Thursday, September 15, 2011


కేజీ గ్యాస్‌ - రిలయన్స్‌ లూటీ

రిలయన్స్‌ తన చిత్తం వచ్చినట్టు కేజీ బేసిన్‌లో వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ పట్టువదలని విక్రమార్కునిలా కెజి గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే కాలం వెళ్లబుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు.
ఇటీవల వెల్లడయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక మన రాష్ట్రంలోని కృష్ణా గోదావరి (కెజి) బేసిన్‌లో రిలయన్స్‌ గ్యాస్‌ కంట్రాక్టు వ్యవహారంలో చోటుచేసున్న అనేక అవకతవకలను ఎత్తిచూపింది. గత కొన్నేళ్లుగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కేంద్రంలోను, రాష్ట్రంలోను ఈ భారీ లూటీని ఎండగట్టి, చేస్తున్న ఆందోళనల సహేతుకతను ఈ నివేదిక ధ్రువీకరిస్తున్నది. సహజ వనరుల అన్వేషణ వెలికితీతలకు సంబంధించి భారత ప్రభుత్వం, పని అప్పగించబడిన ప్రైవేటు సంస్థల మధ్య ప్రాతిపదిక ఒప్పందం అయిన ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టును (పిఎస్‌సి) రిలయన్స్‌ ఉల్లంఘించిన తీరును కాగ్‌ స్పష్టం చేసింది. పెట్టుబడి వ్యయాన్ని అనుచితంగా పెంచి ఉత్పత్తిలో అత్యధిక వాటాను రిలయన్స్‌ కాజేస్తున్న వైనాన్ని వివరించింది.
భారత దేశంలో కనుగొన్న అతి పెద్ద గ్యాస్‌ నిక్షేపాలు ధీరూబారు-1, ధీరూబారు-3 క్షేత్రాలు. అంతేకాదు, ఇవి దేశంలో అతిపెద్ద చమురు అన్వేషణా క్షేత్రాలు కూడా. ఉత్పత్తి పంపిణీ కాంట్రాక్టు ప్రకారం రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ తర్వాత కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని వదిలివేయాలి, రెండవదశ అన్వేషణ తర్వాత మరో 25 శాతం ప్రాంతాన్ని వదిలి వేయాలి. చమురు కనుగొన్న ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటిస్తారు. అంటే ఆ ప్రాంతంలో ఎంత పరిమాణంలో గ్యాస్‌ లభిస్తుంది అన్నదాన్ని బావులు తవ్వడం ద్వారా కచ్చితంగా నిర్ధారిస్తారు. డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించిన దాన్ని కాంట్రాక్టుదారు తన ఆధీనంలో ఉంచుకుంటాడు. మిగతా కాంట్రాక్టు ప్రాంతంలో 25 శాతాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అలా ప్రభుత్వం తిరిగి తీసుకున్న దానిని ఆసక్తికలిగిన ఇతర పార్టీలకు కాంట్రాక్టుకు ఇస్తుంది. కాని ఇక్కడ రిలయన్స్‌ సంస్థ మొదటి దశ అన్వేషణ ముగిసిన తర్వాత 25 శాతం మిగతా ప్రాంతాన్ని అప్పగించకుండానే రెండవ దశ అన్వేషణకు పూనుకుంది. ఆ తర్వాత 2009లో మొత్తంగా 765 చదరపు కిలోమీటర్ల కాంట్రాక్టు ప్రాంతాన్ని డిస్కవరీ ప్రాంతంగా ప్రకటించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ విధంగా దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌, చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యానికి ప్రభుత్వం కట్టబెట్టింది. మొదటి దశలో రిలయన్స్‌ తన కంట్రాక్టు ప్రాంతంలో కేవలం వాయవ్య ప్రాంతంలో మాత్రమే అన్వేషణ జరిపి, రెండవదశకు సాగిపోయింది. బావులు తవ్వి కచ్చితంగా డిస్కవరీని నిర్ధారించడానికి బదులు, భూప్రకంపనల అధ్యయనం ఆధారంగా నిక్షేపాలగురించి రిలయన్స్‌ పేర్కొన్న అంచనాలను ఆమోదించి ప్రభుత్వం మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించింది.
