Sunday, October 30, 2011





‘దరిద్రగొట్టు’ ప్రభుత్వం ఇది!

విశ్లేషణ
వి.హనుమంతరావు
సీనియర్ పాత్రికేయులు






పేదలంటే ఎవరు అనే ప్రశ్నకు జవాబు అతిరథులు, మహారథులు, మేధావులు, ఆర్థికశాస్త్రవేత్తలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 62 ఏళ్ల తర్వాత కూడా జవాబు చెప్పలేకపోతున్నారు. స్థూల దృష్టితో చూసినా పేదలు ఎవరో ఇట్టే తెలుసు కోవచ్చు, కానీ మన సోకాల్డ్ మేధావులకు సూక్ష్మదృష్టి లేకపోగా, స్థూల దృష్టి కూడా కొరవడటం విచారకరం. పట్టణాల్లో మురికివాడలకు వెళ్లండి. గ్రామాలకు పోతే మనకు మనుషులు కాదు బొమికెల గూళ్లు, ఒంటిమీద బట్ట లేకుండా వీధుల్లో ఆడుకొనే పిల్లలు, కేవలం రెండే రెండు చీరలతో కాలం వెళ్లబుచ్చే స్త్రీలు కొల్లలుగా కనిపిస్తారు. కానీ ప్రభుత్వం దృష్టిలో వారంతా పేదవాళ్లు కాకపోవచ్చు. అందుచేత వాళ్లెవరో లెక్కలు తీయమని ఛప్పన్నారు కమిటీలు వేశారు.

దేశానికి స్వాతంత్య్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అధ్యక్షునిగా, కె.టి.షా కార్యదర్శిగా ఒక కమిటీని వేయ టంతో ప్రారంభమై స్వాతంత్య్రానంతరం, ప్రధాని నెహ్రూ నియ మించిన నిపుణుల కమిటీ, దండేకర్ అండ్ రథ్, పి.వి. సుఖాత్మే, నేషనల్ సాంపిల్ సర్వే సంస్థ, ప్రణాళికా సంఘం, డి.టి.లక్డావాలా కమిటీ, అర్జున్‌సేన్ గుప్త కమిటీ, టెండూల్కర్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్... ఇవికాక ఇంకా అనేక పరిశోధనా సంస్థలు, ఎన్జీవోలు పేదరికం అనే కొండను తవ్వుతూనే ఉన్నాయి. వీళ్లంతా కలిసి చేసిన ఘనకార్యమేమంటే సమస్యను మరింత క్లిష్టతరం చేస్తూ వచ్చారు. ఈలోగా పేదరికం పెరిగిపోతూనే ఉంది. కుబేరులైనవారు మరింతగా కుబేరులై పోతున్నారు.

వాళ్లంతా కలిసి పేదరికపు రేఖ అనే గీతను సృష్టించారు. అది ఆకుకందదు. పోకకు పొందదనే విధంగా తయారై పేదరికం సమస్యను పక్కనపెట్టి రేఖను ఎక్కడ గీయాలనే రంధిలో పడ్డారు. 1971లో ఎం.దండేకర్, రథ్ అనే ఇద్దరు ఆర్థికశాస్త్రవేత్తలతో ఏర్పరచిన కమిటీ రెండుపూటలా తిండి తినలేని వాడే పేదవాడని నిర్వచించింది. దురదృష్టమేమంటే మానవుడన్న తర్వాత కేవలం తిండి గింజలతోనే బతకలేడని, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఆరోగ్యం, చదువు, రెండు పూటలా తినడానికి కావాల్సిన తిండి గింజలను కొనుక్కోవడానికి ఉపాధి వంటి మౌలిక అంశాల గురించి వారు ఆలోచించక పోవడం. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ప్రభుత్వ ఆలోచనలు, ఆర్థిక శాస్త్ర వేత్తల సూత్రీకరణలు ఈ పరిధిని దాటలేదు. అది దాటనంత కాలం పేదరి కంతో దేశం రాజీపడక తప్పదు.

