Monday, November 7, 2011


ధైర్యం చెప్పే తాతలేరీ?
సెల్, కేబుల్, కంప్యూటర్‌తో కుటుంబాలు ఛిన్నాభిన్నం
విద్యార్థులపై 'ఏబీసీడీ' ప్రభావం.. బీవీ పట్టాభిరాం

తల్లిదండ్రులు, పిల్లల మధ్య సఖ్యత ఉండాలి
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పిలుపు
ఇంట్లో.. కాలేజీలో వదలని టార్గెట్ల గోల
తల్లిదండ్రులతో మావి భారత్-పాక్ సంబంధాలు
'యంగిస్థాన్'లో విద్యార్థుల మనోభావం!
సూరంపాలెం (గండేపల్లి)/కాకినాడ, నవంబర్ 7 : తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల సముదాయంలో సోమవారం జరిగిన 'యంగిస్థాన్' కార్యక్రమం లో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' ఎండీ వేమూరి రాధాకృష్ణ చర్చను ప్రారంభించారు. తల్లిదండ్రులు పిల్లల బాగోగులే కోరుతారని, పిల్లలు కూడా కొన్ని విషయాల్లో వారిని అర్థం చేసుకోవాలని సూచించారు. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య సఖ్యత నెలకొన్నప్పుడు వారి మధ్య అంతరాలు తగ్గుతాయన్నారు.

పాతికేళ్ల కిందటితో పోల్చితే నేటి విద్యావిధానంలోని వ్యత్యాసాన్ని ముఖ్య అతిథిగా హాజరైన వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ వివరించారు. లోగడ తాతా-మనవళ్ల సంబంధం నేడు పూర్తిగా కొరవడిందన్నారు. అప్పట్లో ఫెయిలైన విద్యార్థిని తండ్రి మందలిస్తే తాత చేరదీసి, ధైర్యం చెప్పేవారన్నారు. అయితే చాలామంది తాతలు వృద్ధాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తుండటంతో ఈ అనుబంధాలు కనుమరుగయ్యాయన్నారు.

సెల్, కంప్యూటర్, కేబుల్ (సీసీసీ)... ఈ మూడూ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. ఇటీవలి సినిమాల్లో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను జోకర్లుగా చూపడంవల్ల సమాజంపై విపరీత ప్రభావం పడుతోందన్నారు. రాధాకృష్ణ మాట్లాడుతూ... నేటి ప్రపంచంలో కమ్యూనికేషన్ వ్యవస్థ విషవలయంగా మారిందన్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబంలో అరమరికలు లేకుండా అన్యోన్యంగా మాట్లాడుకుంటున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయని విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రశ్నించారు.

ఓ విద్యార్థిని మాట్లాడుతూ... తల్లిదండ్రులు అండగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తామంది. ఇంజనీరింగ్ చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయనుకోవడం పొరపాటనీ చెప్పింది. ముఖ్యంగా పిల్లలపై వారికి అపనమ్మకం ఉండరాదని చెప్పింది. ఈ ధోరణి తొలగనంతకాలం పిల్లలు, తల్లిదండ్రుల నడుమ బంధా లు భారత్-పాక్ సంబంధాల్లా ఉంటాయని కుండబద్దలు కొట్టింది. అయితే, తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత స్థితిని కాంక్షిస్తారని, వారు కూడా బాగా చదువుకుని కన్నవారికి పేరు తేవాలన్నారు.

ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ... దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తేగానీ కుటుంబాలు గడవని స్థితి ఉందని, తల్లిదండ్రుల నీడలో బతికినంత కాలం ఇబ్బందులు ఏమాత్రం కనిపించవని... తమ కాళ్లపై నిలబడితేనే సమస్యలు తెలుస్తాయని పేర్కొన్నారు. మగ పిల్లలకన్నా ఆడ పిల్లలే కుటుంబం మీద శ్రద్ధ పెడతారని ఓ విద్యార్థిని తల్లి కనకరత్నం చెప్పారు. ఎనిమిదో తరగతి నుంచే పిల్లలను మరబొమ్మల్లా, పుస్తకాల పురుగుల్లా తయారుచేస్తున్న తల్లిదండ్రుల వైఖరి లో మార్పు రావాల్సిందేనని పట్టాభిరామ్ అన్నారు. పిల్లల శక్తి, సామర్థ్యాల ను అంచనా వేయకుండా ఒత్తిడి తేవడం తప్పన్నారు.