ఈ విధంగా మొత్తం కాంట్రాక్టు ఏరియాను డిస్కవరీ ఏరియాగా ప్రకటించడాన్ని సమీక్షించమని చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖను కాగ్‌ ఆదేశించింది. మొదటి దశ రెండవ దశ అన్వేషణ తర్వాత తిరిగి అప్పగించాల్సిన 25 శాతం ప్రాంతాన్ని కూడ నిర్ధారించమని కోరింది. మొదటి దశలో కాని, రెండవ దశలో కాని నిర్దేశిత ప్రాంతంలో, నిర్దేశిత కాలవ్యవధిలో కనుగొన్న నిక్షేపాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, కాలపరిమితి తర్వాత ఆ ప్రాంతంలో తవ్వి కనుగొన్న క్షేత్రాలను కచ్చితంగా మినహాయించాలని కూడ చెప్పింది. ఈ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని, ఎట్టిపరిస్థితిలోను మినహాయింపులు ఇవ్వకూడదని, డిస్కవరీ తర్వాత మిగిలిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని మరొకరికి కాంట్రాక్టుకు ఇవ్వడం ద్వారా ఇంధన వనరుల అన్వేషణ సంపూర్ణంగా జరుగుతుందని చెప్పింది.
కాగ్‌ నివేదిక ఎత్తిచూపిన మరొక ప్రధాన అంశం పెట్టుబడి వ్యయం అంచనాలను భారీగా పెంచడం గురించి. మొదటి దశలో కనుగొన్న వనరులను అభివృద్ధి చేయడానికి 240 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని రిలయన్స్‌ 2004లో చూపించింది. కానీ ఆ తర్వాత 2006లో అనుబంధ అంచనాలో మొదటి దశకు 520 కోట్ల డాలర్లు, రెండవ దశకు 360 కోట్ల డాలర్లు అవుతుందని చూపించింది. అనుబంధ అంచనాను ప్రభుత్వానికి సమర్పించి ఆమోదింపచేసుకోవడానికి ముందే దాని ప్రకారం అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టారు. డి-1, డి-3 క్షేత్రాలను సకాలంలో అభివృద్ధి చేయడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం లభిస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేశామని కాంట్రాక్టరు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ ఆమోదం దానంతటదే వస్తుందన్న ధీమాతో ఇలా చేస్తుంటారని కాగ్‌ పేర్కొంది.
ఇలా పెట్టుబడి వ్యయ అంచనాను పెంచడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందం ప్రకారం ఒక ఏడాదిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ, అన్వేషణా వ్యయం, అభివృద్ధికి అయిన వ్యయం కలుపుకొని ఆ ఏడాది ఉత్పత్తి అయిన దానిలో 'కాస్ట్‌ పెట్రోలియం'ను నిర్ణయిస్తారు. దానికోసం ఆ ఏడాది అయిన ఉత్పత్తిలో 90 శాతం వరకు మినహాయిస్తారు. మిగతాదాన్ని 'ప్రాఫిట్‌ పెట్రోలియం'గా గుర్తిస్తారు. ఈ ప్రాఫిట్‌ పెట్రోలియంలో కూడ మొత్తం పెట్టుబడిని బట్టి కాంట్రాక్టరుకు వాటా లభిస్తుంది. మిగిలినదే ప్రభుత్వానికి దక్కేది. వనరుల అభివృద్ధి వ్యయం అంచనా ఇలా పెరగడం వల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. ఉత్పత్తి అధికంగా జరిగే తొలి దశలో ప్రభుత్వం వాటా నామమాత్రంగా ఉంటుంది. క్రమంగా చివరికి వాటా పెరిగినా ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. అధిక వాటా ప్రభుత్వానికి లభించే సమయానికి అసలు ఆ వనరే వట్టిపోయే అవకాశం ఉంటుంది. అందుచేతనే అనేక దేశాలు పెట్టుబడి వ్యయం అంచనాల పెంపుదలపై కచ్చితమైన, నిఘాను, నియంత్రణను అమలుచేస్తున్నాయి. ఉదాహరణకు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ పెట్టుబడి వ్యయం 5 లక్షల డాలర్లు పెరిగితే దాన్ని ప్రభుత్వ ప్రతినిధులు కూడ సగం మంది ఉండే మేనేజింగ్‌ కమిటీ ఆమోదించి తీరాలని నిబంధన విధించింది. అలాంటి పద్ధతి మనకు లేదు.
