున్న ఈ భూతం పనిపట్టడానికి అటు ఎన్నికల సంఘం, ఇటు ప్రెస్ కౌన్సిల్, జర్నలిస్టు సంఘాలు నడుంకట్టాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ కూడా జరిగింది. మొదట ఏ దోవలో వెళ్లి దీన్ని అరికట్టాలన్నదానిపై మల్లగుల్లాలు పడిన ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను రూపొందించడంతోపాటు, ఎన్నికల సమయంలో ప్రత్యేక నిఘా యంత్రాంగం ఏర్పాటువంటి చర్యలు కూడా తీసుకుంది. కఠిన చర్యలకూ సంకల్పించింది. దీని ఫలితంగానే దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ విధానసభ సభ్యురాలు ఉమలేష్ యాదవ్‌పై అనర్హత వేటు పడింది.

డి.పి. యాదవ్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ పరివర్తన్‌దళ్ సభ్యురాలైన ఉమలేష్ రెండు హిందీ దినపత్రికల్లో తన గురించి గొప్పగా ‘రాయించుకుని’ అందుకు చెల్లించిన మొత్తాన్ని ఎన్నికల వ్యయంలో చూపలేదన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయమై ఆమె ప్రత్యర్థి అటు ప్రెస్ కౌన్సిల్‌కూ, ఇటు ఎన్నికల కమిషన్‌కూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిగింది. ప్రెస్ కౌన్సిల్ ఆమెపై ఇచ్చిన నివేదికను ఆమోదించిన ఎన్నికల కమిషన్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10-ఏ కింద ఉమలేష్‌ను దోషిగా నిర్ధారించింది. మూడేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా ఆమెపై నిషేధం వేటు వేసింది. అంటే, ఆమె మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదన్న మాట. జన బలం బొత్తిగా కొరవడి, కేవలం ధన రాజకీయాలు నడిపిస్తున్న శక్తుల వెన్నులో ఈ చర్య వణుకు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంతమందిలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సైతం ఉన్నారు. వీరిలో అశోక్ చవానైతే ఇలాంటి ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని బొంబాయి హైకోర్టుకెక్కి భంగపడ్డారు కూడా.

ఉమలేష్ యాదవ్ కేసులో ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ‘రాయించుకున్న’ వార్తలకు చెల్లించిన మొత్తాన్ని ఎన్నికల వ్యయంలో చూపకపోవడం ఒక్కటే ఆమె చేసిన నేరం కాదని, దానితోపాటు ఆ చర్య ద్వారా ఓటర్లను పక్కదోవపట్టించడం, మోసగించడంలాంటి నేరాలకు సైతం ఆమె పాల్పడ్డారని భావిస్తున్నట్లు సంఘం వ్యాఖ్యానించింది. పెయిడ్ న్యూస్ అనే భూతం ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమైనదో ఈ ఉత్తర్వు ద్వారా ఎన్నికల సంఘం అందరికీ తెలియజెప్పింది.

అయితే, ఇక్కడితోనే సంతృప్తిచెందితే ఎన్నికల్లో ధనబలాన్ని రూపుమాపాలన్న సమున్నత లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాదు. పెయిడ్ న్యూస్ ద్వారా ఆమె ఓటర్లను మోసగించారని, మభ్యపెట్టారని నిర్ణయానికొచ్చినప్పుడు అందుకు అవకాశం ఇచ్చిన మీడియా సైతం ఆ నేరాల్లో పాలుపంచుకున్నట్లే. ఈ వ్యవహారంలో ఆ రెండు పత్రికలూ ‘నైతిక విలువల ఉల్లంఘన’ నేరానికి పాల్పడ్డాయని ప్రెస్ కౌన్సిల్ అభిప్రాయపడటం గమనార్హం. వార్తకూ, వ్యాపార ప్రకటనకూ ఉండే వ్యత్యాసాన్ని చెరిపేసే ఈ వికృత పోకడ పర్యవసానాలు ఏమిటో గ్రహించగలిగిన ఏ మీడియా సంస్థ అయినా కాసుల కోసం ఇలా దిగజారదు.