యాటిట్యూడ్, బిహేవియర్, కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్ (ఏబీసీడీ) అనే అంశాలు విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపుతాయన్నారు. యంగిస్థాన్ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్‌రెడ్డి, కార్యదర్శి కృష్ణదీపక్‌రెడ్డి, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసరెడ్డి, సాయి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాసరావు, శ్రీ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఏబీ శ్రీనివాసరావు, డీన్ డాక్టర్ గిరీంద్రనాథ్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల క్యాంపస్ కార్యదర్శి జి.హరీశ్‌రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

"ఇంట్లో టార్గెట్ గోల.. కళాశాలకు వస్తే మళ్లీ అదే గోల.. మాకంటే ఎక్కువ మార్కులొచ్చిన వారినే ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. మా పరిస్థితులను అర్థం చేసుకోవాలనే ఆలోచన వారికి ఉండట్లేదు. అందుకే మేం మనస్తాపానికి గురవుతున్నాం''
- విద్యార్థుల ఆవేదన

"ప్రణాళికబద్ధంగా లక్ష్యం మేరకు చదవాలి. చదువు విషయంలో బలమైన కోరిక ఉండాలి. కష్టపడితేగానీ,ఫలితం సిద్ధించదని చెబుతుంటే పిల్లలేమో మేం ఒత్తిడి చేస్తున్నామంటూ మాపై అపోహలు పెంచుకుంటున్నారు.''
- తల్లిదండ్రుల వాదన

**********************************************************************************************

ఈ సర్కారును సాగనంపుదాం!
దీనికి రైతుల సమస్యలు పట్టవ్
ఇది అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం.. రైతులు తిరగబడాలి

పోరుబాట తిరుగుబాటు బాటగా మారుతుంది
రైతు సమస్యలపై జాతీయ స్థాయి పోరాటం
రైతు శ్రేయస్సే దేశ ఎజెండా కావాలి
మేమూ ఉచిత విద్యుత్తు ఇచ్చి ఉండాల్సింది
ప్రకాశం పోరుబాటలో చంద్రబాబు
చీరాల, అద్దంకి, విజయవాడ, నవంబర్ 7 : "కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతున్నల సమస్యలు పట్టడం లేదు. పెద్దలు తమ పొట్టలు పెంచుకుంటూ.. రైతుల, పేదల పొట్టలు కొడుతున్నారు. రైతులను ఆదుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలి. ఈ పనికి మాలిన అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరూ కలిసి దండుగా తరలి రావాలి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. 'రైతుపోరుబాట'పై ప్రభుత్వం స్పందించి.. రైతులను ఆదుకోకపోతే అదే తిరుగుబాటు బాటగా మారుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

రైతు సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా.. ఈ నెల 20న పాటియాలాలో రైతు సదస్సు జరుగుతుందని చెప్పారు. "రైతులను కదిలించేందుకు.. అఖిల భారత స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తున్నాం. రైతు సమస్యలపై ఈ నెల 21న ఢిల్లీలో అఖిల పక్ష భేటీ నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా.. ఉద్యమ అజెండా రూపొందించనున్నాం. 22 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన విధానంపై చర్చిస్తాం'' అని తెలిపారు.

వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే రైతు శ్రేయస్సే.. దేశ అజెండా కావాలని ఉద్ఘాటించారు. 'రైతు పోరు బాట'లో భాగంగా టీడీపీ అధినేత సోమవారం ప్రకాశం జిల్లాలో 17 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పర్చూరు నియోజకవర్గం వింజనంపాడు, పోలూరు తదితర గ్రామాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. యద్దనపూడిలో జరిగిన బహిరంగసభలోనూ ప్రసంగించారు.

పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లే ముందు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలోనూ విలేకరులతో మాట్లాడారు. పంటలన్నీ ఎండి రైతులు దయనీయస్థితిలో ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. రైతు రోడ్డెక్కి పోరుబాటకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు విషయంలో తమ హయాంలో పొరపాటు జరిగిందని అంగీకరించారు. తాము కూడా ఉచిత విద్యుత్తును ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

అరక పట్టి.. రైతులతో భోజనం చేసి..!!
ప్రకాశం జిల్లాలో సాగిన పోరుబాటలో.. రైతులు తమ కన్నీటి గాథలు చెప్పినప్పుడు.. చంద్రబాబు చలించిపోయారు. ఎదుగుదల లేని పత్తి, జూట్, మిర్చి తోటలను పరిశీలించి, పెట్టిన పెట్టుబడుల గురించి అడిగి తెలుసుకున్నారు. వింజనంపాడు, పోలూరు మధ్య పంటలు లేకుండా ఖాళీగా ఉన్న పొలాలను పరిశీలించారు.