ఇలాంటి కప్పదాటు ఫార్ములాలతో పేదరికం పోదు. డా. మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గృహవసతి కల్పించడానికి ఇలాంటి ఫార్ములానే ఎంచుకున్నారు. పేదవారి గృహవసతి కల్పన కోసం ప్రతి కుటుంబానికి రూ.400 ఇచ్చి, దగ్గర్లో ఉన్న అడవుల్లోంచి తాటాకులు, వెదుళ్లు తెచ్చుకొని ఇల్లు నిర్మించుకోమన్నారు. పోనీ ఆ పాక నిర్మించుకోవడానికి స్థలం చూపించలేదు. రికార్డుల్లో మాత్రం ఇన్ని లక్షల మందికి గృహ వసతి కల్పించామని ప్రచారం చేసుకొంది ప్రభుత్వం. అలాగే గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణం కోసం గ్రామాలకు గ్రామాలనే నేలమట్టం చేసి నిర్వాసితులను ఫలానా చోట ఇల్లు కడతాం, అక్కడికి వెళ్లమ న్నారు. మౌలిక సదుపాయాల కల్పన గాలికి వదిలేశారు. పేదరికం తగ్గిపోయిం దని చెప్పే లెక్కలన్నీ ఇలాంటివే.

రెండు పూటలా తిండి అంటే ఏమిటి? ఎంత? అనే ప్రశ్న దండేకర్-రథ్ కమిటీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థను అడిగితే మనిషి బతకడానికి కనీసం 2,250 కేలరీల శక్తినిచ్చే ఆహారం అవసరమని చెప్పింది. ఆ ఆహారంలో ఎటువంటి పోషక పదార్థాలుండాలి, వాటిని సమకూర్చుకోవాలంటే ఎంత డబ్బు అవసరమవుతుందో లెక్కలువేసి, మార్కెట్లో వాటి ధరలు సేకరించి, ఇదిగో ఇంత ఆదాయం ఉండాలని అన్నారు. దీనికి దారిద్య్రరేఖ అనే పేరు పెట్టి, ఈ మేర కూడా ఆహారం తినలేని వారు పేదలు అని నిర్ధారించారు. ధరలు పెరిగిన మేరకు పేదరిక రేఖను కూడా పెంచుతూ వచ్చారు.

ఈ సూత్రాల ఆధారంగా, ఈ ఆదాయం ఆధారంగా ప్రతీ గ్రామంలో, పట్టణంలో పేద కుటుంబాలను గుర్తించి వారికి కార్డులివ్వాలి, చౌక ధరల దుకాణాల ద్వారా వారికి నియమిత ఆహార ధాన్యాలను సరఫరా చేయాలి ఈ దుకాణాలు ఎంత సవ్యంగా నడుస్తున్నాయో, ఈ కార్డుల పంపకం ఎంత అపసవ్యంగా నడుస్తున్నదో, స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయంతో ఎలా భ్రష్టుపట్టిందో తెలిసిందే. ఒకే ఒక ఉదాహరణ. జాతీయ సలహా సమితి (దీనికి సోనియా గాంధీ అధ్యక్షురాలు) సభ్యుడు ఎన్.సి.సక్సేనా పంపిణీ విధానం లోపభూయిష్టంగా ఉందని చెబుతూ స్వయంగా ప్రణాళికా సంఘమే పేదరిక రేఖ కింద ఉన్న వారిని తొలగించటం లేదా చేర్చటంలో 60 శాతం దాకా తప్పొప్పులున్నాయన్న విషయాన్ని అంగీకరించిందని గుర్తు చేశారు. ఫరీదాబాద్‌లో ఒక స్త్రీ వద్ద 925 రేషన్ కార్డులున్న వైనాన్ని ప్రణాళికా సంఘం నిర్ధారణ చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ భారతీయులు మరీ ఎక్కువగా తింటున్నారని, అందువల్లే ధరలు పెరిగాయనే దారుణమైన ప్రకటన చేయటం, ఆ ప్రకటనను రాజకీయ పార్టీలు ఖండించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘ప్రభుత్వ పథకాల వల్ల పేదల ఆదాయం పెరిగిపోయిన ఫలితంగానే ధరలు ఆకాశమార్గం పట్టాయి’’ అనే ప్రకటన భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ కార్యాలయం చేయడం విశేషం. భారత ప్రధానికి అమెరికా పాలకులకు ఎంత సామీప్యత! ఆలోచనల్లో ఎంత ఏకత్వం! నగరాలు, పట్టణాల్లో రోజుకు కేవలం రూ.32, పల్లెల్లో రూ.25 వెచ్చించేవారు పేదలు కాదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ ఆహ్లువాలియా ఇటీవల ఒక కొత్త సత్యం కనిపెట్టి దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం యూపీఏ ప్రభుత్వ భావ దారిద్య్రానికి అద్దం పట్టింది.

