Sunday, August 28, 2011

విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదు

AP Samachar - 13/August/2011
Andhra Bhoomi (A Telugu Daily)
ఆంధ్ర భూమి

వెల్లడించిన 107 ఏళ్ల ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడు
August 12th, 2011
వారణాసి, ఆగస్టు 11: దశాబ్దాలు గడుస్తున్నా.. ఎన్ని కమిటీలు, కమిషన్లు వేసినా.. ఎన్ని పుస్తకాలు ప్రచురితమైనా.. నేతాజి సుభాష్ చంద్రబోస్ చనిపోయారా? జీవించి ఉన్నారా? చనిపోతే ఎలా చనిపోయారు? అనే మిస్టరీ మాత్రం వీడడంలేదు.
అయితే నేతాజి స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ (ఎహెచ్‌ఎఫ్)లో చేరిన తర్వాత నాలుగేళ్ల పాటు ఆ యోధునికి అత్యంత సన్నిహితంగా మెలిగిన నిజాముద్దీన్ అనే వ్యక్తి మాత్రం నేతాజి విమాన ప్రమాదంలో చనిపోలేదని నమ్మశక్యంగా చెబుతున్నారు. విశేషమేమిటంటే ‘నేతాజి మరణం’పై నియమించిన ఏ కమిటి కాని కమిషన్ కాని ఇప్పటికీ జీవించి ఉన్న నిజాముద్దీన్‌ను కలుసుకుని వివరాలు సేకరించలేదు. 107 ఏళ్ల నిజాముద్దీన్ ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లా బిలారియాగంజ్ సమీపంలోని ఇస్లాంపుర గ్రామంలో జీవిస్తున్నారు. ఇటీవల స్థానికంగా గల ఒక సంస్థ వలంటీర్లు నిజాముద్దీన్‌ను సన్మానించారు. 1942లో ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరిన తాను నేతాజి వద్ద డ్రైవర్‌గా బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. 1945లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజి చనిపోలేదని నిజాముద్దీన్ పేర్కొంటున్నారు. ఈ విమాన ప్రమాదం జరిగిన మూడు నాలుగు నెలల తర్వాత తాను స్వయంగా కారులో నేతాజీని తీసుకెళ్లానని ఆయన చెప్పారు. బర్మా, థాయిలాండ్ సరిహద్దుకు సమీపంలోని సిటాంగ్‌పూర్ నది ఒడ్డున తాను నేతాజిని వదలిపెట్టానని వివరించారు. అలాంటప్పుడు అంతకుముందే జరిగిన విమాన ప్రమాదంలో నేతాజి ఎలా మరణిస్తారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే నది ఒడ్డున తాను వదలిపెట్టిన తర్వాత ఏమైందనేది తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. నేతాజితో పాటే ఉంటానని తాను అప్పుడు బలవంతం చేశానని, కాని, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక తిరిగి కలుస్తానని హామీ ఇచ్చి వెళ్లిపోవాలని నేతాజి తనను ఆదేశించారని నిజాముద్దీన్ చెప్పారు. తర్వాత తాను నేతాజిని కలుసుకోలేకపోయానని, ఆయనకు అత్యంత సన్నిహితుడైన స్వామి (పూర్తి పేరు ఎస్.వి.స్వామి)ని మాత్రం తిరిగి కలుసుకుని పదేళ్లకు పైగా అవుతోందని తెలిపారు. స్వామి ఎప్పటికప్పుడు నేతాజితో సంప్రదింపులు జరుపుతుండేవారని వెల్లడించారు.
నిజాముద్దీన్‌కు ఇచ్చిన రిపాట్రియేషన్ సర్ట్ఫికెట్ ప్రకారం.. రంగూన్‌లోని పూర్వ ఆజాద్ హింద్ ఫౌజ్, దాని సంబంధిత సంస్థల ‘రిలీఫ్ అండ్ రిపాట్రియేషన్ కౌన్సిల్’కు చైర్మన్‌గా స్వామి వ్యవహరించారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌తో నిజాముద్దీన్‌కు గల అనుబంధాన్ని వెల్లడించే ఏకైక పత్రం అతని వద్ద ఉన్న రిపాట్రియేషన్ సర్ట్ఫికెట్. 1969లో భారత్‌కు తిరిగి వచ్చిన నిజాముద్దీన్ ధాక్వా గ్రామంలోని పూర్వీకుల ఇంట్లో కొంత కాలం ఉన్నారు. తర్వాత ఇస్లాంపురకు చేరుకున్నారు.

No comments:

Post a Comment