అనంతవరం సమీపంలో ఎద్దుల అరక తోలారు. చిలుకూరివారిపాలెం సమీపంలో ట్రాక్టర్ నడిపారు. పొలాల్లో జమ్మి చెట్టు కింద రైతులతో కలసి భోజనం చేశారు. మధ్యాహ్నం 12.10 నిమిషాలకు రైతు పోరుబాట ప్రారంభం కాగా మండుటెండను సైతం లెక్క చేయకుండా చంద్రబాబుతో కలిసి తెలుగు తమ్ముళ్ళు నడిచారు. బాబు పాదయాత్రకు రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.


 *******************************************************************************
ఆధార్‌ నిరాధార్‌
aadharహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆధార్‌ కార్య క్రమం అయోమయంగా మారింది. ఆధార్‌ కార్డుల జారీలో అంతులేని జాప్యం జరుగుతోంది. దీనికితోడు తాజాగా యూఐడీఏఐ (యునిక్‌ ఐడెండిటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా)కి, కేంద్ర హోం శాఖకు మధ్య ఆధార్‌ కార్డుల జారీ అంశంలో నెలకొన్న విభేధాలు మరింత జాప్యానికి ఆజ్యం పోస్తున్నాయి. యూఐడీఏఐ చేయాల్సింది కేవలం ఆధార్‌ నెంబర్లను కేటాయించడమేనని, కార్డులు జారీ చేయడం కాదని కేంద్ర హోం శాఖ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఆధార్‌పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆధార్‌ ఉంటుందా లేదా అన్న సందే హాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా మన రాష్ట్రంలో ఆధార్‌ ప్రక్రియ ప్రారంభమై 14 నెలలు కావస్తున్నప్పటికీ జారీ చేసిన కార్డుల సంఖ్య అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. తొలిదశ పైలెట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో మొదటగా ఏడు జిల్లాలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఈ మేరకు తొలిదశ కింద అదిలాబాద్‌, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంత పురం, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఆధార్‌ వివరాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా జిల్లాల్లో దాదాపు 3 కోట్ల మందికి సంబంధించిన ఆధార్‌ వివరాలను సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దరఖాస్తు కార్యక్రమం పూర్తయిన తర్వాత 90 రోజులలోగా ఆధార్‌ కార్డులు జారీ అవుతాయని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యూఐడీఏఐ పేర్కొంది. కానీ మనరాష్ట్రంలో ఇప్పటి వరకు ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం సగం మందికి కూడా ఆధార్‌ కార్డులు అందలేదు.

అయితే యూఐడీఏఐ అధికారులు మాత్రం రాష్ట్రంలో కోటిమందికి ఆధార్‌ కార్డులను జారీ చేసినట్లు చెబుతున్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే కార్డులు అందుతాయని చెబుతున్నారు. మనరాష్ట్రం నుంచి దాదాపు రెండు కోట్ల మేరకు ఆధార్‌ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని త్వరలోనే దరఖాస్తుదారులకు ఆధార్‌ కార్డులు జారీ అవుతాయని అధికారులు చెబుతున్నారు.అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు రెండు కోట్ల మందికి ఆధార్‌ కార్డులు అందలేదని స్పష్టమ వుతోంది. అంతేగాక దరఖాస్తు చేసుకుని ఏడాది దాటినటు వంటి లక్షలాది మందికి సైతం ఇంతవరకూ కార్డులు అందలేదని చెబుతున్నారు. కానీ మరికొందరికి దరఖాస్తు చేసుకున్న రెండు, మూడు నెలల్లోనే కార్డులు అందాయి. దీంతో దరఖాస్తు చేసుకుని ఏడాదైనా ఇంకా కార్డులు రాని వారిలో ఆందోళన నెలకొంది. తమకు ఏ కారణం చేత కార్డులు రాలేదోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు సైతం ప్రయత్నిస్తున్నారు. ఆధార్‌ కార్డుల జారీలో జాప్యంపై అధికారులను ప్రశ్నిస్తే జారీ అంశం రాష్ట్రం పరిధిలో లేదని, ఆధార్‌ కార్డులను కేంద్ర ప్రభుత్వమే జారీ చే స్తుందని చెబుతున్నారు. ఆలస్యమైనప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు వస్తాయని చెబుతున్నారు. దరఖా స్తుదారుల స్టేటస్‌ను యూఐడీఏఐ అధికార వెబ్‌సె ైట్‌లో తమ ఆధార్‌ దరఖాస్తు రశీదుపై ఉన్న నెంబరు, తేదీ, సమ యం వివరాలను పొందుపరచడం ద్వారా స్వయంగా తెలు సుకోవచ్చునని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా సేకరించిన ఆధార్‌ వివరాలన్నింటినీ ఢిల్లీ, బెంగళూరులలోని సెంట్రల్‌ సర్వర్‌లకు పంపుతారని, అక్కడి నుంచి దరఖాస్తులను పరిశీలించి కార్డులు (నెంబర్లు) జారీచేస్తారని ఆధార్‌కు సంబంధించిన అధికారి ఒకరు వెల్లడించారు.