2011లో పేదరికపు రేఖను 2001లో జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించడమేమిటని సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయటం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. మరో విషయం. సామాజిక సంక్షేమ పథకాల కోసం చేసే ఖర్చును తగ్గించాలని, పేదలకిచ్చే సబ్సిడీల్లో కోత విధించాలని పారిశ్రామిక వేత్తల సంఘాలు, కార్పొరేట్లు పాలకుల చెవినిల్లు కట్టుకొని ఒత్తిడి తీసుకొనివస్తున్నారు. అసలు చేసిన కేటాయింపులే పూర్తిగా ఖర్చు చేయటంలేదు. చేసే ఖర్చు ఫలితాలు పేదలకు అందటంలేదని మంత్రులే అంగీకరిస్తున్నారు. అలాం టప్పుడు ఆ ఖర్చు తగ్గిస్తేనేగాని అభివృద్ధి సాధ్యం కాదని సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య పోటీ పెడుతున్నారు. ప్రభుత్వం మనుగడే వారి మీద ఆధారపడిన నేపథ్యంలో పేదలకు కన్నీరు, సంపన్నులకు పన్నీరుగా ప్రస్తుత పరిస్థితి తయారైంది.

ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఉత్సా పట్నాయక్ ప్రకారం 2,400-2,100 కేలరీల కొలబద్ద ప్రకారం దేశ జనాభాలోని 84 కోట్ల మంది ప్రజలు అంతకన్నా తక్కువే తింటున్నారు. ఇంతమంది పేదరికానికి కారణమైన ఆర్థిక విధానాలను సవరించకుండా, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయకుండా, అవినీతిని అరికట్టకుండా, నిరుద్యోగాన్ని తగ్గించకుండా పేదరికం తగ్గే ప్రశ్నేలేదు. పేదరికమనేది ఆర్థిక, శారీరక, మానసిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయపరమైనదని మన రాష్ట్ర ఆర్థిక శ్రాస్తజ్ఞులు ప్రొఫెసర్ ఎం.ఎల్.కాంతారావు అంటున్నారు.

ఐక్యరాజ్య సమితి ప్రమాణాల ప్రకారం ఎస్సీల్లో 81 శాతం, ఎస్టీల్లో 6 శాతం, బీసీల్లో 58 శాతం, ఇతరులలో 33 శాతం జనం పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ గణాంకాలను ప్రభుత్వం కూడా బొత్తిగా కాదనటం లేదు. అయితే దెబ్బ ఒకచోట తగిలితే, మందు మరోచోట రాస్తే నొప్పి తగ్గదు. అలాగే గణాంకాలతో రకరకాల కసరత్తులు చేసి, అవసరమైతే పేదలకు డబ్బిచ్చి చేతులు దులిపేసు కుందామని ప్రభుత్వం తలపోస్తున్నది. దానికైనా పేదల గుర్తింపు అంటూ జరగాలికదా! ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలకు పుట్టిన బిడ్డ పేదరికం. పేదరికం పోవాలంటే ప్రజలకు ఉపాధి కల్పించాలి. వారి చేతుల్లో డబ్బుంటే, వస్తువులకు, ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. దేశ ఆర్థిక పరిస్థితి అప్పుడు దానికదే మెరుగవుతుంది.

ఆర్థిక సంక్షోభం అనే సుడిగుండంలో మన దేశం, దేశ పాలకులు చిక్కు కొని ఉన్నారు. భారతదేశమే కాదు, అమెరికా, యూరోపియన్ దేశాలతో సహా ప్రపంచ దేశాలన్నీ అదే పరిస్థితిలో ఉన్నాయి. 2008 నాటి సంక్షోభం మన దేశాన్ని అలలా తాకింది గాని తన్నలేదని సంతోషిస్తుంటే ప్రస్తుత ఆర్థిక మాం ద్యం దేశాలన్నిటితోసహా మన దేశాన్నీ కుంగదీస్తున్నది. మన దేశానికి పరిమి తమై చూసుకుంటే మన ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయ రంగం ఇటు ప్రజలను అటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రైతాంగం రాష్ట్రంలో తాజాగా క్రాప్ హాలిడే ప్రకటించారు గాని, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పటి నుంచి వ్యవసాయం నిరాదరణకు గురవుతూ వస్తున్నది.

