Saturday, August 27, 2011

‘దొరలు’ ప్రసాదించిన వారసత్వం!

అదిగో అక్కడ నిలుచున్న వాడు....
ఆత్మను హత్యచేసి
ఆవురావురమని ఆరగిస్తున్నాడు,
ఇది తన దేశమని, ఇది తన సంస్కృతి అని
మదిలో ఎన్నడూ భావించనివాడు వాడు!
మాతృభక్తి మమకార జ్వాల రగలని గుండెలవాడు వాడు!
పరభూములపై పరుగులు తీసి
పాదాలను కాల్చుకుంటున్నాడు...
ఇది సర్ వాల్టేర్ స్కాట్ అన్న ఆంగ్ల మహా రచయిత కవితకు ఆంధ్రరూపం. దేశభక్తికీ జాతీయతకు ఇది తిరుగులేని ప్రతీక! ఇంతకంటే సముత్కర్షమైన ఆలోచనలను ఆవిష్కరించిన మహనీయులు మన దేశంలో కూడ ఉన్నారు, స్కాట్ పుట్టడానికి పూర్వం లక్షల ఏళ్లుగా ఉన్నారు! కానీ మన దేశంలో అంకురించి పల్లవించి పరిమళించిన ఉదాత్త భావాలన్నీ జాతీయ విస్మృతికి గురికావడం, బ్రిటిష్ వారు మప్పిన మాటలను మాత్రమే చిలకపలుకుల్లా మనం వల్లె వేయడం 1947 ఆగస్టు 15వ తేదీన అవతరించిన స్వాతంత్య్ర నేపథ్యం! ఇటీవల జరిగిన అరవై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేదికల మీద , మాధ్యమాలలోనూ ప్రసంగించిన వారిలోను, ప్రదర్శించిన వారిలోను అత్యధికులు మరోసారి వల్లె వేశారు. ‘‘్భమే మాతర్నిధేహిమామ్ భద్రయా సుప్రతిష్ఠతు’’ - నేలతల్లీ మమ్ము సంరక్షించు, భద్రంగా జీవించడానికి వీలు కల్పించు!- అన్న అనాది వేదవాక్యంలో ఆధునికులకు జాతీయత కాని, దేశభక్తి కాని కనిపించని స్థితి మన స్వాతంత్య్ర అవతరణకు నేపథ్యం! భారతీయ భాషా రచనలలో అర్ధగజం పొడవైన ఆంగ్ల భాషా ఉటంకింపులను చొప్పించినచో, ‘‘అబ్బో ఎంతగొప్ప పండితుడో!’’ అని రచయితను అందరూ మెచ్చుకోవడం సంప్రదాయమై కూర్చుంది. ఇంగ్లీషులో వ్రాసిన రచనలలో మాత్రం తెలుగు అక్షరంకాని, భారతీయ భాషలలోని పదంకాని చొరబడడానికి వీలు లేదట! సామాజిక విజ్ఞాన శాస్త్రాల సంగతి సరేసరి! తెలుగు తదితర భారతీయ భాషా సాహిత్యాల గురించి పరిశోధన చేసి ‘డాక్టరేట్ల’ను పుచ్చుకున్న వారి సిద్ధాంత గ్రంథాలను తిలకించండి, మన సాహిత్యరీతుల మూలాలు మన దేశంలోకాని, స్వజాతీయ మాతృభాష అయన సంస్కృత సాహిత్యంలోకాని ఉండవు... ఐరోపాలో ఉంటాయి. ‘‘బేకిన్ ఏమన్నాడంటే’’, ‘‘జాన్సన్ ఏమన్నాడంటే’’, ‘‘అర్నాల్డ్ ఏమన్నాడంటే’’ ‘‘ టింబక్టూలోని రంబక్టూ ఏమన్నాడంటే’’- అంటూ మొదలుపెట్టి, మన సాహిత్యభాషా చరిత్రలను ఐదారు శతాబ్ద్దుల సంకుచిత పరిధిలోకి కుదించేస్తారు. అంతకు పూర్వం నాటి భారతీయులు ఏమన్నారో మాత్రం పాఠకులకు, విద్యార్థులకు ఈ పరిశోధకులు తెలియనివ్వరు!
