Wednesday, November 2, 2011



******************************************************************************

ఫీజుల వివాదం

రాష్ట్రంలోని వృత్తి విద్య కళాశాలల్లో అందరికీ ఒకటే ఫీజు విధానాన్ని అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. వృత్తి విద్య కోర్సులకు సంబంధించిన కన్వీనర్, యాజమాన్య కోటాల సీట్లకు ఒకే తరహా ఫీజును (ఏకీకృత ఫీజు) ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అందరికీ ఒకే ఫీజు విధానం అమలులోని సాధకబాధకాలను సర్కారు పరిశీలిస్తోంది.

ప్రస్తుతం అమలులోఉన్న ఫీజు విధానంలో మార్పులు తెస్తే విద్యార్థులపై అదనపు భారం పడనుంది. దాంతోపాటు బోధనా ఫీజుల పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై కూడా ఆర్థిక భారం పడబోతోంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి రీత్యా సర్కారు ఆదాయం క్షీణించిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ అదనపు భారాన్ని భరించగలిగే స్థితిలో లేదు.

ఖజానాపై పడనున్న అదనపు భారంనుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఒకే కళాశాలలో వివిధ కేటగిరీల కింద ఫీజులకు ప్రత్యామ్నాయంగా కళాశాలలను గ్రేడ్లుగా విభజించి ఫీజులను ఖరారు చేసే విధానం అనుమతికోసం రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్ళనుంది.

వృత్తి విద్య కళాశాలల్లో ఫీజుల తీరుపై గతంలో జస్టిస్ గజేంద్రగడ్కర్ నుంచి తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి. రఘురామ్ వరకు అనేక తీర్పులు వెలువడ్డాయి. 1987లో జస్టిస్ జీవన్ రెడ్డి ఫీజుల తీరుతెన్నులపై ఇచ్చిన తీర్పే ప్రస్తుతం అమలులో ఉంది. ఇప్పటిదాకా వృత్తి విద్యా కాలేజీల్లో మొత్తం సీట్లలో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటా (కేటగిరీ-ఎ) కింద ప్రభుత్వం భర్తీ చేస్తుంది. 30 శాతం సీట్లు మేనేజ్ మెంట్ కోటా (కేటగిరీ-బి) కిందకు వస్తాయి.

కన్వీనర్ కోటా సీట్లకు 31వేల రూపాయలు, మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు 95వేల రూపాయలు ట్యూషన్ ఫీజు అమలులో ఉంది. వృత్తి విద్యా సంస్థల్లో కేపిటేషన్ ఫీజును రద్దు చేసిన నేపథ్యంలో ఇలాంటి విధానం రూపొందింది. అయితే ఈ అసమాన, రాజ్యాంగవిరుద్ధమైన ఫీజుల విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఏకీకృత ఫీజుల విధానాన్ని ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు ప్రకారం అంచనా వేస్తే కన్వీనర్ కోటా 85 శాతం, ఎన్ఆర్ఐ కోటా 15 శాతంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఎన్ఆర్ఐ సీటుకు ప్రస్తుతం వసూలు చేస్తున్న ఐదు వేల డాలర్ల ఫీజును పెంచుకునేందుకు కూడా హైకోర్టు వెసులుబాటు కల్పించింది. అయితే ఆ డబ్బును ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు రాయితీగా ఉపయోగించాలని (క్రాస్ సబ్సిడీ) హైకోర్టు ఆదేశించింది. టిఎంఏ పాయ్, ఇనామ్‌దార్ కేసులపై వచ్చిన తీర్పులు, సుప్రీంకోర్టు ధర్మాసనం సూచనల నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల్లోని వృత్తి విద్య కళాశాలలు ట్యూషన్ ఫీజులను సొంతంగా నిర్ణయిస్తాయి. అదే తీరులోనే రాష్ట్రంలోని వృత్తి విద్య కాలేజీల యాజమాన్యాలు కూడా తమ సంస్థ వ్యయానికి అనుగుణంగా విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులను వసూలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలో చేసిన సూచనలను హైకోర్టు సమర్థించడం పట్ల యాజమాన్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

బి కేటగిరీ కోసం వసూలు చేసిన ఫీజుల్లో కొంత భాగాన్ని ఎ కేటగిరిలోని రియింబర్స్‌మెంట్ విద్యార్థుల ఖాతాలోకి బదలీ చేస్తున్న పద్ధతిని యాజమాన్యాలు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయి. అదీ కాకుండా ఎ కేటగిరీ ఫీజులను ఆయా కాలేజీల ఆదాయవ్యయాలతోను, మౌలిక సదుపాయాల కల్పన, సీనియారిటీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయంతో వారు విభేదిస్తున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఈడీ, ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సులతో ఉన్న వృత్తి విద్య కళాశాలలు దాదాపు 3వేల దాకా ఉన్నాయి.