ఉదాహరణకు సాగుభూమి విస్తీర్ణం 2000-01లో 121.05 లక్షల హెక్టార్ల నుంచి 2008-09లో 122.83 లక్షల హెక్టార్లకు పెరిగినా, ఉత్పత్తి మాత్రం అదే కాలంలో 196.81 లక్షల టన్నుల నుంచి 234.47 లక్షల టన్నులకు, ఉత్పాదకత 1,626 కిలోల నుంచి 1,909 కిలోలకు పెరిగింది. తలసరి లభ్యత కూడా రోజు కు 418.2 గ్రామాల నుంచి 444 గ్రామాలకు పెరిగింది. అయినా రైతాంగానికి పెద్దపీట వేయకపోవటం మాట అటుంచి, ఉన్నదంతా ఊడ్చి పారిశ్రామిక రం గానికి దారాదత్తం చేసి రైతన్నను కళ్లనీళ్ల పర్యంతం చేస్తున్నారు. రైతు అప్పో సప్పో చేసి, కల్తీవిత్తనాలు, కల్తీఎరువులు, ప్రకృతి బీభత్సాలనెదుర్కొంటూ పుష్కలంగా పండిస్తుంటే, పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి.

ఇటీవల గోధుమ ధర బాగానే పెంచారు కాని, బియ్యం ధర ప్రకటించాల్సి ఉం ది. ఆహార ధాన్యాల లభ్యత పెరుగుతోంది. కాని, పేదలకు లభ్యతే కొరుకుడు పడని సమస్యగా ఉండిపోయింది. కనీసం పంపిణీ వ్యవస్థను కూడా సరిదిద్ద లేని చచ్చుపుచ్చు ప్రభుత్వం మనలను పరిపాలిస్తోంది. ఒక రకంగా చూస్తే వాళ్లను అధికారంలోకి పంపించి, మన ఓటరు మహాశయులే తప్పు చేశారేమోన నిపిస్తుంది. వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించగలిగితే ఏ సంక్షోభమూ మన దరి దాపులకు కూడా రాదన్నది యూపీఏ సర్కార్ గుర్తిస్తే బాగుంటుంది. 



************************************************************





తగ్గిన మొగ్గు
మారుతున్న మేజిక్ ఫిగర్స్
కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆధిక్యం

ముగ్గురు ఎమ్మెల్యేలు గుడ్‌బై
టీఆర్ఎస్ గూటికి జూపల్లి, సోమారపు, రాజయ్య
అంతం కాదిది ఆరంభం.. క్యూలో మరింతమంది
మా పార్టీ కాదు.. కాంగ్రెస్సే టీఆర్ఎస్‌లో విలీనమవుతుంది
కిరణ్‌తో కుమ్మక్కు కాకుంటే చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలి
మేం మద్దతు ఇస్తాం.. లేకపోతే ఆయన తెలంగాణ ద్రోహే
పోలవరం టెండర్ల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా పంజా విసిరారు. అసలే అత్తెసరు మెజారిటీతో అధికారంలో నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌ను ఊహించని దెబ్బ కొట్టారు. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను గులాబీ గూటిలోకి చేర్చుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే టి.రాజయ్య ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారితో పాటు అనుబంధ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి కారెక్కేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్.. అటు ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబులకు సవాళ్లు విసిరితే.. గులాబీ తోటలోకి చేరిన ఎమ్మెల్యేలు తెలంగాణ మంత్రులనే లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణలో పార్టీ తమను అనాథలను చేసిందని, పార్టీ జెండా పట్టుకుని తిరిగే పరిస్థితి లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఆత్మహత్యలకు సోనియానే కారణమని నిందించారు. ప్రజల పక్షమా? పదవుల పక్షమా? అనే విషయాన్ని కాంగ్రెస్ తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తేల్చుకోవాలని హితవు పలికారు. రాజీనామాలు చేసి వారంతా ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని, లేకపోతే ప్రజలే వారిని నిలదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణను తెచ్చుకునే చిత్తశుద్ధి ఉంటే మంత్రులు పదవుల్లో ఎలా కొనసాగుతారని నిలదీశారు.