పదజాలాన్ని ప్రయోగించడంలో విచ్చలవిడితనం కొనసాగుతున్న స్వాతంత్య్ర వైపరీత్యం! మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రసారమాధ్యమాలలో ఈ వైపరీత్యం మరింతగా దృశ్యమానమైంది. మన దేశంలో వివిధ భాషలు, ప్రాంతాలు, మతాలు, వేషభాషలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలను వివరించిన వక్తలు, ప్రయోక్తలు పనిలో పనిగా మన దేశంలో ‘‘వివిధ జాతులు, వివిధ సంస్కృతులు’’ కూడ ఉన్నట్టు వీక్షకులకు శ్రోతలకు ‘బోధించారు’! దేశంలో అనేక భాషలు, మతాలతోపాటు ‘‘అనేక దేశాలు కూడ’’ ఉన్నాయని చెప్పడం ఎంత అర్థరహితమో దేశంలో ‘‘ భిన్న సంస్కృతులు , భిన్న జాతులు’’ ఉన్నాయని చెప్పడం కూడ అంతే అనర్థసహితము! దేశంలో భిన్నత్వాలు, వైవిధ్యాలు అనేకం ఉన్నప్పటికీ ‘‘ఉత్తరం యత్ సముద్రస్య... హిమాద్రిశ్చైవ దక్షిణం’’ ఉన్న ప్రాంతమంతా అనాదిగా ఒకే జాతి అని , భాషలు, మతాలు, రాజ్యాలు, జనపదాలు, మరెన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ ఈ మొత్తం జాతిది ఒకే సంస్కృతి అని వేలాది ఏళ్లుగా స్వదేశీయులు మాత్రమేకాక విదేశీయులు సైతం అంగీకరించిన వాస్తవం. అలాంటప్పుడు భిన్న జాతులు - డిఫరెంట్ నేషన్స్ -, భిన్న సంస్కృతులు - ఢిఫరెంట్ కల్చర్స్ - ఉన్నాయన్న మాటలు ఎలా మన నోళ్లనుండి వెలువడుతున్నాయి?? పాశ్చాత్యులు ‘పాలించిన’ సమయంలో మన దేశంలో ‘ఆర్యులు’, ‘ద్రావిడులు’ అన్న రెండు జాతులు ఉన్నట్టు ప్రచారమైంది! ఒకే భారత జాతిని ముక్కలు చేసే కుట్రలో భాగం ఇది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ‘ఒకేజాతి, ఒకే సంస్కృతి’ - ఒన్ నేషన్, ఒన్ కల్చర్ - అన్న మాటలు ప్రచారమయ్యాయి. కానీ కాలక్రమంలో మళ్లీ ‘‘్భన్న జాతులు,్భన్న సంస్కృతులు’’ అంటూ ఊకదంపుడు మొదలైపోయింది.
మతం పేరుతో జాతులను ఏర్పాటుచేసుకున్న కారణంగానే యుగాలనాటి అఖండ భారతం రెండుగా, మూడుగా స్వాతంత్య్రం వచ్చిన నాడే ముక్కలైపోయింది. పాకి స్తాన్‌లో అల్పసంఖ్యాక మతాల నిర్మూలన జరిగిపోయింది! కానీ ఇప్పుడు భాషల పేరుతో కూడా జాతులను ఏర్పాటుచేస్తున్నారు. మాతృభాషలపట్ల మమకారం ఉండడం మహోత్కృష్టమైన ఆదర్శం. కానీ మాతృభాషల మమకారం ప్రాతిపదికగా దేశంలోని వివిధ భాషా జన సముదాయాలను ‘జాతులు’గా ప్రచారం చేయడం ఏక జాతీయతా స్ఫూర్తికి విరుద్ధం. కానీ అధిక శాతం మేధావులకు ఈ ధ్యాస ఉన్నట్టు లేదు. ‘తెలుగుజాతి’ అంటున్నారు. ‘తెలుగుజాతి’, ‘కన్నడ జాతి’, ‘తమిళ జాతి’, ‘బెంగాల్ జాతి’, ‘హిందీ జాతి’, ‘అస్సాం జాతి’ వంటివి ఉన్నట్టయితే , ఒకటే అయిన ‘్భరత జాతి’ ఏమయినట్టు? ‘‘మనం తెలుగుభాషా జనసముదాయం. మన సంస్కృతి భారతీయత. మన జాతీయత భారతీయం.’’ అన్న విచక్షణకు దూరం కావడానికి కారణం బ్రిటిష్ వారి విద్యా విధానం ఫలితంగా స్వజాతీయ స్పృహ లోపించడమే! అందుకే దేశంలోని ఒక్కొక్క భాషా సముదాయాన్ని - లింగ్విస్టిక్ కమ్యూనిటీ - ఒక ప్రత్యేక జాతి- నేషన్-గా ప్రచారం చేసుకోవడం మొదలైంది. జాతీయ సమైక్యతకు ఇది గొడ్డలిపెట్టు! ఈ గొడ్డలి పనిచేస్తున్నంతకాలం జాతీయ సమైక్యత ఎలా సాధ్యం? తెలుగు కన్నడ హిందీ మరాఠీ పంజాబీ కాశ్మీరీ భాషా సముదాయాల వారందరూ తమ భాష ఫలానిదనీ, తమది భారత జాతి అని, తమది భారతీయ సంస్కృతి అని సహజంగా భావించనంత కాలం దేశానికి స్వాతంత్య్రం ఎక్కడ? వైయక్తిక వైపరీత్యాలను, సామూహిక అపవాదాలను పక్కకుపెట్టి అవలోకిస్తే , దేశంలోని ప్రతి భాష మొత్తం దేశానికి అద్దంలా కనిపిస్తుంది. ప్రత్యేక భాషల విభిన్న భూమికలపై అనాదిగా వికసించింది మాత్రం భారతీయత మాత్రమే!! దేశంలోని ఒక ‘మతం’ ఒక ప్రత్యేక జాతికావడం లేదు. అలాగే ఒక భాషను మాట్లాడు ప్రజలు ప్రత్యేక జాతి కాదు , ఒక ప్రాంతీయ జనసముదాయం మాత్రమే, ! తెలుగుజాతి, కన్నడ జాతి, మలయాళ జాతి, కాశ్మీరీ జాతి లేవు! కానీ ఈ ధ్యాస పెరగడం లేదెందుకు? ‘‘తెలుగు జన సముదాయం’’ అని కాక ‘‘తెలుగు జాతి’’ అని అంటున్నారెందుకు? తెలుగు భాష మాట్లాడేవారు భారత జాతిలో భాగం అన్న ధ్యాస ప్రబలనంత వరకు సాంస్కృతిక స్వాతంత్య్రం వచ్చినట్టు కాదు!