హైకోర్టు తీర్పు ప్రకారం కాలేజీల్లో సౌకర్యాలు, యాజమాన్యాల ఖర్చులు బట్టి ట్యూషన్ ఫీజులను స్థిరీకరిస్తే కేటగిరీ-ఎ లో అమల్లో ఉన్న ఫీజు దాదాపు 50 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. 2010లో అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎ.ఎఫ్.ఆర్.సి.)కి కాలేజీల యాజమాన్యాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రాతిపదికగా తీసుకొని రెండు కేటగిరీల సగటు ఫీజును 56,560 రూపాయలుగా ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే హైకోర్టు నిర్ణయం సాధారణ విద్యార్థులకు పెనుభారం కానుంది.

ట్యూషన్ ఫీజుల కేటగిరీలకు సంబంధించి జీఓలు 76,77,85,86 హైకోర్టు రద్దు చేసింది. ఏఎఫ్ఆర్ఎస్ కొత్తగా నిర్ధారించిన ఫీజులను గత విద్యా సంవత్సరం నుంచి వర్తింప జేయాలని, కాలేజీలు, కోర్సులవారీగా ఈ ఫీజులను నిర్ణయించాలని హైకోర్టు ఆదేశించింది. అందుకు తగిన యంత్రాంగం లేకపోతే ఔట్‌సోర్సింగ్‌ను సైతం వినియోగించుకోవాలని తెలిపింది.హైకోర్టు తీర్పును అమలు చేసినట్లయితే ఇప్పటికే కన్వీనర్ కోటాలో చేరినవారు అదనంగా చెల్లించవలసి ఉంటుంది.

అదే సమయంలో యాజమాన్య కోటాలో చేరిన విద్యార్థులకు కొంత మొత్తాన్ని యాజమాన్యాలు తిరిగి చెల్లించవలసి వస్తోంది. దాంతో పాటు కన్వీనర్ కోటాలో చేరిన వారికి ప్రభుత్వం బోధనా ఫీజులు చెల్లింపు పథకాన్ని అమలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వంపై ఎనిమిదివందల కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడనుంది.

ఆరోగ్యశ్రీ లాంటి ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాలన్నీ నిధులులేక కుదేలయిన నేపథ్యంలో రియింబర్స్‌మెంట్ కోసం అదనపు నిధులను సర్కారు అందజేసే పరిస్థితిలో లేదు. దాంతో రియింబర్స్‌మెంట్ సమస్య ప్రభుత్వానికి తలనొప్పి కానుంది. కొత్త విధానం ప్రకారం 85 శాతం సీట్లను ఒకే కేటగిరీ కింద భర్తీ చేయడం, కొన్ని కళాశాలలు సాధారణ ఫీజును అమాంతం పెంచే అవకాశం ఉండడం వల్ల కోరుకున్న కాలేజీల్లో సీట్లు దొరక్క విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశముంది.

అవగాహన, సమాచార లోపం కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనం, బోధనా రుసుముల పథకానికి అనర్హులుగా మారారు. ఫీజులు చెల్లించమని కోరుతూ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు వృత్తి విద్య కాలేజీలలో ఒకే ఫీజు విధానం అమలులోకి వస్తే రియింబర్స్ చెల్లింపులు ప్రభుత్వానికి మరింత భారమై విద్యార్థులకు శాపంగా పరిణమిస్తుంది. రియింబర్స్ చెల్లింపుల భారాన్ని నివారించేందుకు ప్రభుత్వం వివిధ రూపాల్లో కోతలు విధించే అవకాశం లేకపోలేదు. ఆ రకంగా బలహీన వర్గాల విద్యార్థులకు చాలా నష్టం కలుగుతుంది.

ఐఐటీ కోర్సుల ఖర్చులో ఎక్కువ శాతం ప్రభుత్వమే భరిస్తున్నట్లుగా వృత్తి విద్య కోర్సుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ప్రోత్సాహకాలను అందిస్తే, అది రాష్ట్రాభివృద్ధికి తోడ్పడగలదని, ప్రస్తుతమున్న ఫీజుల విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం వలన విద్యార్థులకు లాభం చేకూరుతుందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యంత వెనుకబడి ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన జార్ఖండ్‌లోని మొత్తం 17 ఇంజనీరింగ్ కాలేజీలు దాదాపు నలభై శాతం ఉద్యోగితను కలిగి ఉంటే మన రాష్ట్రంలోని 721 ఇంజనీరింగ్ కాలేజీలు సుమారు 13 శాతం ఉద్యోగితను మాత్రమే కలిగి ఉండడం శోచనీయం.