మరొక ముఖ్యమైన అంశం గ్యాస్‌ ధర. ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వలోని సాధికార కమిటీ రిలయన్స్‌ గ్యాస్‌కు ఒక ఎంఎంబిటికి 4.2 డాలర్ల ధరను నాలుగేళ్ల క్రితమే ఆమోదించింది. ఇది అంతకుముందు రిలయన్స్‌ సంస్థ ఎన్‌టిపిసికి సరఫరా చేస్తానన్న 2.34 డాలర్ల కన్నా ఎక్కువ. అంబానీ సోదరులు తమ ప్రైవేటు ఒప్పందంలో అంగీకరించుకున్న 2.25 డాలర్ల కన్నా ఎక్కువ. 4.33 డాలర్లను అనుమతించమని రిలయన్స్‌ చేసిన ప్రతిపాదనను 0.1 శాతం తగ్గించి ప్రభుత్వం ఆమోదించింది. దీని మూలంగా ఆ గ్యాస్‌ను వినియోగించే విద్యుత్‌ కేంద్రాలు, ఎరువుల ఫ్యాక్టరీలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అంతిమంగా భరించేది ప్రజలే. గ్యాస్‌ను వెలికి తీయడానికి ఒక ఎంఎంబిటికి ఒక డాలరుకు మించి ఖర్చు అవుతుందని ప్రపంచంలో ఎక్కడా ఎవరూ చెప్పలేదని నిపుణులు ఎన్ని సార్లు మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు దీన్ని కాగ్‌ ప్రశ్నించినా ప్రభుత్వం నుండి మౌనమే సమాధానం.
ఆరంభంలోనే చెప్పినట్లు ఈ అన్ని అంశాల గురించి చాల కాలంగా పోరాటం చేస్తున్నది సిపిఎం పార్లమెంటు సభ్యుడు తపన్‌ సేన్‌. 2006 డిసెంబరు 21న మొదలుపెట్టి అనేక లేఖలను పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖకు రాశారు. వాటి కాపీలను ప్రధానమంత్రికి పంపించడంతోపాటు నేరుగా ఆయనకూ లేఖలు రాశారు. రాష్ట్రానికి చెందిన అప్పటి సిపిఎం పార్లమెంటు సభ్యులు పి. మధు, ఎం. బాబూరావు ప్రధానికి లేఖ రాస్తూ కెజి బేసిన్‌లో రిలయన్స్‌ వెలికితీసే గ్యాసుకు నిర్ణయించిన అహేతుకమైన ధర గురించి, అన్యాయమైన ఉత్పత్తి పంపిణీ ఒప్పందం గురించి ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ముందుగా మన అవసరాలకు వినియోగించాలని, ఆ తర్వాతనే బయటికి తరలించాలని కోరారు. సహజవనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50 శాతం కేటాయించాలని 12వ ఆర్థిక సంఘం చెప్పినదాన్ని అమలుచేయాలని, లేదంటే ప్రభుత్వానికి లభించే గ్యాస్‌లో అయినా 50 శాతం ఈ రాష్ట్రానికి వినియోగించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ 2007లోనే ఈ అంశంపై సిపిఎం ఎంపీల లేఖలు, పొలిట్‌బ్యూరో ప్రకటనలతో పాటు, పలువురు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలతో ఒక బుక్‌లెట్‌ను ప్రచురించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఈ బుక్‌లెట్‌ ముందుమాటలో ''సహజవాయు నిక్షేపాలు రాష్ట్రంలో లభిస్తున్నప్పటికీ వాటి అభివృద్ధి మీద, వినియోగం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు. పెత్తనమంతా కేంద్రానిదే. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాలలో భాగంగా ఇప్పుడంతా ప్రైవేటు సంస్థలదే రాజ్యంగా మారిపోయింది. ముఖ్యంగా రిలయన్స్‌ సంస్థ గుత్తాధిపత్యాన్ని సంపాదించి తన చిత్తం వచ్చినట్లు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వమేమో నామమాత్రంగా లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నది.'' అని ఘాటుగా విమర్శించారు. అంతేకాదు, కెజి బేసిన్‌ గ్యాస్‌పై రాష్ట్రానికే హక్కు అని నినదిస్తూ ఏ ప్రాంతమయితే ఆ గ్యాసుతో పారిశ్రామికవంతం అవుతుందో ఆ కోస్తా ప్రాంతంలో సిపిఎం ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. వాస్తవం ఇది కాగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పట్టువదలని విక్రమార్కునిలా కెజి బేసిన్‌ గ్యాస్‌ కోసం కృషి చేశారని కొందరు చేస్తున్న ప్రచారం అర్ధం లేనిది. ఆయన రాష్ట్రానికి కోరిన గ్యాస్‌ వాటా 10 శాతం మాత్రమే. దాన్నీ ఆయన సాధించలేకపోయారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళతానని మాటలతోనే సరిపుచ్చారు. కేంద్రానికి విజ్ఞప్తులతోనే పరిమితమయ్యారు. పైగా ఆంధ్రప్రదేశ్‌ను పెట్రోలియం, కెమికల్స్‌,పెట్రోకెమికల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జోన్‌గా తయారుచేస్తానని ఒక వైపున గొప్పలు చెప్పుకొంటూ, తన ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకున్న కాకినాడ ఓఎన్‌జిసి రిఫైనరీ బయటికి తరలిపోతున్నా అడ్డుకోలేకపోయారు.

No comments:

Post a Comment