త్వరలో ఆధార్‌...
ఇదిలా ఉండగా రాష్టవ్య్రాప్తంగా ఆధార్‌ సేవల విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో చేపట్టిన తొలిదశ, పైలెట్‌ ప్రాజెక్టు పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటు న్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాల లోనూ ఆధార్‌ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతు న్నారు. వచ్చే మార్చి నాటికి మన రాష్ట్రంలో ఆధార్‌ నమోదు ప్రక్రియను పూర్తి చేసే దిశగా కృషి జరుగు తోం దని చెబుతున్నారు.

ఈ కార్యక్రమం పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ వర్గాలకు అందజేస్తున్న ప్రయోజనాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర అన్ని ఆర్ధిక పరమైన సేవలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలన్నది ప్రభుత్వ ఉద్ధేశ మని, ఈ నేపథ్యంలోనే 2012 మార్చి నాటికి ప్రతి ఒక్కరికి ఆధార్‌ కార్డు (నెంబర్‌)లను అందజేయాల్సిన అవసరం ఎంతైన ఉందని ముఖ్యమంత్రి ఇటీవల పేర్కొ న్నట్లు అధికారులు తెలిపారు.

ఆరోగ్య శ్రీతో లింకు...
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన జర్నలిస్టు లకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయ నున్నట్లు గత ఏడాది సెప్టెంబర్‌ మాసంలో ప్రకటించింది. దీనికి ఆధార్‌ కార్డులతో లింకు పెట్టారు. ఆధార్‌ కార్డుతోపాటు ఆరోగ్య శ్రీ కార్డును, రేషన్‌ కార్డు స్థానంలో పౌర సరఫరాల శాఖ అందించే స్మార్ట్‌ కార్డును అందజే స్తామని తెలిపారు.ఈ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు ఐదు వేల మంది జర్నలి స్టులు దరఖాస్తు చేసుకోవడంతోపాటు, సోమాజి గూడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డీపీఎల్‌ కేంద్రంలో కుటుంబ సమేతంగా డీపీఎల్‌ కేంద్రాలకు వెళ్లి వివరాలం దించారు.

ఆ డాటాను కేంద్ర సర్వర్‌కు బదిలీ చేయడం ద్వారా అక్కడి నుంచి ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క ఆధార్‌ సంఖ్యను కేటాయి స్తారని, వాటిని నేరుగా ఇంటికే పంపుతారని తెలిపారు. కానీ ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకుని ఏడాది దాటినా ఇంత ఆధార్‌ అడ్రస్‌ లేదు. దీంతో ఆధార్‌తోపాటు దీనికి లింకు పెట్టిన ఆరోగ్యశ్రీ, స్మార్టు కార్డుల జాడలేకుండా పోయింది. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి ్రప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్‌పై నమ్మకం పోకముందే ప్రభుత్వం మేల్కోవాలన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
*************************************************************************************************************

మహానందిపై మహా నిర్లక్ష్యం
శిథిలావస్థకు చేరిన విమాన గోపురం
మూడేళ్ల కిందటే కూలిన ధ్వజస్తంభం

ఆకాశ దీపానికి వెదురు కర్రే ఆలంబన
నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలు
మరమ్మతులు చేపట్టాలన్న కమిటీ
అలసత్వం వీడని సర్కారు
నంద్యాల, నవంబర్ 7 : అక్కడ ధ్వజస్తంభం జీర్ణమైంది. దాని స్థానంలో వెదురు కర్ర ఏర్పాటు చేశారు. ఇది ఏ చిన్న గుడిలోనో.. మారుమూల ఆలయంలోనో కాదు! దక్షిణ భారతంలోనే ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో ఒకటైన మహానందిలో! ఏటా రూ.6 కోట్ల ఆదాయం వస్తున్నా.. ఆలయ ఆలనపాలన చూసే నాథుడు కరువయ్యాడు!!