రాష్ట్రంలో నాసిరకమైన వృత్తి విద్య కళాశాలలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుక రావడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా సాగుతున్న కాలేజీల వల్లనే రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య నాణ్యతా ప్రమాణాలు పడిపోయాయి. దానికితోడు ఏకీకృత ఫీజుల విధానం విద్యార్థులపై పిడుగులా వచ్చి పడింది. రియింబర్స్‌మెంట్ పథకం బలహీన వర్గాల విద్యార్థులందరికీ అందే విధంగా ఫీజు విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. అంతకంటే ముఖ్యంగా అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం హేతుబద్దంగా, కచ్చితంగా వ్యవహరించకపోతే రాష్ట్ర వృత్తి విద్యా రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.
********************************************************************************************************

'నటరాజ'కు ఏదీ నీరాజనం?

మన సంస్కృతిని, కళావైభవాన్ని చాటిచె ప్పే ఆంధ్రనాట్యానికి కొత్తవన్నెలు అద్దుదామని, ప్రపంచం మొత్తానికి ఆ కాంతుల్ని పంచుదామని, భాగ్యనగరంలోని తారామతి బారాదరిని నాట్యనిలయంగా తీర్చిదిద్దుదామని కలలు కన్నారు నటరాజ రామకృష్ణ. ఆ కల తీరకుండానే ఆయన కన్ను మూశారు. ఆయనకు ఇష్టమైన తారామతి బారాదరిలో ప్రభుత్వం ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. అక్కడే ఆయన స్మారకకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఆయన స్వప్నాల్ని సాకారం చేస్తామని సర్కారు ప్రకటించింది. అయితే ఆ వాగ్దానాలు అమలు చేసేదిశగా ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా పడకపోవటం అయన అభిమానుల్ని కలచివేస్తున్నది.

నాట్యం ఆయన శ్వాస
జైనుల ఆలయ సంప్రదాయ కేంద్రమైన జనగామ చేరువలోని కొలనుపాకలో జన్మించిన నటరాజ రామకృష్ణ ఉగ్గుపాల వయసు నుంచి తుది శ్వాస దాకా నాట్య వికాసం కోసం తపన పడ్డారు. నాట్యంపై ఆయన రాసిన 45 పుస్తకాల విశేషాలు విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠాలు అయ్యాయి. మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ఆయన రూపొందించి, చూపించిన ఆంధ్రనాట్యం 'పేరిణి'లు తెలుగువారి నృత్యరీతుల్ని మన నమ్మే ఆచార వ్యవహారాల్లో మనకు తెలియనివి ఎన్నెన్నో వివరించి చెప్పాయి.

రాష్ట్ర నృత్య అకాడమీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ ఆస్థాన నాట్యాచార్యగా ఆయన చేసిన కృషి, సరికొత్త నాట్య బృందాలని, శిష్యగణాన్ని తయారుచేసింది. బౌద్ధం, వైష్ణవం, శైవ పద్ధతుల్లో నృత్యంలో వచ్చిన కొత్తకొత్త మార్పులను అందిపుచ్చుకుని నాట్యానికి మెరుగులు దిద్దేవారాయన. 2,200 ఏళ్ల నుంచి వంశపారంపర్యంగా కొనసాగుతున్న ఆలయ నృత్య సంప్రదాయానికి 1970 ఆగస్టు 22న ఆంధ్రనాట్యంగా పేరుపెట్టి ఆధునిక తరం ముందుకు తెచ్చారాయన. రంభ, ఊర్వశి, మేనకలు స్వర్గంలో ఈ నాట్యాన్నే నర్తిస్తారనే చందంగా తెలుగునేలకు అరుదైన నాట్యరీతుల్ని ఆయన అందించారు.