మొరార్జీదేశాయి ప్రధానిగా ఉండిన సమయంలో 1979లో అమెరికా అధ్యక్షుడు జిమీకార్టర్ మన దేశానికి వచ్చాడు. ఆ సందర్భంగా ఉభయదేశాలను సరిపోలుస్తూ వ్యాఖ్యానించిన ఒక ప్రసిద్ధ ఆంగ్ల పత్రికా రచయిత ‘‘ఇండియా ఓల్డ్ యాజ్ ఏ కంట్రీ, న్యూ యాజ్ ఏ నేషన్’’ ‘‘ అమెరికా న్యూ యాజ్ ఏ కంట్రీ ఓల్డ్ యాజ్ ఏ నేషన్’’ - ‘‘్భరతదేశం పాత దేశం కానీ కొత్త జాతి, అమెరికా కొత్త దేశం కానీ పాత జాతి!’’- అంటూ పదాల గారడీ చేశాడు భారతదేశం ప్రాచీన దేశమైనప్పుడు ప్రాచీన జాతి మాత్రం ఎందుకని కాలేదు? కొత్త దేశమైన అమెరికా ప్రాచీన జాతి ఎలా అయిపోతుంది? అన్నవి బ్రిటిష్ ప్రభువులు సమాధానం చెప్పిన ప్రశ్నలు!! అమెరికాను ఐరోపా వారు క్రీస్తుశకం పదహారవ శతాబ్దిలో దురాక్రయించారు. అప్పటి నుంచి మాత్రమే అమెరికా ఒక దేశమైనట్టు లెక్క! అందువల్ల నాలుగువందల ఏళ్ల ఐరోపా వారి చరిత్ర కలిగిన అమెరికా భారత్ కంటే కొత్తదేశం! అమెరికా క్రీస్తు శకం 1776లో బ్రిటన్‌పై తిఠుగుబాటు చేసి స్వాతంత్య్రం పొందింది. అందువల్ల అప్పుడు అమెరికా ‘జాతి’గా ఏర్పడినట్టు బ్రిటిష్ వారు, వారి తాబేదారులు నిర్ధారించారు. ఇదే కొలమానాన్ని మన మేధావులు మన దేశానికి కూడా వర్తింపచేశారు. అందువల్ల 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశం చరిత్రలోమొదటిసారిగా ‘జాతి’గా ఏర్పడిందట! అందువల్ల 1776లోనే ‘జాతి’గా ఏర్పడిన అమెరికా కంటె 1947లో ‘పుట్టిన’ మన జాతికివయస్సు తక్కువ అన్నది ఆ పత్రికా రచయిత, అలాంటి మేధావులు చేసుకున్న నిర్ధారణ! మనకు స్వాతంత్య్రం ఎక్కడ వచ్చినట్టు? ప్రపంచంలో మొదట జాతి భారత జాతి అని, ఈ జాతి కి లక్షలాది సంవత్సరాల చరిత్ర ఉందని మన దేశంలో వికసించిన చరిత్ర, సాహిత్యం ఘోషిస్తుండగా కేవలం అరవై నాలుగేళ్ల క్రితం మనం ‘కొత్త జాతి’గా అవతరించడం ఏమిటి?
శతాబ్దుల, సహస్రాబ్దుల గతంలో మన దేశాన్ని విదేశీయులు దురాక్రమించారు. ప్రతిసారీ స్వజాతీయులు ప్రతిఘటించారు. దురాక్రమణ నుండి దేశాన్ని విముక్తి చేశారు. బ్రిటిష్ వారి దురాక్రమణకు వ్యవతిరేకంగా కూడ మనం పోరాడాము, ‘స్వాతంత్య్రం’ వచ్చింది! కానీ ఒక ప్రధానమైన తేడా ఉంది! సుదూర గతంలో విదేశీయ దురాక్రమణదారులపై పోరాడిన స్వజాతి ‘‘ఎలా పోరాటం సాగించాలి?’ - అన్న విషయాన్ని స్వయంగా నిర్ణయించుకొంది. కానీ ‘‘బ్రిటిష్ వారితో మనం ఎలా పోరాడాలి!’’ - అన్న విషయాన్ని బ్రిటిష్‌వారు నిర్ధారించారు!! అందుకే స్వతంత్ర దేశంలో ఇంతటి భావదాస్యం...

No comments:

Post a Comment