మన జాతీయోద్యమం ప్రజాజీవన రంగంలోకి తీసుకొచ్చిన విలువలకు ఎడంగా జరగడంవల్లే ఇలాంటి అనర్థాలన్నీ సంభవిస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అందుకనుగుణంగా విధానాలను సవరించుకోని సంస్థల వైఖరి కూడా ఇందుకు దోహదపడుతోందని గుర్తించాలి. ఉదాహరణకు అభ్యర్థుల ఖర్చు పరిమితి విషయంలో ఎన్నికల సంఘం పాటిస్తున్న నిబంధననే తీసుకుంటే లోక్‌సభ అభ్యర్థికి రూ. 25 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థికి రూ. 10 లక్షలు నిర్దేశించారు. ఈ పరిమితికీ, వాస్తవానికీ మధ్య ఎంత తేడా ఉంటుందో ఎవరినడిగినా చెప్పగలుగుతారు. ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రతి సందర్భంలోనూ ఎన్నికల సంఘం నిర్వహించే అఖిలపక్ష సమావేశాల్లో వివిధ రాజకీయ పక్షాలు దీన్ని, మరికొన్ని సమస్యలనూ ప్రస్తావిస్తూనే ఉన్నాయి. మరి ఎన్నికల సంఘం పెద్దలు తక్షణ చర్యకు ఎందుకు ఉపక్రమించరు? మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను మనమే గౌరవించుకోకపోతే, వాటి క్షీణతలో భాగస్వాములమైతే ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ప్రజాస్వామ్య సౌధాన్ని మనమే కూల్చుకున్నట్లవుతుంది. మీడియా అయినా, రాజకీయ పక్షాలైనా, రాజ్యాంగ సంస్థలైనా దీన్ని గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.
*************************************************************************************************************

‘మనసుబావి’లో
లోపలే
మగ్గిపోకు, బుగ్గిగాకు
బాధల్ని బైటపెట్టి వ్యధల్ని పంచిపెట్టు
వెలుపలికిరా..
మూతపెట్టిందేది ముక్కిపోక తప్పదు
గాలాడక వెల్తురులేక..
‘మనసుబావి’లోని దిగులు తోడు
తోడుకై ఎదురుచూడు..
పసిడిదాచుకో, పచ్చనోటుదాచుకో
సమస్యలు, వైఫల్యాలు అవమానాలు కాదు...
కర్చిఫ్‌లో
మడ్చేయకు, ముడేయకు
ఇతరుల్తోనో ఇష్టుల్తోనో చెప్పుకో..
పాతుకుపోయిన నిరాశల్ని
పేరుకుపోయిన నిస్పృహల్ని
రహస్యం గానీయకు...
విజయాన్ని చెప్పినట్టే
గౌరవాల్ని చాటినట్టే
కడుపులోని పుట్టెడుదుఃఖాన్ని కూడా
కక్కేసులో...
కడ్గేసుకో...
మాయా మోహ జీవుడా
గుండె చీకటి బొయ్యారమైతే
మాట వెల్గవుతుందా?
దాక్కున్న వాడిముందు
లోపలితలుపుల్ని బద్ధలు చేయనివాడియందు
ఆనందం అవిరే...
ప్రాణసంకటంలోనూ పైకి మందస్మితమా?
ఘర్షణల్ని బైట పెట్టు...
ఆశల ఆకుల గుడిసెలో తలదాచుకున్నా
తేజోమయి శరీరంతో
కళ్ళల్లో కలువలు విరిసి విప్పారిన మొహంతో...
ఉజ్జ్వలకాంతితో...
- కోటం చంద్రశేఖర్‌

No comments:

Post a Comment