నాట్యానికి అనువైన సాహిత్యం, అందుకు తగిన వాయిద్యంతో తాళం, లయ ఏర్పాటు చేసుకుని జతి, గతి, యతి, జాతి వంటివాటితో నృత్యం చేయడం రంభ సంప్రదాయంగా నిగ్గు తేల్చారు. సాముగరిడీ, మోళీ, మొగ్గలు, తలపై కుండలు, కాళ్ళకింద పదునైన అంచుల పళ్ళెం, చేతుల్లో ప్రమిదల దీపాలు, ఒత్తులు వంటి వాటితో నృత్యం చేయడం మేనక తీరుగా నిర్వచించారు. మంచి కవి పండితులు రాసిచ్చిన పదం, శ్లోకాలను తీరుబాటుగా కూర్చుని హాయిగా ఆస్వాదించే అభినయాన్ని ఊర్వశి శైలిగా పేర్కొన్నారు. వాటన్నింటినీ పుణికిపుచ్చుకుని ఆలయాల్లో ప్రదర్శించే దేవదాసీల నాట్య పద్ధతుల్ని నటరాజ రామకృష్ణ వివరించారు.

నాట్య వేదిక కోసం ఆరాటం
తెలుగువిశ్వవిద్యాలయంతో నాట్యం బోధన కోసం ఆయన సిలబస్ రూపొందించారు. పి.ఎస్.ఆర్., ఉమా రామారావు, కళాకృష్ణల సాయంతో ఆయన రూపొందించిన సిలబస్ చదివి ఇప్పటికి మొత్తంగా 12 వందల మంది నాట్య శాస్త్రంలో నిష్ణాతులయ్యారు. నిజామాబాద్, ఆర్మూరు, వరంగల్‌లోని రుద్రమపీఠం, కపిలేశ్వరపురం, రాజమండ్రి, కాకినాడ, అమెరికాలో ప్రత్యేకంగా ఆంధ్రనాట్యం పేరిణీల కోసం శిక్షణాసంస్థలను నటరాజ రామకృష్ణ శిష్యులు నెలకొల్పారు. తెలుగువారితోపాటు ఇతర దేశాలు, భాషల వారు అందులో నాట్యవిద్యలో శిక్షణ పొందుతున్నారు. ఎవరి ధోరణిలో వారు ఇస్తున్న శిక్షణలో తప్పటడుగులు పడటాన్ని ఆయన గమనించారు. అన్ని ప్రక్రియలను సమన్వయం చేసి గోల్కొండ డక్కన్ నాట్యరీతుల రాణి తారామతి - ప్రేమావతి మహల్‌ను నాట్యకేంద్రంగా ఏర్పాటు చేయాలని తలపోశారు. తన ఆలోచనలన్నీ కలబోసి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు.

అప్పటి పర్యాటక శాఖ సారథి సి.ఆంజనేయరెడ్డి ఆ నివేదికను పరిశీలించి, స్పందించారు. ఫలితంగా అత్యాధునిక తారామతి - బారాదరి రూపుదిద్దుకుంది. దాదాపుగా 20 కోట్ల రూపాయలు వెచ్చించి రూపొందించిన తారామతి - బారాదరి అసలు లక్ష్యం ఆ తరువాత రోజుల్లో అడుగంటి పోయింది. అరుదైన నాట్యవేదికను ఏర్పాటు చేద్దాం అని తలపోస్తే ఆ స్థానంలో పర్యాటక కేంద్రం ఏర్పాటు కావటంతో నటరాజ రామకృష్ణ తల్లడిల్లిపోయారు. ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కన్నీళ్లకు కొందరు చలించగా, మరికొందరు పెద్దలు వాటిని సొమ్ము చేసుకున్నారు. వరంగల్‌లో పెద్ద ఎత్తున జరిగిన ఆంధ్రనాట్యం, పేరిణి ఉత్సవాలను 2007లో లక్షలమంది కళ్లారా చూసి పులకించి పోయారు. అప్పుడు కోరిన జాగా, వసతి వంటి వాటికి ప్రభుత్వం స్పందించింది.

వారిచ్చిన వాటిని అందిపుచ్చుకోలేక తెలుగు యూనివర్సిటీ చేతులెత్తేసింది. కళాకారులు మొత్తుకున్నా అధికారులు నిశ్చింతగా తమతమ పనుల్ని చక్కబెట్టుకున్నారు. కొలునుపాక జైనమందిరంలోని నృత్య చిత్రాలు, జాయప సేనాని పేర్కొన్న అత్తిలి చల్లవ్వ, సమస్త వేదాలు వికసించిన ముంగండ అగ్రహారం, ఆ చెంతనే గల అనాతవరంలోని దేవదాసీలు, గోదావరి తీర ప్రాంతాలు గద్వాల, ఆలంపురం, ధర్మపురి, వేములవాడ, మహబూబ్‌నగర్ జిల్లా పాలెం, హైదరాబాద్ చేరువలోని వర్గల్ తదితర ప్రాంతాల్లో నర్తనం వృత్తిగా గల కళాకారులు, దేవదాసీల బాగోగులపై నటరాజ రామకృష్ణ పలు సూచనలు చేశారు. ఆయనతోనే ఆ సూచనలు గాలిలో కలిసిపోయాయి.

