Tuesday, October 18, 2011


తన ఉనికిని కాపాడుకొనేందుకు కాంగ్రెస్ ఆడుతున్న ప్రమాదకర అట - మత పరమైన రిజర్వేషన్లు

మతపమైన రిజర్వేషన్లు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం. వందల సంవత్సరాలుగా సమాజంలో వివక్షకు గురైన వారిని మిగతా సమాజంతో పాటు అభివృద్ధి చేయాలనే ఉన్నత లక్ష్యంతో రిజర్వేషన్లు ఏర్పాటు చేయబడినవి. ఆ లక్ష్యాన్ని విస్మరించి, తమ రాజకీయ అవసరాలకు తగిన విధంగా రిజర్వేషన్లను ఉపయోగించుకోవాలని రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలు కూడా రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో ఉంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు మాత్రమే ఇవ్వదలచుకున్నాము, అందరికీ కాదు అనేది ప్రభుత్వ వాదన. అయితే బీసీ కోటాలో వెనుకబడిన ముస్లింలకు ఇప్పటికే రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. దానిని పెంచవచ్చు కదా! రాజకీయ నాయకులూ అందుకు సిద్ధంగా లేరు. ఉన్నవి పోకుండా కొత్తవి ఎలా సాధించుకోవాలా అని నాయకుల ఆలోచన.

మతపరమైన రిజర్వేషన్లు మతపరమైన నియోజక వర్గాల ఏర్పాటుకు దారి తీయవా? దాని వలన జాతీయ సమైక్యతకు భంగకరం కాదా?

2012 సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. పేరు పొందిన రాజకీయ పార్టీలన్నిటికీ తమ భవిష్యత్తు ఆ ఎన్నికల ఫలితాల పైనే ఆధారపడి ఉన్నదని తెలుసు. అందుకే కాంగ్రెస్ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.

సచార్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లింల కోసం అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. వాళ్ళ రక్షణ కోసం మతపరమైన హింసను నిరోధించేందుకు ఒక చట్టం చేయబోతున్నది.

దళితులకు ఇచ్చే రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకూ వర్తింపచేసేందుకు ప్రయత్నం చేస్తున్నది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కూడా ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించే ఆలోచన చేస్తోంది. మొత్తం మీద దేశంలోని కాంగ్రెస్ ను చూసి మిగతా పార్టీలు కూడా ఈ మత రిజర్వేషన్ల పాచికను ఉపయోగిస్తున్నాయి. ఇవి దేశ ప్రజల్లో విబేధాలు నిర్మాణం చేసేందుకు దారి తీస్తాయి. ఏమైనా రాజకీయ నాయకులకు స్వప్రయోజనాలే ముఖ్యం.



****************************************************

తెలంగాణ ఖాయం.. వేచి చూడండి
శీతాకాల సమావేశాల్లో బిల్లు పెడితే మద్దతిస్తాం
లేదంటే 2014లో మేమే ప్రత్యేక రాష్ట్రం ఇస్తాం

కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది
సకల జనుల సమ్మె దేశ చరిత్రలోనే అపురూపం
బీజేపీ అగ్రనేత అద్వానీ ఉద్ఘాటన
రాష్ట్రంలో ప్రవేశించిన జన చేతన యాత్ర
ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మంచి స్పందన
నేడు (బుధవారం) హైదరాబాద్‌లో బహిరంగ సభ
నిజామాబాద్, ఆదిలాబాద్, అక్టోబర్ 18 : " ప్రత్యేక రాష్ట్రం తప్పక ఇస్తాం. ఓపిగ్గా ఉండండి. కాంగ్రెస్ ఇవ్వకుంటే 2014లో అధికారంలోకి రాగానే మేమే ఇస్తాం'' అంటూ తెలంగాణ ప్రజలకు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ హామీ ఇచ్చారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తెలంగాణ బిల్లు పెడితే తమ పార్టీ తప్పక మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. సకల జనుల సమ్మె తీవ్రత, తాజాగా వెలువడిన బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాలను చూసైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

అంతకుముందు.. అవినీతికి వ్యతిరేకంగా అద్వానీ కొనసాగిస్తున్న జన చేతన రథయాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర సరిహద్దుల గుండా ఆదిలాబాద్ జిల్లా డొలాన (పెన్‌గంగా) గ్రామానికి చేరుకున్న ఆయనకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆదిలాబాద్, ఇచ్చోడ,నిర్మల్‌లోనూ, నిజామాబాద్, బుస్పాపూర్‌లోనూ జరిగిన రోడ్ షోలు, బహిరంగ సభల్లో అద్వానీ ప్రసంగించారు. ప్రతిచోట తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు.

ప్రజలతో జై తెలంగాణ.. జై జై తెలంగాణ నినాదాలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వాస ఘాతుకాన్ని ఎండగట్టారు. రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించి, అంతలోనే వెనుకంజ వేయడంవల్లే యువకులు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2012లోనే తెలంగాణ చూడాలనే కోరిక ఉన్నదని, లేదంటే 2014లో తమ పార్టీయే అధికారంలో వచ్చి, రాష్ట్రం ప్రకటిస్తుందని భరోసా ఇచ్చారు. బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు అద్దం పట్టిందన్నారు.