హైదరాబాద్, అక్టోబర్ 30 : మొగ్గు తగ్గుతోంది. ఇప్పటికే అత్తెసరుగా ఉన్న పాలక కాంగ్రెస్ బలం క్రమక్రమంగా తగ్గుతోంది. సీఎం కిరణ్ సర్కార్ డేంజర్ జోన్‌లోకి వెళుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీ సాధించి నెట్టుకొస్తున్న పాలక కాంగ్రెస్‌కు తొలుత వై.ఎస్.జగన్ రూపంలో సవాళ్లు ఎదురవగా.. ఇప్పుడు టీఆర్ఎస్ రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం ఒక్క రోజే కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. మరో ఎమ్మెల్యే ఆకస్మికంగా మరణించారు.

ఈ పరిణామం కాంగ్రెస్‌కు గుబులు పుట్టిస్తోంది. అసెంబ్లీలో తమ బలం క్రమంగా 'మేజిక్ ఫిగర్' కంటే తక్కువ స్థాయికి పడిపోతుందేమోనన్న ఆందోళన పాలకపక్షంలో ప్రారంభమైంది. దీంతో.. నష్ట నివారణ చర్యలపై ఇటు సీఎం కిరణ్, అటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దృష్టి సారించారు. నిజానికి.. 2009 ఎన్నికల్లోనే వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీతో బయటపడింది. వైఎస్ మరణానంతరం జగన్ రూపంలో కాంగ్రెస్‌కు సవాళ్లు ఎదురైనా కూడా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీని తనలో విలీనం చేసుకుని కాంగ్రెస్ ఊపిరి పీల్చుకోగలిగింది.

పఆర్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ కొంత కుదుటపడినట్లు కన్పించినా.. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అధికార పార్టీలో మళ్ళీ అలజడి రేపుతున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో.. కిరణ్ సర్కారు భవితపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల బాటలోనే మరి కొందరు కూడా కాంగ్రెస్‌ను వీడే పక్షంలో అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కన్నా దిగజారికిరణ్ సర్కార్ బలం పడిపోయే ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. మంత్రి పదవిని వీడిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వంటి మరి కొందరు కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి తమ పార్టీలో చేరతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి కూడా. వీటన్నింటి నడుమ.. డిసెంబర్ 3లోగా ఏర్పాటు చేసే శాసనసభ శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి కిరణ్ ప్రభుత్వానికి తప్పదేమోనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే.. రాజకీయంగా తనకు ప్రయోజనం ఉంటుందో లేదో? స్పష్టం కానప్పుడు.. బల నిరూపణ ముగ్గులోకి కిరణ్ సర్కార్‌ను లాగి.. ప్రభుత్వాన్ని పడగొట్టేంత సాహసానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఒడిగడుతుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఈ సందేహమే కిరణ్ సర్కారుకు ఊరట.

జగన్ వర్గం ఎటు వైపు నడిచేను?
శనివారం వరకు శాసనసభలో కాంగ్రెస్ బలం 155గా ఉంది. వీరికి తోడు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతూ వచ్చారు. అంటే ఇండిపెండెంట్లతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి శనివారం వరకు 158 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్న ఆ ముగ్గురు స్వతంత్రులలో రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్‌కు దూరమై.. ఆదివారం టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. మరో శాసనసభ్యుడు రాజేశ్వర్‌రెడ్డి అకాల మరణం పొందారు. ఇప్పుడు ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ మాత్రమే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు.