ఎన్నో హామీలు.. అన్నీ గాలికే!
తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా సమస్తం నాట్య కులం కోసం ధారపోశారు నటరాజ రామకృష్ణ. ఆచరణ సవ్యంగా లేని తెలుగు యూనివర్సిటీ నుంచి నటరాజ రామకృష్ణ సెంట్రల్ యూనివర్సిటీ వైపు ఆశలు మళ్లించారు. తనకు ఉన్న సమస్తం ఆ యూనివర్శిటీ పరం చేశారు. అపురూపమైన రత్నఖచిత కిరీటం, స్వర్ణకమలం, మంచి రత్నాలు పొదిగిన కాశ్మీర్ శాలువా, ముత్యాలు, బంగారు హంస, పతకాలు, మరెన్నో షీల్డులు, పురస్కారాలన్నింటినీ సెంట్రల్ యూనివర్శిటీకి అందించారు. హైదరాబాద్ నగర నడబొడ్డున గల గోల్డెన్ థ్రెషోల్డ్‌లో పర్యాటకులను, కళాప్రేమికులను ఆకర్షించి మెప్పించేలా మ్యూజియంగా ఏర్పాటు చేస్తామని సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించింది.

యేటా నటరాజ రామకృష్ణ పేరిట నాట్య రంగ ప్రముఖులతో ప్రత్యేక ప్రసంగాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. రెండేళ్ల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో నటరాజ రామకృష్ణ స్వయంగా హాజరై తెగ సంతోష పడిపోయారు. అనారోగ్యం, వృద్ధాప్యం ఇబ్బంది పెడుతున్నా కళపట్ల ఆపేక్షతో కలసి వస్తారనుకున్న వారినందరినీ పేరుపేరునా పలకరించి మనసు మాటల్ని చెప్పేవారు. ఈ ఏడాది జూన్8న ఆయన జీవితం ముగిసిపోవడంతో శిష్యులు, అభిమానులు పెద్దదిక్కు లేనివారయ్యారు. తారామతి - బారాదరిలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ పెద్దలు పలు హామీలు కురిపించారు.

ప్రభుత్వ పరంగా నటరాజ రామకృష్ణ స్మారక చిహ్నంతోపాటు తెలుగు నాట్యరీతుల అధ్యయన కేంద్రం, పీఠం వంటిది నెలకొల్పుదామన్నారు. నేటికీ ఆ ప్రయత్నమే మొదలు కాలేదు. నటరాజ రామకృష్ణ సొంత పుస్తకాలతో మినీ డ్యాన్స్ లైబ్రరీ ఏర్పాటు చేయాలనే సంకల్పం కూడా ఆచరణకు నోచుకోలేదు. ఈలోగా ఆ గ్రంధాలు చెల్లాచెదురయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నెలకొల్పిన గ్రంథాలయం ఉనికిలో వున్నా వారికి ఆ పుస్తకాలు ఉచితంగా సేకరించవచ్చన్న స్పృహ లేకుండా పోయింది. రామకృష్ణ రాసిన పుస్తకాలన్నింటినీ చదువుదామనుకున్నా, కొనుక్కుందామనుకున్నా ఒక్కసెట్టు కూడా అందుబాటులో లేకుండా పోయింది.

ఆ కలలు సాకారం కావాలి
ఈ పరిస్థితుల మధ్య నేటి (నవంబర్ 3) మధ్యాహ్నం సెంట్రల్ యూనివర్సిటీలో నటరాజ రామకృష్ణ స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లీలా శాంసన్ సినిమా, నృత్య రంగాల్లోని నాయిక తీరుతెన్నులపై అ«ధ్యయన ప్రసంగం చేస్తారు.

నటరాజ రామకృష్ణ తొలి సంస్మరణ కార్యక్రమంలో మాటలతో పాటు చేతల నివాళి కూడా ఉండాలని కళాభిమానుల కాంక్ష. కూడకట్టే వారుంటే ఆ మహనీయుని కలలను సాకారం చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వారందరినీ కూడకట్టి, ప్రభుత్వం తగురీతిలో స్పందిస్తే సకల హంగుల సమన్వయ కేంద్రం సత్వరం రూపుదిద్దుకుంటుంది..
********************************************************************************************************







No comments:

Post a Comment