"మూడున్నర దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక, అభివృద్ధికి నోచుకోలేక కష్టనష్టాలు పడ్డారు. ఆ అసహనం, ఆక్రోశంలోంచి వారు సాగిస్తున్న ఉద్యమం సమర్థనీయం. 36 రోజులుగా చేస్తున్న సకల జనుల సమ్మె వారి ఆకాంక్షకు ప్రతిరూపం. దేశచరిత్రలోనే అది అతి సుదీర్ఘమైన గొప్ప ఉద్యమం. ప్రజాస్వామ్యబద్ధ నిరసనలతో తమ ఆకాంక్షను వెల్లడించడం అపురూపం. అభినందనీయం'' అని శ్లాఘించారు. తొలినుంచీ తమ పార్టీ తెలంగాణకు సానుకూలంగానే ఉన్నదని చెప్పారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణపై ప్రభుత్వం ప్రైవేట్ బిల్లు పెడితే మద్దతు ఇస్తామన్నారు.

అవినీతి అంతం వరకూ పోరాడతా
ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి దేశంగా భారత్‌ను యూపీఏ ప్రభుత్వం మార్చివేసిందని అద్వానీ ధ్వజమెత్తారు. ఇంత అవినీతి సర్కారును తన జీవితంలోనే చూడలేదన్నారు. అవినీతి అంతమొందే వరకు పోరాటం చేస్తానని అద్వానీ పేర్కొన్నారు. ఈ విషయంలో పౌర సమాజం నిస్సహాయంగా పడిఉంటే భావి తరాలకు అన్యాయం చేసిన వారమవుతామని చెప్పారు. విదేశీ బ్యాంకుల్లో కుప్పలు పడిన నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తే నవ భారత నిర్మాణం పెద్ద కష్టం కాదన్నారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని వెలికి తియ్యగలిగితే ప్రపంచంలోనే మనదేశం అగ్రస్థానానికి ఎదిగే అవకాశం ఉందని వివరించారు.

ఈ దిశగా ప్రజలను చైతన్యవంతులను చేసి అవినీతిపై యుద్ధానికి సమాయత్తం చేయడమే తన యాత్ర లక్ష్యమన్నారు. అసమర్థ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాగా, సకల జనుల సమ్మె జరిగిన తీరుపై కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటనారాయణ ఆధ్వర్యంలోని బృందం అద్వానీకి విజ్ఞాపన పత్రం సమర్పించింది. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నేతలు అనంత్‌కుమార్, రవిశంకర్ ప్రసాద్, అద్వానీ కూతురు ప్రతిభా అద్వానీ, రాష్ట్ర నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, లక్ష్మణ్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రావుల రాంనాథ్, దుర్గం రాజేశ్వర్, జి.శ్యాంసుందర్, నివేదిత వజే తదితరులు పాల్గొన్నారు.

నేడు హైదరాబాద్‌కు యాత్ర
హైదరాబాద్ : అద్వానీ రథ యాత్ర బుధవారం హైదరాబాద్ చేరనుంది. బీజేపీ అగ్రనేత రాక సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. యాత్ర గురించి వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బండారు దత్తాత్రేయ తదితరులు విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు.
**********************************************************************************************************
కాంగ్రెస్‌పై ‘కారు’ వల
kcrfహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్‌కు ‘చెయ్యి’చ్చేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఆ పార్టీ నాయకత్వానికి కలవరం కలిగిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌కు అధిష్టానం అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగతో ఉన్న నాయకులు ‘కారె’క్కేందుకు రెడీ అవుతున్నారనే ఊహాగానాలు మొదలవుతున్నాయి. అయితే ఇవన్నీ కేసీఆర్‌ ప్రచార జిమ్మిక్కులో భాగమేనని కాంగ్రెస్‌ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే రోజూ తనతో టచ్‌లో ఉండే నేతలతో కేసీఆరే ఈ నాటకం ఆడిస్తున్నారన్న అనుమానం కూడా పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.

తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం తలొగ్గకపోగా ఇటీవలి రైల్‌ లోకోలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీలపై సీరియస్‌ చర్యలకు పాల్పడటంతో అవాక్కయిన ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు కారు వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టి-కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీలో కీలకపాత్ర పోషిస్తోన్న ఒక ఎంపీతో పాటు ఉద్యమంతో కీలకంగా వ్యవహరిస్తోన్న మరో ఎంపీ గులాబి కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరే కాకుం డా మరో 4గురు తెలం గాణ ప్రాంత ఎమ్మేల్యేలు సైతం కారెక్కేందుకు అంతా సిద్దం చేసుకుని ముహూర్తం కోసం వేచిచూస్తోన్నట్లు తెలిసింది.