కాగా.. కాంగ్రె స్‌కే చెందిన జూపల్లి కృష్ణారావు, టి.రాజయ్య కూడా ఆదివారం టీఆర్ఎస్‌లో చేరడంతో స్వతంత్రులతో కలుపుకొని అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 154కు పడిపోయినట్లయింది. అయితే.. పీఆర్పీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు చెందిన ఏడుగురు సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. వీరిని కూడా కలుపుకొంటే మొత్తం 178 ఎమ్మెల్యేల మద్దతు కిరణ్ సర్కార్‌కు ప్రస్తుతం ఉన్నట్లవుతుంది. అయితే.. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్‌లో వైఎస్ పేరును ప్రస్తావించినందుకు గాను 25మంది కాంగ్రెస్ శాసనసభ్యులు జగన్‌కు మద్దతుగా లోగడ రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే.

అదే విధంగా తెలంగాణవాదానికి కట్టుబడి ఇద్దరు ఎమ్మెల్యేలు కొండా సురేఖ, సత్యవతి కూడా రాజీనామా సమర్పించారు. జగన్ వర్గానికి చెందిన జయసుధ ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. పీఆర్పీకి చెందిన ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కూడా జగన్ వెంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్‌లోని జగన్ వర్గం ఎమ్మెల్యేల పాత్ర ఇక కీలకం కానుంది. ఎలాగంటే.. జగన్ వర్గంగా చెబుతున్న కాంగ్రెస్‌లోని 28 మంది ఎమ్మెల్యేలు సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాసంపై ఓటేసే పక్షంలో పాలక పార్టీ బలం 178 నుంచి 150కి పడిపోతుంది. కాంగ్రెస్‌కే చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య కూడా పార్టీని వీడే పక్షంలో పాలక కూటమి బలం మేజిక్ ఫిగర్ అయిన 148కి చేరుకుంటుంది.

అలాంటి సమయంలో ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు దూరమైనా సర్కారు పుట్టి మునగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అంటే.. కాంగ్రెస్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. జగన్ వర్గం ఎమ్మెల్యేలు కూడా సర్కారు పుట్టి ముంచాలని దృఢంగా నిర్ణయిస్తే కిరణ్ ప్రభుత్వానికి ముప్పు తప్పకపోవచ్చు. అయితే.. జగన్ వర్గంగా పేరొందిన ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆయన వెంట నిలుస్తారనేది వేచి చూడాల్సిన అంశం. కాగా.. జగన్ గ్రూపుగా పేరు బడిన కొంతమంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పటికే చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.

సీఎం తీరుపై కాంగ్రెస్ నేతలు ఫైర్
అధికారంలో ఉన్నప్పుడు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలు విపక్షాల్లోకి వలస వెళ్లడం విడ్డూరమన్న వాదన కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. శాసనసభలో అధికారానికి, అనధికారానికి నంబర్ గేమ్ ప్రధానమని తెలిసినప్పటికీ అధికార పక్షం నుంచి ఎమ్మెల్యేలు ఎగిరిపోకుండా చూసుకోవడంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ప్రాధాన్యమివ్వడంలేదన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో ఉంది.

పార్టీలోని కీలక నేతల అనైక్యతే ఇందుకు కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ప్రభుత్వ చీఫ్‌విప్ పదవి నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్నప్పటికీ దానిని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపడంలేదన్న విమర్శలు ఉన్నాయి. అదే విధంగా శాసనసభ్యుల్లో నెలకొన్న అసంతృప్తిని తెలుసుకునే ప్రయత్నాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం చేయడం లేదని పార్టీ నేతలు వాపోతున్నారు.

"శాసనసభ్యులను బిజీగా ఉంచడంలో భాగంగా శాసనసభా కమిటీలను వేయడం, అధ్యయనం కోసం వారిని వివిధ ప్రాంతాలకు పంపించడం వంటి చర్యలను సీఎం చేపట్టడం లేదు. ఇటీవలి కాలంలో శాసనసభ్యులతో ఇటు సీఎం గానీ, అటు పీసీసీ అధ్యక్షుడు గానీ సమావేశాలను నిర్వహించిన దాఖలాలే లేవు. పార్టీలోని తెలంగాణ ఎమ్మెల్యేల్లో అంతకంతకు పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నాలు జరగకపోవడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం'' అని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు రాజయ్య, సోమారపు సత్యనారాయణ వ్యవహారాన్ని వారం రోజులకిందటే వరంగల్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాజయ్యతో విడిగా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేయాలని సూచించారు. జూపల్లి, సోమారపు సత్యనారాయణలతో కూడా మాట్లాడాలని చెప్పారు.