మహానంది క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. క్రీ.శ. 7వ శతాబ్దంలో నందన మహారాజు నంద్యాలను కేంద్రంగా చేసుకుని పాలించేవాడు. ఆయన ఆవుల మం దలునేటి గోపవరం (నాటి గోపాలపురం)లో ఉండేవి. మేత కోసం నిత్యం దట్టమైన నల్లమల అడవిలోకి వెళ్లేవి. అయితే, మందలోని 'కపిల' అనే ఆవు ఇంటి దగ్గర పాలు ఇచ్చేది కాదు. కొండలోని ఒక పుట్ట దగ్గరకు వెళ్లి పాలు ఇచ్చేది. దీంతో అనుమానం వచ్చిన గోవుల కాపరి ఒకరోజు కపిలను వెంబడించాడు.

అడవిలోకి వెళ్లిన ఆవు.. రోజువారీగా పుట్ట దగ్గరకు వెళ్లి నిలుచుని పాలను ఇచ్చే దృశ్యాన్ని గమనించాడు. ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించగా కొంత దూరం వెళ్లి కపిల మాయమైంది. ఆవుల కాపరి ఈ విషయాన్ని మహారాజుకు చెప్పగా ఎంతో ఆశ్చర్యంతో ఆయన అడవికి వెళ్లి పుట్ట ఉన్న ప్రదేశాన్ని పరిశీలించాడు. అదే రోజు శివుడు మహారాజుకు కలలో కనిపించి అక్కడ గుడి నిర్మించాలని కోరడంతో ఆయన ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.

నాటి నుంచి ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. మహానందీశ్వరుడు, కామేశ్వరీ దేవిలను సందర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. కానుకలు, విరాళాల రూపంలో ఏటా రూ.6 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. కానీ, అభివృద్ధిలో మాత్రం ఆలయం ఆమడ దూరంలో నిలిచింది.

ప్రధానంగా మహానందీశ్వరుని గర్భగుడి విమాన గోపురం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అక్కడక్కడ పగుళ్లు ఏర్పడడంతో చిన్నపాటి వర్షానికి కూడా కారుతోంది. శ్రీకాళహస్తి విజయ గోపురం కూలిన ఘటన నేపథ్యంలో పంచాయతీరాజ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కొండలరావు ఆధ్వర్యంలో వేసిన కమిటీ కూడా మహానందీశ్వరుని గాలి గోపురానికి మరమ్మతులు చేపట్టాలని సూచించింది.

అయినా పాలకులు, అధికారుల్లో చలనం లేదు. విమాన గోపురం నానాటికీ శిథిలావస్థకు చేరుకుంటుండడంతో ఎప్పుడు కూలిపోతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆలయ ప్రధాన ధ్వజస్తంభం కూలిపోయి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు దాని స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయలేదు.

తాత్కాలికంగా ఒక వెదురు కర్రను ధ్వజస్తంభంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీని ద్వారానే ఆకాశ దీపం వెలిగిస్తున్నారు. ధ్వజస్తంభం ఏర్పాటుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చినా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా మహానంది గోపుర పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

చరిత్రకు సాక్ష్యాలు యాగంటి రాజగోపురాలు
బనగానపల్లె: విజయనగర రాజుల కాలంలో బనగానపల్లె మండలంలో యాగంటి క్షేత్రం నిర్మించారు. ఇప్పుడీ కట్టడాలు అధికారుల అలసత్వానికి నిదర్శనంగా నిలిచా యి. ప్రధానంగా రాజగోపురం నిర్మించి వందల ఏళ్లు గడుస్తున్నా అరకొర మరమ్మతులతో సరిపెట్టడం గమనా ర్హం. ఎర్రమల కొండల మధ్యగల ఈ ఆలయంలో శివుడు విగ్రహ రూపంలో దర్శనమివ్వడం విశేషం. ఇక్కడ పెద్ద బసవన్న, పర్వత సానువుల నుంచి వచ్చే జలధార, అందమైన, ఎత్తయిన కొండల మధ్య ప్రకృతి భక్తులను అలరిస్తాయి. రాజగోపురానికి స్వల్ప మరమ్మతులు చేసి నా ఆ తర్వాత ఆలనపాలన పట్టించుకోలేదు.

No comments:

Post a Comment