కాంగ్రేస్‌ అధిష్ఠానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రజలు భావిస్తున్నందున వారి దృష్టిలో తెలంగాణ ద్రోహులుగా మిగిలి రాజ కీయ జీవి తాన్ని ఫణంగా పెట్టే బదులు, తెలంగాణ కోసం పోరాడుతున్న పార్టీగా ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తో జతకడితే కలిగే అదనపు రాజకీయ ప్రయోజనాలపెనే దృష్టి సారిస్త్నునట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉన్న వరం గల్‌, కరీంనగర్‌లకు చెందిన శాసన సభ్యులతో పాటు ఇద్దరు ఎంపీలు టీఆర్‌ఎస్‌తో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగు తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో వీరు ఎప్పటికప్పుడు టీఆర్‌ఎస్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు చేస్తోన్న సకల జనుల సమ్మెకు టీి-మంత్రులు సహకరించడంలేదని, వారు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి తొత్తులుగా వ్యవహరి స్తున్నారని అధికార పార్టీకి చెందిన టీి- ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆరోపిస్తున్నారు. టీి-స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ జానారెడ్డి తెలంగాణ ఉద్యోగులను సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేయడం వెనుక సీఎం హస్తం ఉందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రైల్‌రోకోలో పాల్గొన్న టీ-కాంగ్రెస్‌ ఎంపీలపై ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించడం, వారిని జైళ్లలో పెట్టడంపై టి-మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోవడంతో ఉద్యమంలో తాము ఒంటరి అయ్యామనే భావన ఎంపీలలో మొదలయింది. తమను తామే కాపాడుకోలేకపోయిన ఎంపీలు ప్రజలకు ఏమేరకు తెలంగాణపై మనోస్థైర్యం కలిగిస్తామనే భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటివరకు తెలుగుదేశంపై అవలంబించిన విమర్శల దాడిని ఇకపై కాంగ్రెస్‌కు బదలాయించాలని నిర్ణయించడం వ్యూహాత్మకమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్‌తో ఇక తెలంగాణ రాదని నిర్ణయానికి వచ్చిన కేసీఆర్‌, ఇకపై డైరెక్ట్‌గా కాంగ్రెస్‌ను అటాక్‌ చేయాలని పొలిటికల్‌ జేఏసి సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే టిడిపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న విషయాన్ని టి-కాంగ్రెస్‌ నేతలు గుర్తుచేసుకుంటున్నట్లు సమాచారం.
తాజాగా నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కీ తెలంగాణ పాధనకు బీజేపీతో కలసి పనిచేస్తానన్న మధుయాష్కీ ప్రకటనతో ఖంగుతిన్న నాయకత్వానికి టీఆర్‌ఎస్‌లో మరికొందరు ప్రజాప్రతినిధులు చేరతారన్న వార్తలు సహజంగానే కలవరం కలిగిస్తున్నాయి.

అధిష్ఠానం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించొద్దంటూ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ గులాంనబీ ఆజాద్‌, సీనియర్‌ నాయకులు ప్రణబ్‌ చేసిన సూచనలతో పాటు పిసిసి అధ్యక్షుడి ఆదేశా లను టీి-కాంగ్రెస్‌లోని కొందరు నేతలు భేఖాతర్‌ చేయడం వెనుక టీఆర్‌ఎస్‌ హస్తం ఉందని తెలుస్తోంది. ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతలు జాక్‌లో చేరడానికి వీల్లేదని, కేంద్రంలోని యూపిఏ సర్కార్‌ కు ఎంపీల నెంబర్‌ ఫిగర్‌ అవసరం కావడంతో ఈ అవకాశాన్ని పావుగా వాడుకుని ఎంపీలు తెలంగాణపై మరింత గొంతు పెంచాలని టీఆర్‌ఎస్‌ సూచిస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌పై విసిరిన వలగా భావిస్తున్నారు.

తెలంగాణపై కాంగ్రెస్‌ వేలితోనే కాంగ్రెస్‌ కన్నును పొడవాలని, దీని ద్వారా తన రాజకీయ ప్రాభవం పెంచుకోవాలని కేసీఆర్‌ ఒక స్థిరమైన వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
అయితే.. ఇవన్నీ కేసీఆర్‌ చేసే లీకు రాజకీయాల్లో భాగమే తప్ప మరొకటి కాదని కాంగ్రెస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈవిధంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల్లో అభద్రతా భావం పెంచి, వారిని తన వైపు మళ్లించుకునే వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌ మీడియా ద్వారా లీకులు ఇస్తున్నారని అంచనా వేస్తున్నారు.

మొన్నటి వరకూ టీడీపీపై ఇలాంటి వ్యూహమే అనుసరించి సఫలమయ్యారని, ఇకపై తమ పార్టీ విషయంలోనూ అలాంటి వ్యూహమే అనుసరించాలన్నది కేసీఆర్‌ ఎత్తుగడగా కని పిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీ నుంచి అంతమంది బయటకు వెళ్లడం అంత తేలిక కాదంటున్నారు.

No comments:

Post a Comment