అయితే ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరగలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే.. మున్ముందు మరిన్ని వలసలు తప్పవని.. కాంగ్రెస్ సర్కారు మైనార్టీలో పడే ప్రమాదం ఉందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగి.. భవిష్యత్తులో అవిశ్వాస తీర్మానం కనుక వస్తే ప్రతిపక్షాల శాసనసభ్యులు ఇప్పటికే స్పీకర్ ముందుంచిన రాజీనామాలు ఆమోదించి తద్వారా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవడం మినహా మరో గత్యంతరం సర్కారుకు లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సర్కారును కూల్చేందుకు టీడీపీ సిద్ధమవుతుందా?
కాంగ్రెస్ గూటి నుంచి ఎమ్మెల్యేలు చేజారి పోయినా కూడా.. 'కిరణ్ సర్కార్ బల నిరూపణ' ఎదుర్కోవడం అన్నది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీపై ఆధారపడి ఉంటుంది. సర్కారుకు వ్యతిరేకంగా శాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే కిరణ్ ప్రభుత్వ భవితకు ముప్పు ఎదురవుతుంది. అయితే.. అసెంబ్లీ శీతాకాలం సమావేశాల్లో రైతు సమస్యలపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.

దీనికితోడు రాజకీయంగా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో టీడీపీపై ఒత్తిడి ఉంది. అయినప్పటికీ.. సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ నిజంగా ప్రవేశపెడుతుందా? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సీమాంధ్రలో జగన్‌కు, తెలంగాణలో కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టి... ప్రభుత్వాన్ని పడగొట్టే టంతటి సాహసం చేస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచే గాకుండా కాంగ్రెస్‌లోనూ వినిపిస్తున్నాయి.

"ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు పడిపోయి.. ఎన్నికలొస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్ బలం పుంజుకుంటుంది. సీమాంధ్రలో జగన్ లబ్ధి పొందుతాడు. కాబట్టి.. మాకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా ప్రభుత్వాన్ని పడగొడితే.. దానివల్ల మా ప్రత్యుర్థులకే లాభం'' అని టీడీపీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

అయితే.. టీడీపీకే చెందిన మరికొంత మంది మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూసి విసిగి వేసారిన ప్రజలు తప్పకుండా తమకు తప్పకుండా పట్టంకడతారని కొంత మంది టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడంపై టీడీపీ ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోని ప్రస్తుత పరిస్థితుల్లో.. కిరణ్ సర్కార్‌కు తక్షణ ప్రమాదమేదీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
***********************************************************************************







  • అధికారులకు సిఎం ఆదేశం
వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులను దారుణంగా హత్య చేసిన ఉన్మాదులపై వెంటనే విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. యువకులు ఇలాంటి హత్యలకు పాల్పడడం సరైంది కాదని, వారి భవిష్యత్‌ అంధకారంగా మారుతుందని అన్నారు. మృతి చెందిన స్వాతి, రఫియా అనే విద్యార్థినుల కుటుంబాలకు సిఎం ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు సిఎం కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

********************************************************************************

భారత్‌లో సాంస్కృతిక సంఘర్షణ
ఉత్తరాది, దక్షిణాది మధ్య పెరుగుతున్న దూరం
దక్షిణాదిలో పడిపోతున్న జనాభా పెరుగుదల రేటు

బెంగళూరు, అక్టోబర్ 30: ప్రపంచ జనాభా సోమవారంతో 700 కోట్ల మార్కును చేరబోతోంది. అదే సమయంలో, భారతదేశం విచిత్ర సమస్యలతో సతమతమవుతోంది. కూలీల వలస, ఇతర సామాజిక అంశాల కారణంగా జనాభా విషయంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య దూరం పెరుగుతోంది. ఫలితంగా దేశంలో సాంస్కృతిక సంఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని బెంగళూరులోని ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఛేంజ్ (ఐఎస్ఈసీ)లో పాపులేషన్ రిసెర్చి సెంటర్ అధిపతి ప్రొఫెసర్ కేఎస్ జేమ్స్ విశ్లేషించారు.

"ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే, దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా పడిపోతోంది. ఫలితంగా, దక్షిణాదిలో కూలీల కొరత పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వలసలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటున్నారు'' అని తెలిపారు. ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్‌లోనే ఉన్నారని, ప్రపంచ జనాభా గతిని నిర్దేశించే స్థానంలో వారు ఉన్నారని ఆయన వివరించారు. జనాభా పెరుగుదలపై అవగాహన కల్పించేందుకే గతంలో ఇటువంటి సందర్భాలను ఉపయోగించుకునేవారని, కానీ, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆసక్తికర అంశాలు తెరపైకి వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

2011 జన గణనలో దేశంలో జనాభా పెరుగుదలకు సంబందించి ఉత్తరాది, దక్షిణాది మధ్య స్పష్టమైన విభజన ఉందని, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా పడిపోతోందని, అసంఘటితరంగ కూలీల కొరత పెరుగుతోందని వివరించారు. వివిధ రాష్ట్రాల మధ్య జనాభాలో స్పష్టమైన విభజన, నిరుపేద కూలీల వలస దేశంలో మరింత సంఘర్షణకు కారణమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2011 జనగణనలో ఆరేళ్లలోపు వయసు చిన్నారుల పెరుగుదల రేటు తగ్గిన నేపథ్యంలో ఈ శతాబ్దం రెండో అంకానికి వచ్చే సమయానికి భారత జనాభా 160-180 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషించారు.

కొన్ని రాష్ట్రాల్లో వయోజనుల నుంచి వృద్ధుల వయసు ప్రధానంగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో యువత వయసు ప్రధానంగా ఉందని, వీటిని పరిగణనలోకి తీసుకునే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను నిర్ణయించుకోవాల్సి ఉందని వివరించారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరగడం, పెళ్లికి ముందు కలిసి ఉండేవారి సంఖ్య ఎక్కువ కావడం తదితరాలు పాశ్చాత్య దేశాల్లో ఆర్థిక, జనాభా మార్పులకు కారణమని, కానీ, అవే విషయాలు భారత్‌లోకి ఎలా చొచ్చుకొచ్చాయన్న విషయం ఆసక్తికరమని విశ్లేషించారు. సాంస్కృతిక, మతపరమైన కారణాలతో జనాభాలోని ఇతర వర్గాలు ఇటువంటి వైఖరిని అంగీకరించడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.

'మేమిద్దరం, మాకిద్దరు' విధానానికి లింగ వివక్ష కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోందని, సమాజంలో మహిళలకు సమానస్థాయి కల్పించే విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయని, భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. కూలీల వలసతో సానుకూలతలు కూడా ఉన్నాయని, ఏ దేశ జనాభా మార్పులకైనా వలసలే ప్రధాన పాత్ర పోషిస్తాయని విశ్లేషించారు. విచిత్రం ఏమిటంటే.. అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి వలసల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆధారపడుతుంటే.. భారతదేశంలో రాష్ట్రాల మధ్యే ఇటువంటి విభజన రావడం విశేషమని వివరించారు.

ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాల్లోలా కాకుండా.. అక్షరాస్యత, ఆర్థికంగా ఎటువంటి ప్రగతి లేకుండానే భారత్‌లో సంతానం విషయంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నిరక్షరాస్య, నిరుపేద మహిళలు ఇద్దరు బిడ్డలకే ఓటు వేస్తున్నారని వివరించారు. ఫలితంగా, తమ పిల్లలకు మంచి విద్య చెప్పించాలన్న కోరిక వారిలో పెరుగుతోందని, కార్మిక శక్తిలోకి మహిళల సంఖ్య పెరుగుతోందని, దీర్ఘకాలంలో ఇది సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషించారు.

కుటుంబ నియంత్రణ ప్రచారంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, నిరుపేద, నిరక్షరాస్య మహిళలు చిన్న కుటుంబమనే విధానానికి ఓటేయడం రాష్ట్ర ప్రభుత్వాల విజయమని అభివర్ణించారు. ఇప్పటికీ జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు కుటుంబ నియంత్రణపై దృష్టి సారించాలని, గత పదేళ్లలో భారత్‌లో పట్టణ జనాభా గణనీయంగా పెరిగిందని వివరించారు.
*******************************************************************************************************

No comments:

Post a Comment